Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ నవలా రంగంలో దోస్తోవిస్కీ స్థానం అద్వితీయమైనది. ఎన్నో విషయాల్లో ఆయన వేసిన నూతన పునాదులు ఈనాటికీ చదువరులను ఆశ్చర్య చకితుల్ని చేస్తూనే ఉన్నాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ కంటే ముందుకాలంలోనే మానవ మస్తిష్కాన్ని దాని కదలికల్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించి వాటిని తన పాత్రల్లో ప్రవేశపెట్టాడు. మానవ స్వభావాన్ని వానిలోని చొరరాని అంతస్సీమల్లోకి ఎంత దిగ్విజయంగా పయనించాడో దోస్తోవిస్కీ సజించిన ప్రతి పాత్ర చెబుతుంది.
ఆయన పేరు చెప్పగానే సహజంగానే Brothers Karamazov, Crime and Punishment, The Devil ఇంకా అలాంటి నవలలు గుర్తుకురావడం మామూలే..! నిస్సందేహంగా అవి నిరుపమానమైన రచనలే. కాని వీటి అన్నిటికీ ఆధారభూతమైన ఆలోచనలను తన రచనా వ్యాసాంగాన్ని మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఒక చిన్న నవలికలో ప్రదర్శించాడని చెప్పాలి. ఆ తరువాత దోస్తోవిస్కీ రాసిన చాలా గొప్ప నవలలు వీటి పునాదులపై నిర్మించాడని చెప్పాలి. అటువంటి అపురూపమైన నవలికయే Notes from Underground.
ఇది సుమారుగా 118 పేజీలు ఉన్న రచన. 1864లో ఇది ప్రచురింపబడింది. ప్రధమ పురుషలో వర్ణన సాగుతుంది. అతనే రచయిత భావించే అండర్గ్రౌండ్ మనిషి. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ అండర్ గ్రౌండ్ మనిషి అనేవాడు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాడు. బయట వారికి కంటికి కనిపించడు. ప్రతి దానికి ఓ సాక్షీభూతం వలె ఉంటాడు.ఎవరి ముందూ ఒప్పుకోని సంగతుల్ని తనలో తను ఒప్పుకుంటాడు. అలాంటి ఒక వ్యక్తి ఈ కథని చెబుతుంటాడు. దోస్తోవిస్కీ రచన ఏది గాని ఏదో కాలక్షేపంలా చదివి అవతల పారేద్దాం అంటే కుదరదు. కొన్నిసార్లు స్వగతం లాగానూ, కొన్నిసార్లు సుదీర్ఘ సంభాషణల లాగానూ,మరిన్నిసార్లు తత్వశాస్త్రం, మానసిక శాస్త్రంకి సంబందించిన పాఠాల లాగానూ అనిపిస్తుంటాయి.
కాని వాటి అన్నిటిలోనూ హదయాన్ని బంధించే అంతస్సూత్రం ఉంటుంది. చదివిన తర్వాత జీవితం మొత్తాన్ని వెంటాడే ఓ మంత్రజాలం ఉంటుంది. కనుకనే 150 ఏళ్ళ క్రితం రాయబడిన ఈ నవల ఓ విశేష రచనగా నిలబడి పోయింది. మరెందుకనో తెలియదు గాని ఈ నవలిక గురించి పెద్దగా ఎవరూ ఏ పత్రికలోనూ మాట్లాడినట్లు కనబడదు.
జీన్ పాల్ సార్త్రే వంటి వాడు ఈ నవలికని మొట్ట మొదటి Existentialismని ప్రతిపాదించిన రచనగా పేర్కొన్నాడు. టాల్స్టారు తనకి నచ్చిన దోస్తోవిస్కీ రచనల్లో ఒకటిగా రాశాడు. మరి ఇంతగా మేధావి వర్గాన్ని కదిలించిన దీనిలో ఏమున్నది..? అది కొద్దిగా చూద్దాము. అండర్ గ్రౌండ్మేన్తో పాటు జ్వెర్కొవ్, సిమనోవ్, ఫెర్విష్కిన్, లిజా ఇవి ఇతర పాత్రలు అయితే అన్నీ సమ ప్రాధాన్యతని కలిగి ఉండవు. లిజా పాత్రకి కొంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ఈ నవలిక ప్రారంభంలో అండర్ గ్రౌండ్ మనిషి తన వివరాలు చెబుతుంటాడు. అతను ఓ చిరు ప్రభుత్వ ఉద్యోగి, ప్రస్తుతం రిటైర్ అయి పీటర్స్బర్గ్కి కొద్ది దూరంలో ఉన్న చిన్న ఊరిలో నివసిస్తూంటాడు. తను ఉద్యోగిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించేవాడు, సాటి ఉద్యోగులతోనూ మిగతా అధికారులతోనూ ఎలాంటి సంబంధాలు నెరిపేవాడు ఇవన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాడు. తన వద్దకి పనుల కోసం వచ్చే జనాలతో పరుషంగా ఉండేవాడు. అయితే ఒకటి ఎప్పుడూ తను లంచం తీసుకునేవాడు కాదు. కనుక దానికీ దీనికీ సరిపోయింది గదా అని సంతప్తి పడతాడు.
