Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగుళూరు: కర్నాటకలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలోని వైద్య సిబ్బంది సైతం అధిక సంఖ్యలో వైరస్ బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా బల్లారి జిల్లాలోని 47 మంది డాక్టర్లు, 108 మంది వైద్య సిబ్బందకి కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకూ 1,447 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, రాష్ట్ర రాజధాని బెంగుళూరులోనూ వైరస్ ప్రభావం పెరుగుతూనే ఉంది.రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం కేసులు ఈ నగరంలోనే గుర్తించారు. దీంతో కరోనా వ్యాప్తి అడ్డుకట్ట వేయడానికి బెంగుళూరును 8 జోన్లుగా విభజించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఒక్కోజోన్కు ఒక్కో మంత్రి బాధ్యత వహించాలని సీఎం యడియూరప్ప ఆదేశించారు. అలాగే, బెంగుళూరులో ఇప్పటివరకూ 395 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, తాజాగా మైసురులోని జిల్లా సెషన్స్ కోర్టు న్యాయవాదికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అక్కడి అధికారులు కోర్టును మూసివేశారు. శానిటైజేషన్ పూర్తైన తరువాత మళ్లీ కోర్టు తెరుచుకుంటుందని తెలిపారు. బాధితుడు క్రిమినల్ డిఫెన్స్ న్యాయవాది అనీ, విధి నిర్వహణలో భాగంగా ఇటీవల జడ్జీలు, డెస్కు క్లర్కులను కలిసాడని మైసూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలిపారు.
చేపల వ్యాపారితో 119 మందికి కరోనా
కేరళలో తాజాగా తాజాగా 339 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 6,534కు చేరింది. ప్రస్తుతం 2,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, కేరళ తీరం పుంథురాలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. మొదట ఒక చేపల వ్యాపారికి కరోనా సోకగా.. అతని వద్ద చేపలు కొన్నవారకి, అతడిని కలిసిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 119 మందికి పాజిటివ్గా తేలింది. ఇంకా మరికొంత మంది పరీక్షల ఫలితాలు రావాల్సివుందని అధికారులు వెల్లడించారు.
కరోనా భయంతో ఆత్మహత్య
కరోనా వైరస్ సోకిందేమోననే భయం.. వేరువేరు చోట్ల ఇద్దరి ప్రాణాలను హరించింది. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన కైలాశ్ కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలోనే 13 గంటల తర్వాత ఆస్పత్రి పైకప్పు నుంచి దూకాడు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతి అనంతరం వచ్చిన ఆయన కరోనా రిపోర్టు నెగటివ్గా వచ్చింది. కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలినప్పటికీ ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన మరో ఘటన ముంబయిలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ''సదరు యువకుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడనీ, ఈ నెల 2న అతడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకలేదని నిర్ధారణ అయినప్పటికీ బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డాడనే దానిపై విచారణ జరుపుతున్నాం'' అని పోలీసు వెల్లడించారు.
కోవిడ్-19 పై కొత్త ప్యానెల్: డబ్ల్యూహెచ్వో
కరోనా మహమ్మారి నేపథ్యంలో దానిపై జరుగుతున్న నిర్వహణను సమీక్షించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఓ స్వతంత్ర ప్యానెల్ను ఏర్పాటు చేసింది. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం, వివిధ దేశాల స్పందనలు తెలుసుకోవడం, మహమ్మారికి సంబంధించిన అంశాలను నిర్వచించడం వంటి కార్యక్రమాలను ఈ ప్యానెల్ నిర్వహిస్తుందని డబ్ల్యూహెచ్వో తెలిపింది. న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లర్క్, లైబీరియన్ మాజీ అధ్యక్షుడు ఎలెన్ జాన్సన్ సెర్లిఫ్లు ఈ కమిటీకి నాయకత్వం వహించనున్నారు. ఈ ఏడాది నవంబర్లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించనుంది.