Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పందొమ్మిదో శతాబ్దిలోనే పదమూడు నాటకాలు రచించిన కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి తెలంగాణలో తొలి నాటక రచయిత. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన తెలంగాణ నాటక రంగ వికాసానికి ఆద్యులు
19వ శతాబ్ది ఉత్తరార్థంలో చివరి దశకం నుండి తెలంగాణలో తెలుగు నాటక వైభవం ప్రారంభమైందని చెప్పవచ్చు. నాటకం అనగానే మనకు సాంఘిక నాటకమే గుర్తుకు వస్తుంది. 'నాటకాన్తంహింసాపుత్యం'' అని నానుడి. సాహిత్యంలో పరాకాష్ట చెందిన నాటకం సమాజ స్థితిగతులను సోదాహరణంగా రంగస్థలం మీద నటీనటుల ద్వారా ప్రదర్శింపజేయబడుతూ సారూజికులను అంతర్ముఖులనుగా చేసి తద్వారా సమాజ శ్రేయస్సుకు (పాటుపడటమే) దోహదం చేయటమే నాటకానికి ముఖ్య ప్రయోజనంగా చెప్పవచ్చు. నాటకాలలో మొట్టమొదటగా మన తెలుగు దేశంలో సంస్కృత రూపకాలే రచించి ప్రదర్శింపడినట్లు తెలుస్తోంది. తరువాత సంస్కృతం నుండి, ఇంగ్లీషు మొదలయిన ఇతర భాషల నుండి అనువాదం చేసిన నాటకాలు ప్రదర్శించబడినాయి.
తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర నాటకం వావిలాల వాసుదేవశాస్త్రి గారు రచించిన 'నందక రాజ్యమ'ని అంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం కోదాడ రామచంద్రశాస్త్రిగారిచే రచించబడిన 'మంజరీ మధుకరీయ'మని పరిశోధకులు నిగ్గుతేల్చారు. ఏది స్వతంత్ర నాటకం అంటే రచనా పరంగా 'మంజరీ మధుకరీయం', ముద్రణాపరంగా 'నందకరాజ్యం'గా భావిస్తుంటారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మదరాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నప్పటి మాట.
ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఎవరికి వారు తమ అస్తిత్వాన్ని బలపరచుకోవడానికి అన్వేషిస్తున్నారు. సాహిత్యంలోని అన్ని ప్రక్రియల వలెనే 'నాటక సాహిత్యం' కూడా తన అస్తిత్వాన్ని తెలియజేసుకోవలసిన అవసరం ఏర్పడింది.
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నందకరాజ్యం, మందరీమధుకరీయంలు తమ స్థానాన్ని సుస్థిరపరచుకోగా తెలంగాణలో మొదటి నాటకం ఏది? అనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది.
తెలుగులో ఆదికవి నన్నయ్యకాదు పాల్కుర్కి సోమన్న అనేవాదం అమలులోకొచ్చింది. ఇది కావ్యానికి సంబంధించినది. ప్రస్తుతం నాటకాలను గురించి పరిశీలించడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం.
చరిత్రకందినంతవరకు మద్రాసులో 1875లో Madras Dramatic Society అను సమాజం వారు ఆంగ్ల నాటకాలను ప్రదర్శించేవారు. తరువాత 'పూనా సాంగ్లీ కంపెనీ' వారు మద్రాసు వచ్చి ప్రదర్శనలు ఇచ్చినారు.
ఇంతలో 'ధార్వాడ నాటక సమాజము వారు తెలుగుదేశంలో నాటక ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించినారు. వీరేశలింగం పంతులుగారి స్వీయచరిత్రలో 'నా మిత్రుల కోరికననుసరించి 1880వ సంవత్సరంలో కడపటి భాగముననొక నాటక సమాజమును స్థాపించి ధార్వాడ నాటకులు వచ్చి నాటకములాడి విడిచిపోయిన పాకలోనే 'రత్నావళి, చమత్కార రత్నావళి' యను రెండు నాటకములు చేసి యాడించితిని. అట్టి నాటకములాడుట కదియే ప్రథమ ప్రయత్నమైనను మొత్తం మీద నవి జయప్రదంగానే జరిగినవని యెల్లవారు నభిప్రాయపడిరి' అయితే ఇవి సంస్కృతంలో మార్పు కావలసిన నాటకములకనువాదములు -
ఇవి నాటకాల ప్రదర్శనంలో మొదటి ప్రయత్నమే గాక సమాజ స్థాపనలో కూడా మొదటి ప్రయత్నమే. రచనాపరంగా 1860 నుండే నాటక రచన జరుగుతున్నదనేది యథావిదితమే.
ప్రదర్శనంలో పంతులుగారి నాటక సమాజం 'విద్యార్థి సంఘం'చే స్థాపించబడినది. అయితే అందరు విద్యార్థికులయిన వారిచే గుంటూరు పట్టణంనందు 'శ్రీ కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి గారి'చే స్థాపించబడినది. దీనినే గుంటూరు ఫస్టు కంపెనీ అని పేరు ఉండెడిది. ఎందుచేతనంటే వీరేశలింగం గారి నాటక సమాజం కొంత విరామం తర్వాత ఆగిపోతుంది. కావున ఇదియే మొదటి నాటక ప్రదర్శనా సమాజమని చెప్పవచ్చును.
