Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలంపై ఒక గీత గీసి, అక్కడ నిలుచుని నడిచొచ్చిన కాలంలోని అడుగుల పాఠాలను మననం చేసుకుని, తిరిగి కొత్తగా అనుభవాల వెలుగులో అడుగేయటమే నూతన సంవత్సర ఆరంభం. ప్రతిక్షణం మనిషి నిత్యనూతనమవ్వాలి. ప్రతిరోజు ఓ కొత్త అనుభవాన్ని వెంటేసుకోవాలి. అడుగు అడుగులో పాఠాల్ని, మరెన్నో గుణపాఠాల్ని లెక్కేసుకోవాలి. పొద్దుట లేవగానే ముఖం కడిగినట్లు తిరిగి ఉదయంలోకి తేటగా నడవాలి. పునర్ చైతన్యంతో ముందుకుపోవాలి. ఇదే సంవత్సరారంభ సౌరంభాల అసలుసారం.
సాహిత్య జీవులంగా యిరువైయ్యో దశకం పూర్తవుతున్న సందర్భాన గడచిన కాలంలోని ఘటనల్ని, అనుభవాలను, ఆచరణను, ఫలితాలను అవలోకనం చేసుకుని, మళ్ళీ కాలంలోకి ప్రవహించాల్సి వుంది. ఒక రకంగా రెండు వేల యిరువైయో సంవత్సరం విపత్తుల వత్సరంగా గడిచింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలు అనేక ఒడిదొడుకులకు, సంక్షోభాలకు గురయ్యాయి. మనుషుల ఆలోచనలలో చాలా మార్పులకు దారి తీసింది. బృందాల, సమూహాల, సంఘాల ఆలోచనలు, ఉద్యమాల తీరులో మార్పుకు దోహదం చేసింది. ఈ సవాళ్ళను, సంఘర్షణలను ప్రతిబింబించే విధంగానే మన తెలుగు సాహిత్య సృజన జరిగింది. సామాజిక వాస్తవికతను ప్రతిఫలించడంలో మన సాహితీవేత్తలు ముందుభాగానే వున్నారు. అనేక దారులు, ధోరణులు, ఆలోచనలు గల సృజనకారులను ఒకే ప్రతిఘటనోద్యమ సృజన బావుటాను ఎగరేసేలా విపత్తులు మార్గ నిర్ధేశన చేశాయి. ఒకసారి వీటన్నిటిని ప్రస్తావిద్దాము.
ప్రపంచ మానవాళిపై కరోనా వైరస్ పెద్ద దాడి చేసిన సంవత్సరంగా రెండు వేల యిరువై నిలిచిపోతుంది. ఇది మనుషులను కబళించి వేసింది. కోట్లాది మంది ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావాన్ని కలిగించింది. దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. మనుషుల మధ్య సంబంధాలకు ఆటంకాలను, ఆంక్షలను పెట్టింది. ఒక నిర్బంధ విధ్వంసం చెలరేగింది. కోట్లాది సామాన్య ప్రజలకు ఉపాధి కరువై ఆకలి, వేదనకు గురి చేసింది. అయితే ఈ సంక్షోభం గొప్ప పాఠాన్ని అందిచ్చింది. పెద్ద పెద్ద దేశాలుగా చెప్పుకునే అగ్రరాజ్యాలు ప్రజల బాధలను, దు:ఖాలను తొలగించడంలో చిన్నచిన్న దేశాలకంటే వెనకబడే వున్నాయి. ప్రజలు ఆపదలో వున్నప్పుడు ఆదుకునే బాధ్యత తీసుకున్న ప్రభుత్వాలు ఏవో, నిర్లక్ష్యం వహించేవి. ఏవో స్పష్ట పరచింది. మానవీయ స్పందనలు ఎవరిలో వున్నాయో కూడా తేల్చి చూపింది. ప్రయివేటు సేవలను కొనియాడే మేధావుల బుర్రలు, ఎంత డొల్లతో నిండి వుంటాయో ఎరుకపర్చింది. ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలు, సోషలిస్టు దేశాలు మాత్రమే ప్రజల పట్ల బాధ్యతతో విపత్తులను ఎదుర్కొన్న తీరు ప్రజల కళ్ళను తెరిపించింది.
