Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మహా' ప్రభుత్వాన్ని కూల్చే పనుల్లో బీజేపీ!
ముంబయి : దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ముంబయి మహానగరం కరోనా వైరస్ పేరు చెబితే చాలు వణికిపోతున్నది. ఈ కరోనా వైరస్ సమస్య నుంచి ఎలా బయటపడాలా? అని మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం తలపట్టుకుంది. మరోవైపు ప్రభుత్వాన్ని కూల్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. థాకరే ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని సమాచారం. గత ఏడాది నవంబరు 28న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆరు నెలల పాలనను థాకరే ప్రభుత్వం పూర్తిచేసుకుంది. శతాబ్దాలుగా తమకు మిత్రపక్షంగా ఉన్న శివసేన రాజకీయ ప్రత్యర్థులైన ఎన్సీపీ, కాంగ్రెస్లతో చేతులు కలపటం బీజేపీ పార్టీ నాయకులకు మింగుడుపడలేదు. థాకరే సీఎం అయిన మొదటిరోజు నుంచీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టడం బీజేపీ నాయకులకు సర్వసాధారణం అయిపోయింది.
గత మూడు నెలలుగా మహారాష్ట్రను కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. రోజు రోజుకీ కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతూ పోతున్నది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయలేకపోయారని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ రాజ్యసభ ఎంపీ నారాయన్ రాణే రెండు రోజుల క్రితం రాష్ట్ర గవర్నర్ను కలవటం రాజకీయంగా దుమారం రేపింది. మహారాష్ట్రలోని బీజేపీ సీనియర్ నాయకుల తరుచూ రాజ్భవన్కు వెళ్లటం... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్కు వినతిపత్రం ఇవ్వటం ఒక పరిపాటిగా మారింది.
మీడియా ముందు శరద్ పవార్
మహారాష్ట్ర ప్రభుత్వంపై రకరకాలుగా ఊహాగానాలు వెలువడటం సంకీర్ణ కూటమి పెద్దల్ని ఆందోళనకు గురిచేసింది. సీనియర్ రాజకీయ నాయకుడు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మళ్లీ రంగంలోకి దిగి ఏకంగా గవర్నర్ కోష్యారీని కలవాల్సి వచ్చింది. ఆరు నెలల క్రితం ఎలాంటి ఒడంబడికతో సంకీర్ణ కూటమిగా ఏర్పడ్డామో ఇప్పుడూ అదే అవగాహనతో ఉన్నామని మరోమారు శరద్ పవార్ గవర్నర్కు తెలియజేశారట. అనంతరం మీడియా సమావేశంలో పవార్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేస్తున్న కుట్రలు సాగవని ఆయన అన్నారు.