Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ సచివాలయం సన్నాహాలు షురూ
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన 37 మంది రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం ఎగువసభ సచివాలయం సన్నాహాలు షురూ చేసింది. ఈ సంవత్సరం మార్చిలో 10 రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం చేయడానికి జూన్లో రెండు రోజులను నిర్ణయించారు. కొద్దిమంది ఒక రోజు, మరి కొంతమంది మరో రోజు ప్రమాణస్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్యసభ చైర్మెన్ ఎం. వెంకయ్యనాయుడు వాటిని ఖరారు చేసిన తర్వాత తేదీలను ఎంపీలకు తెలియజేస్తారు. కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం కోసం ప్రణాళికను రూపొందించాలని వెంకయ్యనాయుడు సచివాలయాలన్ని ఆదేశించారు.
''జూన్ మొదటి వారంలో రెండు సెట్ల తేదీలు, రెండో వారానికి రెండు సెట్లు గుర్తించారు. విమానాలు, అనుసరించాల్సిన నియమాలను బట్టీ తేదీలు ఖరారు చేస్తారు. ఢిల్లీ వచ్చేందుకు ఎంపీలకు తగిన సమయం ఇవ్వాలి'' అని రాజ్యసభ సచివాలయ అధికారి తెలిపారు. జూన్ 4, 5 తేదీలకు సిద్ధంగా ఉండమని కోరినట్టు ఇద్దరు ఎంపీలు చెప్పారు. ''తేదీలు త్వరలో ధ్రువీకరిస్తారని చెప్పారు. కానీ వచ్చే గురువారం, శుక్రవారం సిద్ధంగా ఉండండి'' అని ఒక సీపీఐ(ఎం) ఎంపీ అన్నారు. 55 రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడగా, అందులో 37 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 18 స్థానాలకు భర్తీ చేయడానికి ఎన్నికల మార్చి 26న జరగాల్సి ఉంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లాక్డౌన్ 4.0 ముగిశాక... మే 31 తరువాత ఎంపీలను బ్యాచ్లుగా పిలుస్తారు. భౌతికదూరం వంటి అన్ని ప్రోటోకాల్స్ను అనుసరించి వారు చైర్మెన్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేస్తారు. సభలో ఉన్న వ్యక్తుల సంఖ్యను పరిమితం చేసే కఠినమైన ప్రోటోకాల్కు అనుగుణంగా ప్రమాణ స్వీకారణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈసారి ఎంపీల కుటుంబాలకు అవకాశం ఉండదు. ఏకగ్రీవంగా ఎన్నికైన 37 మంది సభ్యుల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రి రామ్దాస్ అథ్వాలే, శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నేత రాజీవ్ సతవ్, సీపీఐ(ఎం) నుంచి బికాస్ రంజన్ భట్టాచార్య ఉన్నారు. తమిళనాడు నుండి తిరుచ్చిశివ (డీఎంకే), ఎం.తమిదురై (అన్నాడీఎంకెే), తిమిళ్ మానీల కాంగ్రెస్ చీఫ్ జీకే వాసన్ ఎన్నికైయ్యారు. ఏప్రిల్లో కోవిడ్-19 లాక్డౌన్ ముగిసే వరకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం వేచి ఉండాలని రాజ్యసభ సచివాలయం ప్రకటించింది.