కరోనా లాక్డౌన్తో మన దేశంలో వలసకూలీలు ఎంతో దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. పనులు లేక, ప్రయాణ సౌకర్యాలు లేక, ఆకళ్ళతో కన్నీళ్ళుతో తమ తమ ఊర్లకు కాలి నడకన లక్షలాది శ్రామికులు వేల కిలోమీటర్లు నడుస్తూ వెళ్ళడం, కాళ్ళు రక్తాలు కారడం, మార్గ మధ్యంలోనే ప్రాణాలు వొదలడం, దేశ ప్రజలను కంటనీరు పెట్టించింది. కవుల కలాలూ కన్నీరు కార్చాయి. కథలు వారి జీవితాల్ని పరామర్శించాయి. పాటలు వారి గాధలను పల్లవులు చేశాయి. కలాలే కాదు వాళ్ళ చేతులూ సహాయాన్ని అందించాయి. కానీ ప్రభుత్వాలు కఠిన గుండెలయి నిలిచాయి. కనీస ఓదార్పునూ ఇవ్వలేకపోయాయి. విలపిస్తున్న మనుషుల వైపు తిరిగైనా చూడలేదు.
కానీ అన్ని కలాలూ వలసకూలీల వేదనకు అద్దం పట్టాయి. వారి కన్నీళ్ళను అక్షరాలతో తుడిచి ఓదార్పునిచ్చాయి, మనోధైర్యాన్ని నింపాయి. ప్రాంతాలకతీతంగా, కుల, మత విభేదాలకతీతంగా ఈ సహానుభూతి కొనసాగింది. వలస జీవుల బతుకు చిత్రాన్ని కవితల్లో, కథల్లో, పాటల్లో ప్రతిబింబించారు. కరోనా మహమ్మారిపై యుద్ధాన్ని ప్రకటించారు. ప్రజల అప్రమత్తత, వైరస్ విజృంభణ, పర్యావరణ విధ్వంస ఫలితాల గురించి కవులు పెద్దయెత్తున స్పందించారు. సామాజిక సంక్షోభం పట్ల, ప్రజల అవస్తల పట్ల సాహితీకారుల ప్రతిస్పందన ప్రజానుకూలంగా సాగింది.
ఇదే సందర్భంలో దేశంలోని దోపిడీ శక్తులు, కార్పొరేట్ దిగ్గజాలు కార్మికులను ఎలా ఎక్కువగా దోచుకోవచ్చో అనే ప్రణా ళికలను అమలు చేయపూనుకుంది. పని గంటలను పెంచటం, శతాబ్దాల క్రితం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న సమ్మె, నిరసన తెలిపే హక్కులను కాలరాసింది. వేతనాలలో కోత విధించింది. చాలా మందిని తొలగించింది. కనీసం ప్రశ్నించే హక్కును కూడా లేకుండా శ్రామికుల అణచివేతకు ఒడిగట్టింది. కార్పొరేట్లకు కాపు కాస్తూ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి వేసింది. దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు, శ్రామికులు చేసిన ఉద్యమానికి సాహితీకారులు అండగా నిలబడ్డారు. ప్రభుత్వ చర్యలను నిరసించారు. ఇక అంతర్జాతీయంగా పెద్దగా ప్రజలు ప్రతిఘటించిన సంఘటన అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్పై శ్వేత జాతీయుడు చేసిన జాత్యాహంకార హత్యపై నిరసన పెల్లుబికింది. మన దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు మొదలైౖన వాటిపై కవులు తీవ్రంగానే ప్రతిస్పందించారు. ముక్తకంఠంతో ఖండించారు.
