Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెలంగాణ భాష - సంస్కృత పదాలు' అనే గ్రంథం డా|| నలిమెల భాస్కర్ రాసిన పదిహేను వ్యాసాల సంపుటి. పదునాల్గు భాషలతో బాగా పరిచయం ఉన్న భాస్కర్ పదునాల్గు రోజులలో పదిహేను వ్యాసాలు రాయడం అతనికి మాత్రమే సాధ్యం.
సంస్కృతం పూర్వం అధికార భాషగా ఉన్నప్పుడు దేశ భాషల్లోకి బాగా చొచ్చుకొనిపోయి, భాషల మీద ప్రభావం చూపిందని, తెలుగు ద్రావిడ భాష అయినప్పటికీ ముప్పై నుండి నలభై శాతం పద సముదాయం సంస్కృతానిదేనని, అందువల్ల తెలుగుకు పరిపుష్టి, కండపుష్టి కలిగిందని భాస్కర్ అంటాడు. 'శనగపిండి'లో కొంత బియ్యపు పిండి కలిపి గారెలూ, చెగోడీలు వంటి అప్పాలు చేస్తే ఎంత కరకరగా వుంటాయో, తెలుగు పిండిలో సంస్కత పిష్టం చేరి అద్భుతమైన, సమ్మిళితమైన పదాల పిండి వంటలు తయారయ్యాయంటాడు. ఎంత చక్కని ఉపమానం! తెలుగు, సంస్కృతాల కలయిక దేదీప్యమానం.
భాషావేత్తలలో భాస్కర్ ది ప్రత్యేకమైన శైలి. సంస్కృతము నుండి తెలుగులోకి / తెలంగాణ తెలుగులోకి ఆయా పదాలు మారిన తీరు గురించి ఆయన వివరించడం కొత్తగా, ఆసక్తిదాయకంగా ఉంటుంది.
''వత్తుల్ని అంటించడం ద్వారా వచ్చే సుగంధాలు అనుభవిద్దాం'' అంటూ 'అగరుబత్తుల' గురించి చెబుతాడు. 'అధ్వానం' 'అద్మాన్నం' ఎలా అయిందో చెబుతూ ద్విత్వం రావడం తెలంగాణ భాషలో సర్వసాధారణం అంటూ
''పాపాయి కన్నుల్లు కలువరేకుల్లు / పాపాయి చేతులు పొట్లకాయల్లు''
అనే పాటను ఉదహరిస్తాడు. తట్టతట్ట, గొర్రగొర్ర, బర్రబర్ర, బొయ్యబొయ్య వంటి మాటలు జానపదుల నోళ్లలో జాలువారుతూ అర్థాన్ని ఎలా హత్తుకుపోయేట్లు చెబుతాయో వివరిస్తాడు. సంస్కృత పదం 'అనాయాసం' ఎటువంటి ఆయాసం లేకుండా తెలంగాణలో 'సునా యాసం' అయిందంటూనే, ప్రతి పదాన్ని మనకు సునాయాసంగా అర్థమయ్యేట్లు చేస్తాడు. 'అన్యాయం' 'అన్నాలం'గా మారితే పండితులు గుండెలు బాదుకోనక్కరలేదని, ప్రజానీకం మాట్లాడుతున్న ప్రతి మాటనూ కళ్లకద్దుకోవాలని, పాఠకులకు ఆ పదాల పట్ల గౌరవం పెరిగేలా చేస్తాడు. 'అలసాంద్రము' నుండి 'అల్మింతలు' ఏర్పడ్డాయని, అలా మారడంలో మనకు ఏ చింతలూ వద్దంటాడు. 'అవతారం' ఎన్ని అవతారాలు ఎత్తిందో చెబుతాడు. సంస్కృత జన్యాలను తెలంగాణ జనాలు హాయిగా వాడుతు న్నారని తెలుస్తాడు. 'ఉత్తరిచ్చుడు' గురించి భాస్కర్ చెప్పింతర్వాత ఇక మనం ఉత్తరిచ్చేదేం వుండదు. 'ఉష్ణం' సంస్కతమేనంటూ 'ఉప్పు తింటే ఉష్ణం - పప్పు తింటే పైత్యం' సామెతను ఉదహరిస్తాడు. భాస్కర్ 'ఆత్మగల్ల మనిషి' కాబట్టి 'ఆత్మ'ను గురించి ఆత్మీయంగా చెప్పాడు.
