Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రాష్ట్ర పరిధిలోని వాటికే వర్తింపు : సిసోడియా
న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో రాష్ట్ర పరిధిలోని అన్ని యూనివర్సిటీలు నిర్వహించే రాత పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. కాగా, ఇవి రాష్ట్ర పరిధిలోకి వచ్చే యూనివర్సిటీలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులతో సహా ప్రతి విద్యార్థిని...గత పరీక్షలు, సెమిస్టర్లు, ఇతర మూల్యాంకనం ఆధారంగా పాస్ చేస్తామని చెప్పారు. ఈ మేరకు అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. తొలి, రెండవ, మూడవ, చివరి ఏడాదికి జరగబోయే పరీక్షలన్నీంటినీ రద్దు చేస్తున్నామని వెల్లడించారు. పరీక్షలు రాయకపోయినప్పటికీ..చివరి ఏడాది విద్యార్థులకు కూడా ఈ విధానంలో ఉత్తీర్ణులు చేసి.. డిగ్రీలు ప్రదానం చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఢిల్లీ యూనివర్శిటీ, జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ(జెఎన్యు) పరీక్షలపై కేంద్రమే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. తాము తీసుకున్న పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోడీకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విన్నవించారు. దేశ వ్యాప్తంగా కేంద్రం పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలపై కూడా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుని...విద్యార్థులకు ఉపశమనం కలిగించాలని ఆయన కోరారు.