Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మధ్యప్రదేశ్లో పట్టుకున్న పోలీసులు
భోపాల్ : వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న ముఠా నాయకుడు, కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబే ఎట్టకేలకు పట్టుబడ్డాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఓ ఆలయానికి వచ్చిన అతడిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి అరెస్టును మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా ధ్రువీకరించారు. వివరాల్లోకెళ్తే.. వారం రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న దూబే, గురువారం ఉదయం ఉజ్జయన్లో ఒక ఆలయానికి వచ్చాడు. ఆలయంలో పూజలు చేసి బయట తిరుగుతున్న క్రమంలో.. అక్కడే ఉన్న ఓ గార్డు అతడిని గుర్తు పట్టి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో భారీ బందోబస్తుతో అక్కడికి చేరుకున్న పోలీసుల బందం.. దూబేను అదుపులోకి తీసుకుంది. అతడిని అరెస్టుచేసి తీసుకెళ్తున్న సమయంలో.. 'నేను వికాస్ దూబేను.. కాన్పూర్ వాలాను..' అంటూ ఆయన పెద్దగా కేకలుపెట్టాడు.
దూబేను అరెస్ట్ చేయడం మధ్యప్రదేశ్ పోలీసుల గొప్ప విజయంగా మిశ్రా అభివర్ణించారు. దూబేపై తమ రాష్ట్రంలో కేసులేమీ లేనందువల్ల త్వరలోనే అతడిని యూపీకి అప్పగిస్తామని తెలిపారు. ఇక దూబే అరెస్టుపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ... 'ఆలయాలకు వెళ్లినంత మాత్రాన పాపాలను కడగలేరు. మా ప్రభుత్వం నేరస్తులెవ్వరినీ వదిలిపెట్టదు' అని ట్వీట్ చేశారు.
ఈ నెల 3న కాన్పూర్ లోని భిక్రు గ్రామంలో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల బందంపై దూబే గ్యాంగ్ కాల్పులు జరిపిన విషయం విదితమే. ఈ ఘటనలో ఓ డీఎస్పీ, ఇద్దరు ఎస్ఐలతో సహా ఐదుగురు కానిస్టేబుళ్లు చనిపోయారు. అప్పట్నుంచి పోలీసులు దూబేను పట్టుకోవడానికి యూపీలోనే గాక ఢిల్లీ, హర్యానాలోనూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అతడి అనుచారులు ఐదుగురిని ఎన్కౌంటర్ చేశారు. దూబేపై ఇప్పటికే 60 క్రిమినల్ కేసులు ఉండగా... రూ.5 లక్షల నగదు రివార్డ్ కూడా ఉంది. ఇక ఈ కరుడుగట్టిన నేరస్తుడి అరెస్ట్తో యూపీ పోలీసులు కాన్పూర్లో హై అలెర్ట్ ప్రకటించారు.