Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో డిమాండ్
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా భయాందోళనల దృష్ట్యా జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను వెంటనే బెయిల్పై విడుదల చేయాలనీ, వారికి వెంటనే తగిన వైద్య సాయం అందించాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం నాడిక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి కాలంలో జైళ్లలోని పలువురు రాజకీయ, మానవ హక్కుల కార్యకర్తల ఆరోగ్యం క్షీణిస్తుండడంపై పొలిట్బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారిలో కొందరు అయితే జైలులోనే కరోనా బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయని తెలిపింది. ఈ విధంగా జనసమూహం అధికంగా ఉండే జైళ్లలోని దుర్భరమైన పరిస్థితులు, కనీస సదుపాయాల లేమి వెరసి వారి ఆరోగ్య స్థితిని మరింత దిగజారుస్తున్నదని పేర్కొంది. ప్రస్తుతం జైళ్లలో ఉంటున్న రాజకీయ, మానవ హక్కుల కార్యకర్తల్లో అధిక శాతం మందికి ఇతర అనారోగ్యాలు ఉన్నాయనీ, వారు దీర్ఘకాలికంగా వైద్యం తీసుకుంటున్నారని తెలిపింది. అఖిల్ గొగోరుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలుస్తోందని పొలిట్బ్యూరో పేర్కొంది. దీంతో పాటుగా వరవరరావు ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నది. జైళ్లలోని ఇరుకైన, అపరిశుభ్రమైన పరిస్థితులను దృష్ట్యా నకిలీ, తప్పుడు ఆరోపణలతో జైళ్లలో ఉంటున్న ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తలు గౌతమ్ నవలఖా, అనిల్ తెల్తుంబ్డే, సుధా భరద్వాజ్, సోమ సేన్, తదితరులు కరోనా వ్యాప్తి బారిన పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర రాజకీయ ఖైదీల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి కూడా బాలేదని తెలిపింది. 90 శాతం వికలాంగత్వం ఉన్న ఆయనకు 19 రకాల అనారోగ్యాలు ఉన్నాయనీ, వాటిల్లో అధికం ప్రాణాలకే ప్రమాదకరమైనవని పేర్కొంది. మానవ హక్కులపై యూఎన్ ప్రత్యేక ప్రతినిధులు కూడా అతని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని విడుదల చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని పొలిట్బ్యూరో ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో జైళ్లలోని రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.