Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతున్నది. రోజువారిగా రికార్డు స్థాయిలో వేలల్లోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ముంబయి, పూణే, థానే జిల్లాలో వైరస్ ఉధృతి అధికంగా ఉంది. తాజాగా పూణేలో 1,803 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే, 39 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,399కి చేరింది. అలాగే, మరణాల సంఖ్య 978కి పెరిగింది. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మరో పది రోజుల పాటు పూర్తి స్థాయి లాక్డౌన్ విధించనున్నట్టు అధికారులు వెల్లడించారు. నాందేడు జిల్లాలోనూ ఆంక్షలు కొనసాగనున్నాయి. థానే జిల్లాలోనూ కరోనా ప్రభావం మరింతగా పెరుగుతుండటంతో అక్కడ కరోనా బాధితుల సంఖ్య 50 వేలకు చేరువైంది. ఇప్పటివరకూ అక్కడ 48,856 కేసులు నమోదుతోపాటు 1,793 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తాజాగా రాష్ట్రంలో 222 మంది మహా పోలీసులు కరోనా బారినపడ్డట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన పోలీసుల సంఖ్య 5,935కు చేరింది. మరణాల సంఖ్య 74కు పెరిగింది.
కరోనా కట్టడికి ఏం చర్యలు తీసుకున్నారు: జార్ఖండ్ హైకోర్టు
జార్ఖండ్లో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడి కోసం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలతో తమకు నివేదిక అందించాలని రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకూ 3,268 మందికి కరోనా సోకింది. అలాగే, 23 మంది ప్రాణాలు కోల్పోయారు.