Authorization
Mon Jan 19, 2015 06:51 pm
24న 'శ్రమపొదుగు' ఆవిష్కరణ సభ
యరకల యాదయ్య రచించిన కవితా సంపుటి 'శ్రమ పొదుగు' ఆవిష్కరణ సభ ఈ నెల 24 (ఆదివారం)న ఉదయం 11 గంటలకు రామచంద్రపురంలోని బీరంగూడ కమాన్ దగ్గరి మల్లికార్జున నగర సంక్షేమ భవనంలో నిర్వహించనున్నారు. డా.నాళేశ్వరం శంకరం అధ్యక్షతన నిర్వహించే ఈ సభలో తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి పుస్తకాన్ని పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, విశిష్ట అతిథిగా దేశపతి శ్రీనివాస్ హాజరవుతారు. ఆత్మీయ అతిథులుగా గుడిపాటి, వఝుల శివకుమార్, కందుకూరి శ్రీరాములు, వంగరి సతీష్, గంజి కిశోర్ పాల్గొంటారు. సమన్వయకర్తలుగా ఒద్దిరాజు ప్రవీణ్కుమార్, సిహెచ్ ఉషారాణి వ్యవహరిస్తారు.
24న జానుడి ఆధ్వర్యంలో సాహిత్య సదస్సు
జానుడి - సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సాహిత్యంపై జనవరి 24 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆన్లైన్ సాహిత్య సదస్సు నిర్వహించనున్నారు.
'సాహితీ వీక్షణం, సాహితీ స్పర్శ' పుస్తకాలపై డాక్టర్ కాళ్లకూరి శైలజ, 'విద్వాన్ విశ్వం' పుస్తకంపై డాక్టర్ అప్పిరెడ్డి హరనాథరెడ్డి, మదరాసు బతుకులు(కథలు)'పై సయ్యద్ సలీం, చెరగని స్ఫూర్తి తాపీ ధర్మారావు' పుస్తకంపై డాక్టర్ శ్రీమతి రామ్నాధ్, కథా వరణం (పర్యావరణ కథలు)పై డాక్టర్ శిరంశెట్టి కాంతారావులు మాట్లాడుతారు. ఈ సభలో ముఖ్య అతిధిగా ప్రముఖ రచయిత, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ అంగలకుర్తి విద్యాసాగర్ పాల్గొననున్నారని జానుడి డైరెక్టర్ డాక్టర్ నూకతోటి రవికుమార్ ప్రకటన చేశారు.