Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కరోనా రికవరీ కేసుల్లో ముందున్న 19 రాష్ట్రాలు..
- డేటా విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలోని 19 రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సగటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. అంతేగాక కరోనా మరణాల్లోనూ జాతీయ సగటు కంటే రాష్ట్రాలే మెరుగ్గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక నివేదికను వెలువరించింది. కరోనా వైరస్ సోకి కోలుకుంటున్నవారి సగటు దేశవ్యాప్తంగా 63.02 శాతంగా ఉంటే.. లడఖ్ (85.45 శాతం), ఢిల్లీ (79.98 శాతం), ఉత్తరాఖండ్ (78.77 శాతం) ఉన్నాయి. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర, పంజాబ్, ఒడిశా, బీహార్, తదితర రాష్ట్రాలున్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 64.84 శాతంగా ఉంది.
ఇక దేశంలో మరణాల రేటు కూడా 2.64 శాతానికి తగ్గిందని కేంద్రం వెల్లడించింది. ఈ అంశంలో దాదాపు దేశంలోని రాష్ట్రాలన్నీ జాతీయ సగటు కంటే తక్కువే ఉన్నాయి. లడఖ్ (0.09 శాతం), త్రిపుర (0.1 శాతం), కేరళ (0.39 శాతం) ఉండగా తెలంగాణలో మరణాల రేటు 1.03 శాతంగా ఉంది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ లో మరణాల రేటు 2.56 శాతంగా ఉండటం గమనార్హం.
కొత్తగా నమోదవుతున్న కేసుల్లో టాప్లో..
మహారాష్ట్ర : కొత్తగా నమోదవుతున్న కేసుల విషయానికి వస్తే.. మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నది. ఈ రాష్ట్రంలో కొత్తగా 6,497 కేసులు నమోదుకాగా...మొత్తం కేసుల సంఖ్య 2,60,924కు చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1,05,935 కేసులు యాక్టివ్గా ఉండగా... 1,44,507 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 193 మంది మరణించగా... ఆ రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 10,482కు చేరుకుంది. మరణాల రేటు అక్కడ 4 శాతంగా ఉంది.
తమిళనాడు : కొత్తగా కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో కొత్తగా 4,328 కేసులు నమోదుకాగా...మొత్తం కేసుల సంఖ్య 1,42,798కి చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 48,199 యాక్టివ్ కేసులునానయి.. గత 24 గంటల్లో 66 మంది మరణించగా... ఆ రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 2,032కు చేరుకుంది.
కర్నాటక : తాజా కేసుల్లో కర్నాటకది మూడో స్థానం. ఆ రాష్ట్రంలో కొత్తగా 2,738 కేసులు నమోదుకాగా... మొత్తం కేసుల సంఖ్య 41,581కి చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 24,576 యాక్ట్వి కేసులున్నాయి. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 73 మంది మరణించగా... వైరస్ మరణాల సంఖ్య 757కు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ : కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల పరంగా ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలుస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 1935 కేసులు నమోదుకాగా...మొత్తం కేసుల సంఖ్య 31,103కి చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 14,274 యాక్ట్వి కేసులు ఉండగా...16,464 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో ఏపీలో 37 మంది మరణించగా...ఆ రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 365కు చేరుకుంది.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ అయిదో స్థానంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో కొత్తగా 1,654 కేసులు నమోదుకాగా...మొత్తం కేసుల సంఖ్య 38,130కి చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 12,972 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24,203 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 21 మంది మరణించారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య సంఖ్య 955కు చేరుకుంది.
కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యలో తెలంగాణ ఆరో స్థానంలో, పశ్చిమబెంగాల్ ఏడో స్థానంలో బీహార్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.
లాక్డౌన్లోకి బీహార్...!
అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెలాఖరు వరకు మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నట్టు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ మంగళవారం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు ఈ నెలాఖరు వరకు మూసివేయాలి.
ప్రార్థనా మందిరాలకు భక్తులను అనుమతించరు. వ్యవసాయ, నిర్మాణ రంగ పనులకు అనుమతి ఉంటుంది. ఇక కేవలం నిత్యావసర దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించారు.
బీహార్లో ఇప్పటి వరకు 17,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 12,364 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 134 మంది మరణించారు.
మూడో దశకు చేరుకోలేదు : కేంద్రం
దేశంలో వైరస్ మహమ్మారి సామాజిక వ్యాప్తి చెందిందంటూ వస్తున్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ఈ దశలోకి మనం ఇంకా అడుగుపెట్టలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. దేశం ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ధారావి, ముంబై వంటి వంటి ప్రదేశాల్లో స్థానిక సంక్రమణ ప్రారంభమైనప్పటికీ దాన్ని సమర్థవంతంగా నియంత్రించామని తెలిపారు. ముఖ్యంగా దేశంలో కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ రికవరీ రేటు దాదాపు 60 శాతంగా ఉండటం సానుకూల అంశంగా పేర్కొన్నారు.