Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్సభ సభ్యులతో సోనియా వర్చువల్ మీట్
- తెలంగాణ నుంచి ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్ హాజరు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో కరోనా మహమ్మారి విజంభిస్తున్న వేళ కూడా బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు కష్టజీవుల కన్నీళ్ళు తుడవలేకపోయిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. కోవిడ-19 తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులతో ఆమె శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా విజృంభణ, సరిహద్దులో చైనాతో ఘర్షణ, దాని తదనంతరం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, దిగజారిన దేశ ఆర్థిక పరిస్థితిపై ఎంపీల అభిప్రాయాలను సోనియా అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఎంపీలు కూడా ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న అంశాలు, పార్టీ పరంగా అవలంబించిన విధానాన్ని అధినేత్రికి వివరించారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సోనియాగాంధీ ప్రారంభ ఉపన్యాపం చేయగా తర్వాత పార్టీ నేత రాహుల్ గాంధీ, రాష్ట్రాల నుంచి సీనియర్ నేతలు మాట్లాడారు. కరోనా పేరుతో రెండేండ్ల పాటు ఎంపీ ల్యాడ్స్ రద్దు చేయడంపై ఆయన మండిపడ్డారు. రద్దు చేసిన వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా క్షేత్రస్థాయిలో పేదలకు అందిందేమి లేదన్నారు. పెట్రోలియం ధరలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వారు తప్పుబట్టారు.