ఇది ఎందుకు రాయవలసి వచ్చిందంటే బ్రహ్మశ్రీ కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. వారి తల్లిదండ్రులు తెలంగాణవారు కనుక, నాటక ప్రక్రియకు తెలంగాణలో ఖమ్మం జిల్లా వాసులే అంకురార్పణ చేశారని చెప్పుటకు దీనిని బలపరచుటకు 'ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు' గారి ప్రథమాంధ్ర నాటక కర్తలు అనుగ్రంథము నుండి ఈ కింది భాగములు యథాతథంగా వ్రాయుచున్నాను. దీనివలన నాటక రచనలో, ప్రదర్శనలో ఖమ్మం జిల్లా వాసులు ద్వితీయ స్థానములంకరించినారని చెప్పుటకు మాత్రమే.
'నందకరాజ్యం' నాటక రచయిత శ్రీ వావిలాల వాసుదేవశాస్త్రిగారు వారి తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన వారు శ్రీ కొండుభొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు. వీరిద్దరు మేనత్త మేనమామ బిడ్డలు. సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వాసుదేవ శాస్త్రిగారి కంటే ఒకటి రెండేండ్లు చిన్నగావచ్చేమో. వీరు 1852 - 1897 మధ్య జీవించిన శాస్త్రిగారు ధన్యజీవులు జీవిక కోసం ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు.
ఆచార్య శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావుగారి గ్రంథం నుండి స్వీకరించిన భాగము.
''- సుబ్రహ్మణ్య శాస్త్రిగారు 1852 లేదా 1853 ప్రాంతముల జన్మించి యుందురు. వీరికి సుబ్రహ్మణ్యం, సుబ్బారాయుడు అను నామాంతరములు కలవు (వస్త్రాపహరణ నాటకంలో సుబ్బారాయుడు అనియే కలదు)
వీరి తండ్రిగారు శ్రీ గోపాల కృష్ణశాస్త్రి, తల్లిపేరు శ్రీమతి వీరమ్మ, భార్యపేరు శ్రీమతి అద్వైత బ్రహ్మేశ్వరమ్మ, శ్రీగోపాల కృష్ణశాస్త్రిగారి జన్మభూమి తెలంగాణ మధిర తాలూకాలోని విప్పలమడక అగ్రహారం. తరువాత వీరు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని కారుమూరు గ్రామంలో స్థిరపడినారు. సుబ్రహ్మణ్యశాస్త్రిగారు మెట్రిక్యులేషను వరకు చదివినారు. తరువాత గుంటూరులోని American Evanjelical Luthern mission School లో 1884 వరకును తెలుగు పండితులుగా పని చేసినారు. తరువాత 1889 వరకును గవర్నమెంటు హై స్కూల్లో తెలుగు పండితులుగా పనిచేసినారు. అప్పుడు అనగా 1889 వ సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేరి మద్రాసు ట్రిప్లికేనులో కాపురం పెట్టినారు.
సుబ్రహ్మణ్యశాస్త్రిగారు మిషను హైస్కూలులో పని చేయుచున్నప్పుడు దేశ భక్తి శ్రీ కొండా వేంకటప్పయ్య పంతులుగారు అందులో చదువుచుండెడివారు.
దేశభక్త శ్రీ కొండా వేంకటప్పయ్య పంతులుగారు తమ స్వీయ చరిత్రలో శ్రీ శాస్త్రిగారిని గురించి ఈ విధంగా రాసినారు
''అప్పుడు (1880 ప్రాంతములో) మాకు ఆంధ్రోపాధ్యాయులుగా నున్న కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కొన్ని నాటకములు తెలుగున వచనశైలిని రాసి, వానిని ప్రదర్శించవలెనని కుతూహలపడుచు, వారు అందుకు నాటక పాత్రలుగ మార్చ తలచిన వారిలో నన్ను గూడ చేర్చి ప్రోత్సహించిరి''
నాకు తెలిసినంతలో తెలుగు దేశమున స్థాపించబడిన ఆధునిక నాటక సమాజములతో శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారు స్థాపించిన హిందూ నాటక సమాజం రెండవదని తలంచుచున్నాను. మొదటిది వీరేశలింగం గారు స్థాపించిన విద్యార్థి నాటక సమాజం. అది 1880వ సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలో స్థాపించబడినదని తెలిపియున్నాను. వీరేశలింగం పంతులు గారు స్థాపించినది విద్యార్థి నాటక సమాజమగుట చేతను. అది కొలది కాలముననే అంతరించిపోవుట చేతను అది అంతగా పరిగణనీయము కాదన్నచో గుంటూరు హిందూ నాటక సమాజమే మొదటిది అగుచున్నది. 'బందరు హిందూ థియేటర్' తెలుగు దేశంలో మొదటి నాటక సమాజం వారు. వారు ఆంధ్రదేశంలోని అన్ని ముఖ్య పట్టణములలో వీటిని ప్రదర్శించినారు.