ఆదివారం 'అయితారం' అయితేనేం? భావ ప్రకటనకు పనికి వస్తుందని అంటాడు. మొసమర్రని పని వలన ఉన్నది వున్నట్లుగా పలికేంత వ్యవధి సామాన్య జనానికుండదని, వాళ్లనోట ఆలస్యం 'ఆలిశెం' అవుతుంది, ఆశ్లేషము 'అసలేరు' అవుతుందంటూ 'అసలేటి ముసలెడ్లు కట్టుకొని' అనే అంజన్న పాటను ఉదహరిస్తాడు. నలిమెల భాస్కర్ కొన్ని పదాలకు వివరణ ఎక్కువ వాక్యాలలో ఇచ్చినా, ప్రతి వాక్యమూ ఆస్వాద యోగ్యమే. ''ఆపత్తిలోని చివరి తావత్తు తెలంగాణలో ఊడిపోయింది. అయినా అర్థానికి ఏ ఆపదా రాలేదు. ఒక్క తావత్తు లోపిస్తే కొంపలేమీ అంటుకొని పోవు. యావత్తూ (మొత్తం) లోపించి మూలపదం మారితేనే ఆపద భాషకు'' అంటాడు. 'పిల్లి'ని మెల్లిగా చూద్దాం.. తెలుగు పిల్లికీ, హిందీ బిల్లీకి సంబంధం వుందని చెప్పేందుకు పెద్దగా పిల్లిమొగ్గలు వెయ్యకుండానే అవగతం అవుతోంది'' అని హాస్యోస్ఫోరకంగా చెబుతాడు.
సంస్కృత 'కతార్థం' తెలుగులో 'కుదార్తెం' అవుతుంది. ''కుదారైం ఎంత అద్భుత అర్థచ్ఛాయ కల్గిన మాటో ఓ మాటు కుదారైంగానే ఆలోచించాలి. యదార్ధంగానే యోచించాలి. అప్పుడే ఆ పదార్థం (పదానికి అర్థం) బోధ పడుతుంది'' అని మనలో ఆలోచనను రేకెత్తిస్తూనే, పదాలతో ఆకట్టుకుంటాడు. ఖాద్యం, పేయం నుండి వచ్చిన 'కాయిపాయి' గురించి చెబుతూ, గ్రామీణులకు కొన్నింటికి వ్యుత్పత్యర్థాలు తెలియకపోయినా- సందర్భోచితంగా వాడే సామర్థ్యం ఉందంటాడు. క్షమాధర్మం 'శెమ దర్మం'గా, క్షౌరం 'సౌరం'గా మారుతాయంటూ - ''పలుకరాని సంస్కృతం లోని శిలల్లాంటి గట్టి పదాలన్నీ... సుతిమెత్తని తెలంగాణ శిల్పాలుగా మారుతాయంటాడు''.
'నంబర్ ఏక్ బియ్యం' అనుదానిలో 'నంబర్' ఆంగ్లం. 'ఏక్' హిందీ లేదా సంస్కతం. ''బియ్యం' తెలుగు. ''ఇది మిశ్ర సమాసమని పండితులు భ్రుకుటి ముడిచినా, అది దుష్ట సమాసమంటూ విద్వాంసులు పెదవి విరిచినా, భాషకు ఇంత అపచారం ఏమిటని కోవిదులు ముక్కు విరిచినా భాషా ప్రాథమ్యాన్ని, ప్రాధాన్యాన్ని బాగా గ్రహించిన అసలు సిసలు వివేకవంతులు సామాన్య ప్రజలు'' అని వారికి పెద్దపీట వేస్తాడు.
మరికొన్ని పదాలను భాస్కర్ వివరించేటప్పుడు సంక్షిప్తంగా, చమత్కారంగా రాస్తాడు.
'జ్వరం'లో ''జ్వలోని వావత్తు ఉజ్వలంగా జారిపోతుంది''.
''తప్తి సంతప్తికరంగా తుర్తి అయింది''.
''దైర్నం సంస్కత ధైర్యంలోంచి వచ్చి చేరింది ధైర్యంగా.''
''పపంచం సంస్కత 'ప్రపంచం' నుంచి వచ్చిందని ప్రపంచించి చెప్పనక్కరలేదు''.
''సంస్కృత 'ప్రాణం' అనే పదాన్ని ఎంత ప్రాణప్రదంగా చూసుకుందా మనుకున్నా అది కాస్తా తెలంగాణలో 'పానం' అయి కూర్చుంటుంది''.
''ప్రజలకు 'విరామము' అని పలికే విరామము లేదు. అందుకే 'ఇరాం' అన్నారు ఆరామ్ గా''.
''స్వతంత్రము అనే పదానికి ఎంత స్వతంత్రమో ఏమిటో గాని అది తెలంగాణలో ససంత్రం అవుతుంది''.
ఇటువంటి వాక్యాలను చూచినప్పుడు - తక్కువ పదాలలో ఎక్కువ భావాన్ని అందంగా ఎలా అందించవచ్చో తెలుస్తుంది.
'పవన గుంభిత చర్మభస్త్రి సమాసాన్ని శ్రమజీవులు 'తొమ్మిది తూటుల తోలుతిత్తి'గా వర్ణిస్తారని, గొప్ప తాత్వికాంశాలను చిన్నచిన్న మాటల్లో వ్యక్తీకరిస్తారని భాస్కర్ పేర్కొంటాడు.
