Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా పల్లె రైతన్న ముంగారికి
కొత్తసాలులో గింజ మొలవాలని
రైతు పడే తపన కండ్లారా చూస్తే
కడుపు నిండ బువ్వతిన్నట్లే ఉంటది.
నాగటెద్దలతో నేలను దున్నుతూ
ఆకలితో అలుపెరగని యుద్దం చేస్తుంటాడు
ఆ సాళ్లవెంట గింజలు ఇత్తుతుంటే
నా పల్లె రైతు రాగాల గొంతైతాడు.
గింజలిత్తినాక మూడొద్దులనాడు
సాలుబారబోతే లోయలో పడినట్లే
కుములుకుంట లోలోపల్నే
ఈ కుల్లు వ్యవస్థనంత నోరారా కడిగేస్తాడు.
భూతల్లి యదపై మొలకలన్ని
పచ్చగా సిగురించాలనీ
కనిపించిన దేవుండ్లకు దోసిళ్లతో నీళ్ళుబోసి
దిగులుతో ఆకాశానికి ఎదురుచూసిన
పిచ్చిరాజులున్న గడ్డమాది.
గొర్రుసాలవెంట కొత్తసాలు
మొలవాలనిజి
ఇండ్ల తలెసెంబులమ్మి
ఆలిపుస్తెలను తాకట్టుబెట్టిన
నానాక అరిగోస పడినా చరితలున్నయి.
కుంచెడు ధాన్యతో కల్లం కళకళలాడాలనీ
రైతులు
ఎందరివో కాళ్లు మొక్కిన
దినాలున్నయి నా దేశానా.
బువ్వపెట్టిన పాపానికి
ఉరితాడుకు
వేలాడిన సేద్యస్తులున్నరు ఈ నేలన.
ఈ దేశానికి బుక్కబువ్వ పెట్టాలని
బుగ్గిపాలైన పర్లేదని రేయంత తిప్పలుబడే
రైతన్న పాదాలను
గర్భగుడిలో పెట్టి మొక్కుకున్న
పాలకుల రుణం తీరదు.
ఏలేటోళ్ల తలలకు రాల్లొత్తైన
రైతన్నలను రాజుజేయాలె
ఈ పాపిష్ఠి పాలకులు
పందిరిగుంజలదాపున దాగి
దొరికినకాడికి దోసుకునే పద్దతికి పాడెకట్టాలె.
రైతును రాజుగా పొగిడి
కుట్రల రాజ్యం నడిపే నాయకులే
రాజ్యమేలుతున్నారు.
ఈ భువిపైన
సేద్యానం గడ్డిల కలిసిన యేడు
రైతన్న కాడికిందేసిన నాడు
ఈ దేశమే ఆకలి మంటలతో కాలిపోతుంది.
- అవనిశ్రీ,
9985419424