ఈ నాటక సమాజంలో నటీనటులందరి గూర్చి కొండా వేంకటప్పయ్య గారు రాసిన విషయములు :
''- తగిన స్థలములో పాక వేయుట, తెరలు సిద్ధం చేయుట, నాటక పాత్రలకు కావలసిన దుస్తులు, అలంకారములు మొదలగు పనులు సర్కారు కచ్చేరీలలో గుమస్తాలుగా నుంచిన పొత్తూరు కృష్ణయ్య, భువనగిరి హనుమద్దీక్షితులు, భాగవతుల రాఘవయ్యగార్లును, గుంటూరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా ఉన్న భాగవతుల చెన్న కృష్ణయ్యగారును చాలా శ్రద్ధతో జరుపుచుండిరి. మల్లాది సోమయాజులు, ఇవటూరి వియ్యన్నగార్లు విదూషకమేషములు మిక్కిలి సమర్థులు. ప్రతి నాటకము నుండును నాయక పాత్రకు కలపటపు నరసింహం అనునొక విద్యార్థి సమర్థుడుగనుండెను. ఈయన బందరులో పిమ్మట కొంత కాలమునకు సెకండు గ్రేడు ప్లీడరుగ పనిచేసిరి. నాకు ప్రతి నాటకము నందును ముఖ్యమగు స్త్రీ పాత్ర నియమించిరి. చెన్నూరు సూర్యప్రకాశరావు, భువనగిరి సూర్యనారాయణ అను మరి ఇరువురు కూడా స్త్రీ వేషములు వేయుచుండిరి. వారి వేషములు ఎక్కువ అందముగనుండెడివి. కాని వారిలో కథ నడిపించు సామర్థ్యం కొంత కొరవడి యుండుటచేత నన్నే ప్రధాన స్త్రీ పాత్రగా నేర్పవలసి వచ్చినది''.
పైన చెప్పిన విధంగా కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు నాటకాలు రచించడమే కాక సమాజమును స్థాపించి ఆంధ్రప్రదేశమంతట ప్రదర్శించుటలో పేరు గాంచియున్నారు. వారు రచించిన నాటకాలన్నీ హిందూ నాటకసమాజం వారు వేరొక సమాజానికి ఇవ్వక వారి వద్దనే ఉంచుకున్నారు. వాటి ముద్రణ కూడా జరగక పోవుటచేత అవన్నీయు ఇప్పుడు అలభ్యములు. ఆ రాత ప్రతులు కూడా అంతరించి పోయినవి. శాస్త్రిగారి దత్తపుత్రులయిన గోపాల కృష్ణయ్యగారు 13 నాటకములు రాత ప్రతులను మాత్రము సేకరించగలిగినారట. వారి పేర్లు...
1. గయోపాఖ్యానము, 2. శ్రీ యాళరాజు చరిత్ర, 3. వజ్రదంష్ట్రోపాఖ్యానము, 4. శుకరంభా సంవాదము, 5. శశిరేఖా పరిణయము, 6. సుభద్రా పరిణయము, 7. శ్రీరామ జననము, 8. కీచక వధ, 9. హరిశ్చంద్రోపాఖ్యానము, 10. సుగ్రీవ పట్టాభిషేకము, 11. సీతాన్వేషణము, 12. సీతాపహరణము, 13. ద్రౌపతి వస్త్రాపహరణము
ఈ నాటకాల పేర్లు పరిశీలిస్తే నేడు తెలుగు దేశమున ప్రసిద్ధి చెందిన అనేక నాటక ఇతివృత్తములను శాస్త్రిగారు ఆనాడే (1881- 1884) వెలుగులోనికి తెచ్చి నాటకీకరించినట్లు తెలుస్తున్నది. చిలకమర్తి వారి గయోపాఖ్యానమునకు శాస్త్రి గారి నాటకమే ప్రోత్సాహమని వావిలాల సీతారామశాస్త్రి గారితో చెప్పినారట.
నాటక రంగానికి ఇంతగా సేవ చేసిన కొండుభొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారి జన్మభూమి ఖమ్మం జిల్లా కావటం విశేషం. తెలంగాణలో వీరు తొలి నాటక కర్త అన్నది నిర్వివాదం. కావున అంధ్రనాటక రంగానికి సమాంతరంగా తెలంగాణ నాటక రంగపయనం సాగిందని బోధపడుతుంది. నాటక రంగానికి ఇంతగా సేవ చేసిన శాస్త్రిగారు మద్రాసులో 6-6-1897వ తేదీన స్వర్గస్థులయినారు. వీరి తరువాత వారం రోజులకే 13-6-1897 వ తేదీన వావిలాల వాసుదేవ శాస్త్రిగారు కూడా మరణించడం వారిద్దరి స్నేహం ఎంత దృఢమైనదో తెలుస్తుంది.
- టి.నరసింహారావు, 9885787250