ఇక దేశంలో పౌర హక్కుల కార్యకర్తలను, ప్రశ్నించే గొంతుకలను తీవ్రమైన నిర్భంధానికి గురి చేసింది ప్రభుత్వం. విద్యార్థులు, మేధావులు, ఉద్యమకారులపై, కనీసం వృద్ధులని కూడా చూడకుండా, ఏ ఆరోపణలకు ఆధారాలు లేకుండానే జైళ్ళలో పెట్టి నిర్బంధించింది. దీనిపై కూడా సాహితీకారులు గొంతెత్తి నినదించారు. వందల సంఖ్యలో కవులు ఖండిస్తూ సంతకాలు చేశారు. 'ఈ రోజు మీరు, రేపు మేము' అనే భావనలోకి అనేక మంది సాహితీవేత్తలు వచ్చారు. సంవత్సర ఆరంభంలోనే సీఏఏ, ఎన్ఆర్సీ పేరు మీద మత విబేధాలను సృష్టించి ప్రజల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నానికి వ్యతిరేకంగా సాహిత్య రంగం తీవ్రంగానే గొంతు విప్పింది.
ఇదే కాలంలో ఉత్తర ప్రదేశ్లోని హత్రాస్లో ఒక దళిత యువతిపై అత్యాచారం, హత్య ఉదంతం దేశ ప్రజల హృదయాలను కలచివేసింది. కానీ అక్కడి ప్రభుత్వం, నాయకులు బాధితులకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసింది. అసలు అత్యాచారమే జరగలేదని దబాయించింది. ఇటీవల సి.బి.ఐ. అత్యాచారం, హత్య వాస్తవమేనని తేల్చింది. దేశమంతా బాధితులకు మద్దతుగా నిలిచారు. ఆందోళనలు చేశారు. ఈ సంఘటనకు కూడా మన కవులు, రచయితలు తీవ్రంగా స్పందించారు. దుర్మార్గాన్ని ఖండించారు. అగ్ర వర్ణ దురహంకారాన్ని ఆధిపత్య భావజాల ప్రభుత్వ దమన నీతిని కవిత్వంలో నిరసించారు.
ఇక కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు అనువుగా మూడు వ్యవసాయ చట్టాలను, పార్లమెంటులో కనీసం చర్చించకుండా ఎవరి అభిప్రయాలనూ తెలుసుకోకుండా మందబలంతో తీసుకువచ్చింది. రాష్ట్రాల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలు మన ఫెడరల్ వ్యవస్తకు, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకమైనవి. ఇవి రైతును, తన భూమిలో తనని కూలీని చేసే చట్టాలు. కార్పొరేట్లకు లాభాలు పంచే చట్టాలు. ఇది గమనించి, అర్థం చేసుకున్న రైతులు ముఖ్యంగా ఢిల్లీకి చేరువలో వున్న పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రైతులు వేలాది మంది ఢిల్లీకి చేరుకుని చట్టాల్ని వెనక్కు తీసుకోవాలని గత ముప్పయి రోజులుగా పోరాడుతున్నారు. మహారాష్ట్ర, రాజస్తాన్, మధ్య ప్రదేశ్ రైతులూ బారులు కట్టారు. అంతకుముందే తమిళనాడు, తెలంగాణ రైతులు ఆందోళనలు చేశారు. దేశంలోని రైతాంగమంతా దీనికి మద్దతు పలుకుతోంది. రైతాంగమే కాదు, శ్రామిక, మేధో వర్గమంతా సంఘీభావం తెలుపుతున్నది.
ఇప్పటికీ ముప్పయి మూడు మంది రైతులు చలిలో వణుకుతూ అనారోగ్యానికి గురై చనిపోయారు. అకుంఠిత దీక్షతో శాంతియుతంగా రైతులు వీధుల్లో పోరాడుతున్నారు. కానీ ప్రభుత్వం కనికరించటం లేదు. పైగా దేశద్రోహులని, ఖలిస్తాన్ ఉగ్రవాదులని, కిరాయికి వచ్చిన వాళ్ళని ఆరోపణలు చేస్తూ రైతులను విభజించాలని కుట్రలు చేస్తున్నది. స్వాతంత్య్రానంతరం ఇంత పెద్ద రైతు ఉద్యమం ఇంతకు ముందు జరగలేదు. ఇదొక చారిత్రాత్మకమైన పోరాటం. దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతు కన్నీళ్ళను చూసిన కవులు వాళ్ళ మద్దుతుగా విస్తృతమైన సాహిత్య సృజన చేస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. ఆన్లైన్లోనూ రైతుకు అండగా గొంతులు విప్పారు. చాలా బలమైన కవిత్వం ఈ సందర్భంగా వచ్చింది. అనేక సాహితీ గొంతుకలు స్వరాన్ని ఒక్కటి చేసిన సంఘటనలు ఇవి.
