Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వం ఉదాత్తమైనది, చరిత్ర కంటే తాత్వికమైనది (Poetry is finer and more philosophical than history) అని గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ అంటాడు. బాలకష్ణ కవిత్వం కూడా అలాంటిదే. ఇతను కవిత్వాన్ని ఉన్నతంగా ప్రదర్శించాడు. కవిత్వంలోని తాత్త్వికతను ప్రస్తుతపరచాడు. 'జీవితమే సముద్రం, సముద్రమే జీవితం/ ఒకటేమో మాటలకం దని పాటల కడలి/మరొకటేమో ఊహలకందని కోర్కెల అడవి'. అరిస్టాటిల్ చెప్పిన లక్షణాలు ఈ పంక్తులలో కనబడుతాయి. కవి జీవితం గురించి ఉన్నతమైన తత్త్వాన్ని చెప్పాడు. ఇక్కడ చరిత్ర గురించి ప్రస్తావన రాలేదు. కేవలం కవిత్వంతోనే తాత్త్వికతను ఆవిష్కరించాడు. ఆధునిక వచన కవిత్వంలో దాదాపుగా ఎవరూ ప్రయోగించని శబ్దాలను ప్రయోగించి కవిత్వాన్ని మార్మికంగా తాత్వీకరించడం ఒక అరుదైన సంఘటన. తను రచించిన ఈ మట్టినై పుట్టాలనుంది పుస్తకాన్ని ఆచార్య ఎన్.గోపి గారికి అంకితం ఇచ్చాడు. ఇప్పటివరకు ఈ కవి మనోహరమైన భావుకతతో రసభరితమైన ప్రణయ కవిత్వాన్ని అల్లాడు. కానీ ఈ పుస్తకం సరికొత్తగా తనలోని ఉన్నతోన్నతమైన విశిష్టమైన పార్శ్వాన్ని, తనకున్న జ్ఞాన పరిపక్వతను ప్రకటిస్తుంది. అయితే ఇది సూక్ష్మ దష్టి కలిగిన పాఠకులకే బోధపడుతుంది. ఎందు కంటే కవి ప్రతి కవితను మార్మికంగా నిర్మించాడు. మచ్చుకు ''ఆ తూరుపు వీణియపై/ప్రభాత రాగం పలికిందెవరు''. ఈ పంక్తులు సూర్యుడిని సూచిస్తాయి. కాని సూర్యుడని కవి ప్రత్యక్షంగా చెప్పలేదు.చక్కని వర్ణనతో చెప్పాడు. జననీ ప్రణతి కవితలో కవి తన తల్లిపైన ప్రేమను వర్ణిస్తూ ప్రణామం చేస్తూ పలికిన వాక్యాలు విన్న ప్రతి మనిషికి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. కాలగమనం కవితలో నింగీనేలలను పెద్దలు విడదీసిన ప్రేమికులు అని అనడంలో కవికి ఆకర్షించే తర్కభావాజాలం ఉందని అర్థమవుతుంది. హదయం వసంతమై కవితలో అభ్యుదయ ఆలోచనలతో పాటు కవికి ఉన్న సమయస్ఫూర్తి ప్రస్ఫుటమవుతుంది. కాని కవి భూపాలం అని భూపాల రాగం యొక్క ప్రస్తావనతో ఆ పంక్తికే శోభను చేకుర్చాడు. మరణానికి నిర్వచనం చెప్తూ ''మరణం ఒక నిరంతర ప్రవాహం'' అని కవితను విరమించడంలోని గొప్పనైన తాత్త్వికత మానవ మేధస్సును ఆలోచింప జేస్తుంది. చెట్ల పరిరక్షణ గూర్చి చెబుతూ ఒక కొమ్మను నరికితే ఊపిరితిత్తి ఆత్మహత్య