పల్లె ప్రజలకు మేధస్సు కన్నా మనస్సు గొప్పగా ఉంటుందని, ప్రేమైక హదయభావనలతో అల్లుకున్న పాటలు వెల్లువెత్తుతాయని, జానపద సాహిత్యం నవరస సమన్వితమై నవనవోన్మేషంగా ఉంటుందని కొనియాడుతాడు. నలిమెల భాస్కర్ ఏది రాసినా అందులో సామాజిక బాధ్యత ఎక్కువ. 'గుడుంబ' పదాన్ని వివరించి, ''ఇది ఒక రకమైన సారాయి.. మన ప్రాణసారమైతే కాదు. మనిషి నిస్సారమై కేంద్ర నాడీవ్యవస్థను దెబ్బతీస్తుంది. తప్పతాగితే తప్పుదారిన పడ్డట్లే మరి. మత్తులో గమ్మత్తున్నా మన ప్రాణానికి హిమ్మత్తు మాత్రం పోతుంది'' అంటూ హెచ్చరిస్తాడు.
'ఇసం' అనే పదం 'విషం' నుంచి వచ్చింది. గ్రామీణులు ''ఉప్పిసం'' అంటారు. రక్తపోటు వంటి వాటికి మూలమౌతున్నందున, ఆధునిక వైద్యం సైతం ఉప్పును విషంగానే ఎంచుమంటున్నది. ''ఉప్పు వల్ల వచ్చే ముప్పును ఎరిగిన కారణంగానే గ్రామీణులు ఉప్పును ఇసం అన్నారేమో'' అని ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తాడు. 'వాతం' గురించి రాస్తూ కూడ వైద్యం గురించి చెబుతాడు.
'శ్రుతి' నుండి 'సుతి' వచ్చింది. ''ఆలుమగల శ్రుతి ఒక్కటి కాకపోతే ఆ దాంపత్యంలో అపశ్రుతులు తప్పవు'' అంటూ దాంపత్యం గురించీ రాస్తాడు. 'పతివ్రత' పదాన్ని వివరిస్తూ - సమాజంలో పతివ్రతలే కాదు. సతీవ్రతులూ ఉండాల్సిన సమయమిది. పురుషులు సతీవ్రతులైతేనే సంస్కార వంతులవుతారు. ఎయిడ్స్ లాంటి భూతం (వ్యాధి) ఉండదప్పుడు'' అని పతులకు హితవు పలుకుతాడు.
''మనిషికి అన్నీ తనకే కావాలన్న తహతహ. అందరినీ తను మించిపోవాలనే అహమహమిక. అందలాలు అందుకోవాలనే ఆరాటం ఎక్కువ. పొరుగింటి పుల్లకూర పై మక్కువ'' అని మానవ మనస్తత్వాన్ని అద్భుతంగా విశ్లేషిస్తాడు.
పదాలను వివరించే సందర్భంలో కూడ ఇలా అనేక సామాజికాంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి.
''పుష్కలమైన సాహిత్యం, గొప్ప శాస్త్ర గ్రంథాలు, అద్భుతమైన జ్ఞానం సంస్కృతంలో'' ఉన్నాయని, మనకు సంస్కృతంపై గల గౌరవాన్ని ఇనుమడింపజేస్తాడు. తెలుగు అజంత భాష. నాద సౌందర్యంతో భాసిల్లుతున్న భాష. ఎట్లా మాట్లాడుతున్నామో అట్లాగే రాయడానికి వీలున్న భాష. ఇతర భాషా పదాలు చేరి పరిపుష్టమైన భాష. ''ఒక సమీకత ఆహారం లాగా, ఒక సమ్మిళిత అభివద్ధి వలె, ఒక షడ్రసోపేత భోజనం మాదిరి భాస్వంతమైన భాష'' అని తెలుగుపై మనకున్న మక్కువను ఎక్కువ చేస్తాడు.
ఈ గ్రంథంలోని వ్యాసాలలో ఒకటి - సంస్కృత పదాలు తెలుగు భాషలో పాలలో పంచదారలా ఎలా కలిసిపోయాయో చెబితే, మరొకటి - సంస్కత భాషా సంబంధంలో తెలంగాణ మాటకు కొత్తందం వచ్చిందని చెబుతుంది. ఇంకొకటి - తెలంగాణ పల్లె ప్రజల సంభాషణల్లో చాలా చక్కగా పదస్వరూపం
మార్చుకొని సంస్కృత పదాలు ఎలా కదం తొక్కుతున్నాయో తెలుపుతుంది. ఇలా పదిహేను వ్యాసాలూ దేనికదే ప్రత్యేకం. మొత్తానికి ''భాషాపరంగా చూసినప్పుడు తెలంగాణమూ, గీర్వాణమూ చెట్టాపట్టాలు వేసుకొని పట్టపగ్గాలు లేకుండా పరుగులు తీసినాయి'' అని నిరూపించడంలో డా.నలిమెల భాస్కర్ పూర్తిగా కృతకృత్యుడయ్యాడు.
- ఎ. గజేందర్ రెడ్డి,
9848894086