అయితే ప్రభుత్వ ఆధిపత్యానికి కాపుకాసే కవులూ లేకపోలేదు. వాళ్ళు కొందరు వాళ్ళ కోసం వాళ్ళు కవిత్వాన్ని సృజిస్తూనే వున్నారు. వాస్తవిక సామాజిక గమనాలను అవగాహన చేసుకుని, సమాజాన్ని ప్రతిబింభించడమే కాక చైతన్య పరచాల్సిన సాహితికారులు స్తబ్ధంగానో, తటస్తంగానో, అధికార పక్షంగానో ఉండటం, వారి ఉనికికే ప్రమాదంగా మారుతుంది. కానీ అత్యధిక సాహితీకారులు ప్రజల పక్షం వహించి, వారి సమస్యలను సాహిత్యంలోకి తీసుకురావడం ఈ సంవత్సరపు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
సాహిత్య కార్యక్రమాలు, చర్చలు, కవి సమ్మేళనాలు, సమీక్షలు మొదలైన కార్యక్రమాలన్నీ ఆన్లైన్లో జూమ్ మీటింగుల్లో, కరోనా కాలంలోనూ నిరంతరాయంగా జరిగాయి. అనేక సాహిత్య కవిత్వ సంకలనాలు, సంపుటులు ఈ కాలంలోనూ వెలుగులోకి వచ్చాయి. ఆవిష్కరణలూ జరిగాయి. కవితల పోటీలు, కథల పోటీలు, బహుమతులు, అవార్డులు, పురస్కారాలు విరివిరిగానే జరిగాయి.
ఈ కాలంలోనే సాహిత్య కళారంగాల్లో విషాద సంఘటనలూ చోటు చేసుకున్నాయి. సాహిత్య రంగంలోని ప్రముఖులెందరినో ఈ సంవత్సరం మనం కోల్పోయాము. కళా రంగంలో కూడా కోల్పోయాము. ప్రముఖ జర్నలిస్ట్, ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షులు పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రముఖ కవి దేవిప్రియ, కథా రచయిత సదాశివరావు, బి.పి.కరుణాకర్, అనువాదకురాలు శాంత సుందరి, వంగపండు ప్రసాదరావు, అంకిత కేశవులు, కె.కేశవరెడ్డి, విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్, ప్రముఖ సామాజిక వేత్త కవి ఊసా, ప్రముఖ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, పద్మశ్రీ శోభానాయుడు, రావి కొండలరావు, నిస్సార్, జయప్రకాష్రెడ్డి, ఎ.పి.విఠల్, గొట్టిపర్తి యాదగిరి, ఏడిద గోపాలరావు మొదలైన వాళ్ళతో పాటు తెలంగాణ సాహితి నిర్వహించిన లిటరరీ ఫెస్ట్ తెలుగెత్తి జైకొట్టుకు ఢిల్లీ నుంచి విచ్చేసిన ప్రసిద్ధ కవి మంగలేష్ దబ్రాల్ గారిని కూడా ఈ సంవత్సరం కోల్పోయాము. ఇంతమంది ప్రసిద్ధులను కోల్పోయిన కాలం ఇదే కావటం ఓ విషాదం.
సాహిత్యపరంగా పరిశీలించినట్లయితే ఆధిపత్యాన్ని ధిక్కరించిన కలాల కాలంగా, ప్రజల బాధలను గానం చేసిన వత్సరంగా, ఉద్యమాలకు పెన్నుదన్నుగా నిలిచిన సమయంగా పేర్కొనవచ్చు. మతోన్మాత చిచ్చుతో ప్రజల మధ్య విభజన తేవడం, ప్రజాస్వామిక హక్కులను అణచటం, కార్పొరేట్ల దోపిడికి తలుపులు బార్లా తెరవడం ఈ మూడింటిపైనా మరింత సంఘటితంగా కలాలను గళాలను ఎక్కుపెట్టాల్సిన అవసరాన్ని ఈ యేడు మన ముందు వుంచింది. అందుకు సన్నద్ధంగా కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాము.
- కె.ఆనందాచారి,
9948787660