చేసుకుంటుంది అని చేతావని వినిపిస్తాడు. మానవత్వమై బతకాలి కవితలో మానవత్వం గురించి చాలా బాగ చెప్పాడు. దేవునికి కూడా మానవత్వం లేదు అని మానవత్వం యొక్క మహత్వాన్ని స్పష్ట పరిచాడు. మనిషికి తన మానవత్వమూలాలను గుర్తు చేస్తూ ''మనం మనలాగే బ్రతకాలి'' అని రాసిన వాక్యం ఈ పుస్తకానికి మరో మకుటంగా నిలుస్తుంది. మట్టినై పుట్టాలనుంది కవి పుస్తక శీర్షికగా ఎందుకు ఎన్నుకున్నాడో తెలియాలంటే మట్టి, మట్టినై పుట్టాలనుంది, మట్టి మర్మం కవితలను చదవాల్సిందే. 'మన్ను ఒక సమదర్శి' అంటూ మట్టికి ఉన్న సమతామమతలను విశదీకరిస్తూనే మట్టికున్న మహౌన్నతమైన చరిత్రను ప్రస్తుత పరచిన తీరు మనల్ని ఆలోచింపజేస్తుంది. మంత్రనగరి, మరో ఆకాశం, కాలవక్షం, కాలగమనం, పరిభ్రమణ తదితర కవితలు చదివినప్పుడు మనిషి ఎందుకు జన్మించాడు,చనిపోయాక మనిషి ఎటు పోతాడు, మనిషిలోని శక్తికి మూలం ఏంటి మొద లైన ప్రశ్నలు వస్తాయి.ఇలాంటి ప్రశ్నలకు కొన్ని మినహాయింపు లతో అధిభౌతికత (Meta Physics) కొంత స్పష్టతనిస్తుంది. అధిభౌతిక తత్వాలలో ఒక శాఖగా పరిగణించబడుతుంది. దీని ద్వారా అస్తిత్వం, సత్యం, జ్ఞానం వంటి విషయాలతో పాటుగా పదార్థం, సష్టి, కాలం మొదలైన అంశాల గురించి తెలుస్తుంది. అది భౌతిక ప్రపంచంలో రెండు స్థాయిలుంటాయి. మొదటి దానిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ కొలతలు (Dimensions) ఉంటాయి. మొదటి స్థాయి అధిభౌతిక ప్రపంచానికి ఆవల రెండవ స్థాయి అధిభౌతిక ప్రపంచం కాల పరమైన కొలతలతో పాటుగా అన్ని కొలతలకు అతీతంగా ఉంటుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం సష్టి విస్ఫ్టోనం ద్వార సంభవించింది. సష్టి జననానికి కారణం లేదు. దానికి కారణం లేకపోయినా కాని విస్ఫోటనానికి ముందు దాని స్థితి ఎలా ఉంది. ఉన్నా కానీ అలా ఎందుకు ఉంది. ఇలాంటివి మానవ మేధస్సుకు అంతు పట్టకపోవచ్చు. అలాగే మనిషి బుద్ధి కుశలతలు ఆ స్థాయికి సరిపోకపోవచ్చు. పైన చెప్పిన అధి భౌతికత ప్రకారం అవి అతీతమైనవి కావచ్చు. ఈ రహస్యాలు ఒక వైపు ఉంటే ప్రేమ మొదలైన భావోద్వేగాలు, చేష్టలు, జీవన విధానాలు వివిధ రకాలుగా ఎందుకున్నాయి. అలా ఎందుకు ఉండాలి. ఇక ఇతర ప్రాణుల స్థితిగతులను గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. భౌతికత, అధి భౌతికతకంటే ఆధ్యాత్మికతలో వీటన్నిటి గురించి స్పష్టంగా చెప్పబడి ఉంది. బాలకష్ణ కవిత్వంలో ఉన్నతమైన ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉన్నాయి. అవి ప్రపంచంలోని మహాత్ములందరు బోధించిన తత్త్వాలకు తగట్టుగా ఉన్నాయి.కవి సష్టికర్తను గురించి విధాతలు, ఎవరివాయా నీవెవరివయా, అన్నీ చుస్తూనే ఉన్నావా కవితల్లో ప్రస్తావిస్తాడు. ''ఒక్కోసారి నిన్ను గుర్తు చేసుకుంటాను/ అసలు నువ్వెవరు? నా, నీ మధ్య బంధమేమిటి? అని ప్రశ్నిస్తాడు కవి. మనకు సుపరిచితుడైన రూమీ మహత్ముని గురువు శమ్స్ తబ్రేజ్ కూడా సష్టికర్తను గురించి తన జ్ఞానాన్ని ఒక రుబాయిలో విధంగానే చెప్పాడు. ''ఐ బర్ తరజ్ కియాసో ఖ్యాలో గుమానో వహమ్. వజ్ హర్ చి దీదా ఏమ్ శునీదేమో ఖ్వాందా ఏమ్. దఫ్తర్ తమామ్ గశ్తో బ-పాయా రసీద్ ఉమ్ర్. మా హమ్ చునా దర్ అవ్వల్ హర్ఫే-తూ మాందా ఏమ్''.దీని తాత్పర్యం ఏమంటే ''నా ఊహకు, ఆలోచనలకు అతీతంగా ఉన్నావు.మేము ఎంతో విన్నాము.చదివాము, గ్రంథాలన్నింటినీ చదివాము. ఆయువు ముగింపుకొచ్చింది. కానీ మేము ఇంత వరకూ నీ రహస్యం మొదటి అక్షరము వద్దనే చిక్కుకుని ఉన్నాము''. చాలా వరకు ఆధ్యాత్మికతను కవి భౌతిక భావాలతో, భౌతిక పదజాలంతో, భావ జాలంతో వెలిబుచ్చాడు. అది కూడా ఎంతో మార్మికంగా తెలిపాడు. అందుకే అర్థం చేసుకోవడం క్లిష్టంగా ఉంటుంది. ఉన్న తమైనవి ఎప్పుడూ సంక్లిష్టంగానే ఉం టాయి. చివరి కవిత చింతలు చేరని దివిలో, ఒక నూతన ప్రదేశాన్ని గురించి చెప్తూ అక్కడ స్వార్థం, వంచన, కన్నీరు, భయాలేవి లేకుండా ఉండాలని, సంతోషం ఆగి అక్కడే నివాస ముండాలని కవి కోరుకుంటాడు. బాలకష్ణ కవిత్వంలో శబ్ద సౌందర్యం నిండుగా కనిపిస్తుంది. ఈ పుస్తకంలో మలయ మారుత మురళి, రక్తప్రవాహ శిలలు లాంటి అరుదైన పద బంధాలు దర్శనమిస్తాయి. ఏ మాత్రం భాషా పరిజ్ఞానం ఉన్న పాఠకుడికైన ఈ కవిత్వం సులువుగా అర్థమవుతుంది. ఏది ఎలా ఉన్నా, మట్టినై పుట్టాలనుంది అనే ఈ పుస్తకం కవి బాలకష్ణలోని మరో కోణాన్ని గొప్పగా ప్రదర్శిస్తుంది. పాఠకున్ని తాత్త్వికంగా తర్కంతో ఆలోచించేలా చేస్తుంది. సూక్ష్మ దష్టిని ఏర్పరచు కోవడానికి, మార్మికతను అవగాహన చేసుకోవడానికి సహకరి స్తుంది. శబ్దస్పహ, నూత్న వ్యక్తీకరణ, నవ్యోపమాన ప్రయోగం, కవితా నిర్మాణనిర్వాహణ విషయాలను గమనిస్తే ''మట్టినై పుట్టాలనుంది'' ఒక అసాధారణ పుస్తకంగా కనిపిస్తుంది.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి,
94410 02256