Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో కేటాయించినవే తక్కువ..అవీ కూడా ఖర్చు చేయటం లేదు
- సామాజిక భద్రతా చట్టాన్ని ఉల్లంఘించటమే : రాజకీయ విశ్లేషకులు
- రూ.1927కోట్లను వెనెక్కి తీసుకున్న మోడీ సర్కార్
- ఆడిట్ రిపోర్ట్లో తప్పుబట్టిన కాగ్
న్యూఢిల్లీ : చట్టాలెన్ని ఉన్నా ఏం లాభం? వాటిని అమలుజేయాలన్న సదుద్దేశం, కార్యదక్షత పాలకులకు ఉండాలి కదా? అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ 'సామాజిక భద్రతా చట్టం-2008'. అసంఘటితరంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికుల సంక్షేమం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పలు సామాజిక సేవా సంస్థలు, వివిధ రాజకీయ పక్షాలు, కోట్లాది మంది అసంఘటితరంగ కార్మికుల దశాబ్దాల పోరాటం ఫలితంగా ఈ చట్టం కార్యరూపం దాల్చింది. దీని ప్రకారం, ప్రతిఏటా అసంఘటితరంగ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఆయా ప్రభుత్వ శాఖలు కోరిన మేరకు నిధులు కేంద్రం విడుదల చేయాలి. 2011 నుంచి 2014 వరకు నిధుల వ్యయం కొంతమేరకు సాఫీగా సాగినా, మోడీ సర్కార్ వచ్చాక పూర్తిగా గాడి తప్పింది. ఈ విషయాన్ని 'కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్' (2016-17) నివేదికే తేల్చింది.
కాగ్...నివేదికలో ఏమన్నది?
జాతీయ సామాజిక భద్రతా నిధి(ఎస్ఎస్ఎస్ఎఫ్)కి ప్రతిఏటా కేటాయిస్తున్న నిధుల్లో కొన్ని నిరుపయోగంగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. 2010-11 నుంచి 2016-17 వరకు జరిపిన కేటాయింపుల్లో ఖర్చుచేయని నిధుల మొత్తం రూ.1927కోట్లు ఉందని లెక్కతేలింది. ఈ నిధులు తిరిగి కేంద్ర సంచిత నిధి (సీఎఫ్ఐ)కి పంపారు. కార్మికుల సంక్షేమం కోసం వినియోగించాల్సిన ఈమొత్తాన్ని వాడకపోవటంపెద్ద తప్పు. అలాంటిది నిధులు వాడటం లేదన్న సాకుతో ఏకమొత్తంగా కేంద్రం తన ఖాతాలో వేసుకోవటం చట్ట ప్రకారం నేరం కూడా! కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం 2017 మార్చిలో ఈ పనిచేసింది. ఇలా ఎందుకు చేశారు? కేంద్ర మంత్రివర్గ ఆమోదం ఉందా? అని సంబంధిత శాఖను కాగ్ ప్రశ్నిస్తే...2020వరకూ సమాధానం రాలేదు.
- 'జాతీయ సామాజిక భద్రతా నిధి'ని ఏర్పాటుచేసిన సందర్భంగా యూపీఏ-1 హయాంలో ఆనాటి కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ వెయ్యికోట్ల రూపాయల్ని బడ్జెట్లో కేటాయించారు.
- సామాజిక భద్రతా చట్టం-2008 అమలుపై కేరళ, త్రిపుర, అసోం, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలు ప్రత్యేక బోర్డులు ఏర్పాటుచేశాయి.
- సామాజిక భద్రతా నిధికి జరిపిన కేటాయింపులను అమలుజేయాల్సిన బాధ్యత కేంద్ర కార్మిక, ఉపాధి శాఖదే. ఈ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన కమిటీ సూచనల మేరకు పథకాల రూపకల్పన జరిగింది.
- ఈ పథకాల అమలుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ శాఖలు దరఖాస్తు చేసుకోగా సామాజిక భద్రతా నిధి కింద నిధుల్ని కేంద్రం విడుదల చేయాలి.