Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-గార్మెంట్ కంపనీలలో పనిచేసే మహిళా ఉద్యోగుల తొలగింపు
- శిశు సంరక్షణ కేంద్రాలను మూసేస్తున్న వైనం
- ఇది చట్టవిరుద్ధం : కార్మిక సంఘాలు
బెంగళూరు : దక్షిణ భారతదేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న వస్త్ర పరిశ్రమలలో పనిచేసే మహిళలను గార్మెంట్ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఉన్న తల్లులనైతే పనులకు రావొద్దని హుకుం జారీ చేస్తున్నారు. ఆఫీసులలో ఉండే శిశు సంరక్షణ కేంద్రాలను మూసివేస్తూ.. తల్లులను ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండానే వారిని తీసివేస్తుండటం పై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది చట్టవిరుద్ధమని అంటున్నాయి.
లాక్డైన్ నిబంధనలు సడలించడంతో ఎనిమిది వారాల క్రితమే దక్షిణాదిలో గార్మెంట్ కంపెనీలను తెరిచారు. కానీ ఆయా సంస్థలు శిశు సంరక్షణ కేంద్రాలను మూసివేస్తున్నాయి. పిల్లలు ఉన్న తల్లులు పనులకు రావొద్దని ఆదేశిస్తున్నాయి. కరోనా వైరస్ ను సాకుగా చూపి.. తల్లుల భద్రత దష్ట్యా వాటిని మూసివేస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కుతు న్నాయి. ఇందులో భాగంగానే.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న పలు వస్త్ర పరిశ్రమలు పిల్ల తల్లులు ఉద్యోగాలకు రావొద్దనీ, వారిని పనుల నుంచి తీసివేస్తున్నాయి. 30 శాతం మందితోనే పని చేయించుకుంటూ వారి శ్రమనూ దోచుకుంటున్నాయి.
దేశవ్యాప్తంగా ఈ పరిశ్రమ ద్వారా సుమారు 1 .2 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. భారత్ లోనే గాక బంగ్లాదేశ్, ఇతర ఆసియా దేశాల్లోనూ మహిళలే ఎక్కువగా పనిచేస్తున్నారు. కానీ కరోనా సంక్షోభంతో వీరి ఉద్యోగాలు ప్రమాదం లో పడ్డాయి. ఒక్క కర్ణాటక లోనే సుమారు 4 వేలమందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్టు సమాచారం. వీరంతా కార్మిక విభాగం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నా రాష్ట్రంలోని బీజేపీ సర్కారు మాత్రం వారి బాధలు పట్టించుకోలేదని ఉపాధి కోల్పోయిన మహిళలు వాపోతున్నారు. ఇదే విషయమై ఉద్యోగాలు కోల్పోయిన పలువురు మహిళలు స్పందిస్తూ... 'పిల్లలు ఉన్న తల్లులు కార్యాలయాలకు రావొద్దని సంస్థలు హుకుం జారీ చేస్తున్నాయి. మా భర్తలు దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా ఉన్నదని మేము కూడా పనుల్లో చేరాం. ఇక్కడైతే మా పిల్లల్ని కేర్ రూముల్లో ఉంచి మేము పనిచేసుకోవొచ్చు. కానీ ఇప్పుడు వాటిని మూసేశారు. రెండు, మూడేండ్ల పిల్లలని ఇంట్లో ఒంటరిగా వొదిలిపెట్టి ఆఫీసులకు ఎలా రాగలం..? లాక్డౌన్ లో పనుల్లేక ఆకలికి అలమటించాం. ఇప్పుడేమో ఉద్యోగాలనే తీసేశారు. మేము ఎక్కడికి వెళ్ళేది' అని వారు ఆవేదన చెందుతున్నారు.
ఇది చట్ట విరుద్ధం : కార్మిక సంఘాలు
పిల్లల తల్లులను ఉద్యోగాల్లోంచి తీసేయడం పై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శిశు సంరక్షణ కేంద్రాలను మూసివేయడం చట్ట విరుద్ధమైన చర్య అని గార్మెంట్ లేబర్ యూనియన్ జనరల్ సెక్రటరీ కన్నప్ప అన్నారు. నిబంధనల ప్రకారం 30 మంది కంటే ఎక్కువమంది మహిళా కార్మికులు ఉంటే ఆ సంస్థలో బేబీ కేర్ లను ఏర్పాటు చేయాలనీ, కానీ గార్మెంట్ కంపెనీలు ఆ నిబంధనలు తుంగలో తొక్కుతు న్నాయని ఆరోపించారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీకాకపోయిన వస్త్ర పరిశ్రమలు మాత్రం సంరక్షణ కేంద్రాలను మూసేస్తు న్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోవడం తో మహిళలు తీవ్ర ఒత్తిడి కి గురవుతున్నారని కన్నప్ప తెలిపారు. ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు.