Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కొనసాగుతున్న హైడ్రామా
- వెనక్కితగ్గని సచిన్
- బలప్రదర్శనకు రెడీ అంటున్న గెహ్లాట్..
- పైలట్ ను బుజ్జగిస్తున్న అధిష్టానం..
- కరోనా కాలంలో దేశప్రజల్ని వదలి.. బీజేపీ రాజకీయాలా? : వామపక్షాలు
జైపూర్ : వివరణలేఖతో రాజస్థాన్ లో రాజుకున్న రాజకీయ వేడి కొనసాగుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ల మధ్య తలెత్తిన విబేధాలతో ప్రారంభమైన ఈ సంక్షోభం.. అక్కడ రిసార్ట్ రాజకీయాలకు దారితీసింది. పైలట్ తిరుగుబాటుతో అలర్ట్ అయిన గెహ్లాట్.. సోమవారం తన ఇంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 102 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారనీ, తమకు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని గెహ్లాట్ మద్దతుదారులు ప్రకటించారు. అయితే అవన్నీ తప్పుడు లెక్కలనీ, సీఎంకు 84 మంది మద్దతు మాత్రమే ఉన్నదనీ, తనతో 30 మంది శాసనసభ్యులున్నారని సచిన్ ప్రకటించారు. అయితే ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా గెహ్లాట్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదనీ, మద్దతు విషయంలో సచిన్ అంచనాలు తప్పాయని అక్కడి రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలందర్నీ సీఎం ఇంటినుంచి జైపూర్ కు సమీపంలో ఉన్న ఒక రిసార్ట్ కు పంపింది.
అర్దరాత్రి ప్రకటన...
సచిన్ ఇచ్చిన షాక్ తో ఆందోళనలో పడ్డ కాంగ్రెస్.. తన చేతిలోంచి మరో రాష్ట్రాన్ని కోల్పోకోకుండా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకవైపు సచిన్ ను బుజ్జగిస్తూనే మరోవైపు ఎమ్మెల్యేలు జారుకోకుండా జాగ్రత్త పడుతున్నది. ఇందులో భాగంగానే గెహ్లాట్ కు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటలకు ఒక ప్రకటన చేసింది. మద్దతునిచ్చే ఎమ్మెల్యేలంతా ఒక లేఖపై సంతకాలు చేసినట్టు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అవినాష్ పాండే వెల్లడించారు. సచిన్ తనతో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నా.. ఆయనతో ఉన్నది 15 మంది మాత్రమే అనీ, సచిన్ తో పాటు వారు కూడా తిరిగొస్తారని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. ఈమేరకు కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, అహ్మద్ పటేల్, కె.సి. వేణుగోపాల్ ఆయనతో మంతనాలు జరిపారని సమాచారం.
సీఎల్పీ భేటీకి ఇద్దరు మంత్రుల డుమ్మా
గెహ్లాట్ ఇంట్లో జరిపిన సమావేశానికి ఇద్దరు మంత్రులు రాలేదని సమాచారం. పర్యాటకశాఖ మంత్రి బిష్వేంద్ర సింగ్ తో పాటు మరో మంత్రి కూడా హాజరుకాలేదు. ఆ భేటీకి 10 మంది స్వతంత్రులతో కలిపి 92 మంది ఎమ్మెల్యేలే వచ్చారని సచిన్ వర్గం ఆరోపిస్తున్నది.
అధిష్ఠానానికి 3 డిమాండ్లు..
తిరుగుబాటునేత సచిన్.. అధిష్టానం ముందు 3 డిమాండ్లు ఉంచినట్టు తెలుస్తున్నది. తన వర్గం వారిని క్యాబినెట్ లోకి తీసుకోవడం, వారికి కీలక మంత్రి పదవులు ఇవ్వడం, సచిన్ ను పీసీసీ పదవి కొనసాగించడం వంటివి ఆయన పట్టుబడుతున్నారు. డిమాండ్ల విషయంలో వెనక్కితగ్గేది లేదనీ ఆయన అధిష్టానం దూతలకు వివరించినట్టు తెలుస్తున్నది. మరి ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇదిలాఉండగా సచిన్ బీజేపీలో చేరతారనీ, సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు జె.పి. నడ్డాను కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే సచిన్ కు సీఎం పదవి ఇవ్వడానికి బీజేపీ సుముఖంగా లేదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఆయన కూడా తాను బీజేపీ లో చేరబోనని ప్రకటించారు. మరోవైపు సచిన్ సొంతపార్టీ పెట్టబోతున్నారని వార్తలు వచ్చినా అవేవీ నిజం కాదని తేలిపోయింది. కాంగ్రెస్లో నెలకొన్న రచ్చను తమకు అనుకూలంగా మలుచుకునేదిశగా బీజేపీ అడుగులేస్తున్నది. గెహ్లాట్ సర్కార్పై ఫ్లోర్టెస్ట్ నిర్వహించాలని కోరుతున్నది. ఇప్పటికే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారును గద్దెదించి అధికారపీఠమెక్కిన బీజేపీ..రాజస్థాన్లోనూ అలాంటి కుట్ర రాజకీయాలు చేస్తున్నదనీ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. కరోనా కాలంలో దేశప్రజల్ని వదలి.. బీజేపీ చేస్తున్న రాజకీయాలపై వామపక్షపార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.