రమారమి ఓ నలభై పేజీల దాకా ఇలా తన గురించిన జ్ఞాపకాలు సాగుతుంటాయి. దానిలో తాను ఎందుకు పెళ్ళి చేసుకోలేదు, పీటర్స్ బర్గ్లో నివాసం ఎందుకు ఉండటం లేదు, తన పనిమనిషికి ఏడు రుబుళ్ళ జీతం ఎందుకు ఇస్తున్నాడు ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఆ తర్వాత భాగం లో తన క్లాస్మేట్స్తో చిలికి తగాదాలు. ఒకప్పుడు తనతో పాటు చదివిన ఓ క్లాస్మేట్ విదేశాలకు వెళుతుంటే అతని కోసం అని చెప్పి ముగ్గురు పాతమిత్రులు పార్టీ ఇస్తారు. దానికి హాజరైన మన అండర్ గ్రౌండ్ మనిషి చిన్న విషయం లో గొడవపడతాడు. ముఖ్యంగా జ్వెర్కొవ్ అనే వాడితో.. అని చెప్పాలి. అక్కడ బాగా మద్యం సేవించి ద్వంద్వ యుద్ధానికి సై అంటాడు. మిగతా స్నేహితులు ఎలాగో మెల్లగా తప్పించుకొని లిజా అనే వేశ్య దగ్గరకి చేరుకుంటారు. అక్కడ కొంతమందితో గడిపి వాళ్ళు వెళ్ళిపోతారు.
జ్వెర్కొవ్ అనే వాడిని కనీసం చెంపదెబ్బ అయినా సరే వెయ్యవలసిందే అని తీర్మానించుకుని అండర్ గ్రౌండ్ మనిషి వేశ్యావాటికకి చేరుకుంటాడు. ఈలోపు వాళ్ళు జారుకుంటారు. ఏం చెయ్యలో తోచక ఓ సుదీర్ఘ ఉపన్యాసం వంటిదాన్ని ఆ వేశ్యకి ఇస్తాడు. దానిలో చాలా నిజాయితీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇతను తన ఇంటికి వెళ్ళిన తరువాత ఈమె అక్కడికి వస్తుంది.అక్కడ జరిగే మెలోడ్రామా ఓ సినిమా వలె ఉన్నా దానితో చదువరి మమేకం అవుతాడు. ఆ విధంగా నవలిక పూర్తి అవుతుంది. దీనిలో దోస్తోవిస్కీ మనసు చేసే ఇంద్రజాలం, దానివల్ల సమాజంతో మనిషి పడే బాధ ని ప్రధానంగా చెపుతాడు.
ఎవరైతే ఎక్కువ ఆలోచనాపరులో ప్రతిదాన్ని లోతుగా చూస్తుంటారో అలాంటి వారు కార్యక్షేత్రంలో దిగాలు పడుతుంటారని,ఎవరైతే తప్పోఒప్పో పెద్దగా ఆలోచించకుండా ఉంటారో అలాంటివాళ్ళే కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటారని చెబుతాడు. కథలో గొప్ప మలుపులు అనేవి ఉండవు గాని రోజువారీ జీవితంలోనే మనిషి తనకి తెలియకుండానే పరిస్థితులకి ఎలా ప్రభావితుడవుతాడో అంతర్లీనంగా చెబుతాడు.
దోస్తోవిస్కీ మానవ స్వభావాన్ని విశదీకరించే తీరు చదువుతుంటే ఒక్కొక్క పొర ఏదో తొలిగిపోతున్నట్లుగా ఉంటుంది.అయితే దాన్ని ఏదో నీతిసూత్రాలు వల్లించినట్లుగా చేయడు.మన గురించి మనం చెప్పుకున్నట్లుగా ఉంటుంది. కొన్నిమార్లు చిన్ననవ్వు మన పెదాలపై కదులుతుంది. ఉదాహరణకి ప్రేమ గురించి ఒక పేజీలో ఇలా అంటాడు.'' ప్రేమలో పడటం నా వల్ల కాని పని. నా దష్టిలో ప్రేమ అంటే ఏమిటి అంటే మనసు పరంగా వేరొకరిపై ఆధిపత్యం కలిగి యుండటమే, లేదా ఆ దిశగా ప్రయత్నించి విజయం సాధించ డము అని చెప్పాలి. ఒక్కసారి ఆ మనిషి వశీకతుడైన పిమ్మట తనతో ఇక నేను ఎలా ప్రవర్తించాలో నాకు అర్థం కాదు..!''
ఈ నవల చదువుతుంటే అప్పటి రష్యన్ సమాజంలో గల వైరుధ్యాలు తెలుస్తుంటాయి. అంతేగాక సివిల్ సర్విస్లో గల హౌదాలు వారి వైఖరి అవగతమవుతాయి. యధాప్రకారం ఫ్రెంచ్ ఇంకా జర్మన్ సంభాషణలు అవసరాన్ని బట్టి అక్కడక్కడ దొర్లుతుంటాయి. దోస్తోవిస్కీ ఎంతో లోతుగా యూరోపియన్ సాహిత్యాన్ని చదువుకున్నాడు. కాని రష్యన్ సమాజంలోని సమస్యలకి పరిష్కారాలు చూపడంలో పాన్ స్లావనిక్ దక్పథాన్ని అవలంబించాడని విమర్శకులు భావిస్తారు. ఏది ఏమైనా మంచి అభిరుచి గల పాఠకులు తప్పక చదవ వలసిన నవల ఈ నోట్స్ ఫ్రం అండర్ గ్రౌండ్ అని చెప్పాలి.
- మూర్తి కె.వి.వి.ఎస్.,
7893541003