Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉభయ రాష్ట్రాల్లో మన తెలుగునాట కవిత్వం రాసే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. కథలు రాసేవాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. ఇక నవలలు నాటకాలు రాసేవాళ్ళు పదుల సంఖ్యలో మాత్రమే ఉంటారు. నాటకానికి ప్రచురణార్హత కన్నా ప్రదర్శనార్హతే గీటురాయి కనుక ఆ క్రమంలో చూసుకుంటే నాటక రచనలు గాని, రచయితలుగాని బహు స్వల్పం అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ డిజిటల్ యుగంలో, సినిమాలు, వీడియోలు, షార్ట్ ఫిల్మ్లు, టిక్టాక్లు వెల్లువెత్తుతున్న ఈ కాలంలో నాటకాన్ని ఎందుకు చూడాలి? నాటకం అవసరం ఏముంది? అని వాదించే 'ప్రబుద్ధులు' లేకపోలేదు.
నంది నాటకోత్సవాలు అంతరించిన పిమ్మట నాటకాలు కేవలం పరిషత్ల కొన ఊపిరితోనే బతుకుతున్నాయని అనుకోవడం అతిశయోక్తి కాదు. కోవిడ్ కాలంలో నాటక కళాకారులు అత్యంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న వాస్తవాన్ని ఎవ్వరం కాదనలేం.
ఈ నేపథ్యంలో హైద్రాబాద్ రవీంద్ర భారతిలో ఇటీవల రసరంజని సంస్థ అధ్వర్యాన బహురూప నట సమాఖ్య విశాఖ వారు 'రావణ మరణం తర్వాత' నాటకం ప్రదర్శించారు. నాటక రచయిత - దర్శకులు ఎస్.కె.మిశ్రో నాటకాన్ని ఉపాసించే అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరు.
రామాయణం వాల్మీకి సృష్టించిన ఆది కావ్యం. తదనంతరం భిన్న భాషల్లో, భిన్న జాతుల్లో, భిన్న ప్రాంతాల్లో ఎన్నో రామయణాలు ఉద్భవించాయి. వాటిని కవి పరిశోథకులు ఆరుద్ర తేట పరుస్తూ 'రాముడికి సీత ఏమవుతుంది?' అనే గ్రంథమే రాశారు.
'రామాయణం మనకు సీతారాముల చరితను చెబుతుంది. కానీ రామ రావణ యుద్ధానంతరం లంక గతి ఏమయిందో చెప్పలేదు. యుద్ధం కారణంగా అతలాకుతలమైన లంక పరిస్థితి ఏమై ఉండగలదన్నది' నాటక సారాంశంగా ప్రదర్శకులు తెలిపారు.
'ఏ విభీషణుడు రావణ మరణానికి కారణమయ్యాడో అతడే ఆ రాజ్యానికి రాజయ్యాడు. లంక ప్రజలు బాధితులు. వారికది మింగుడు పడని విషయం. రావణుని రాక్షస గణానికి ఘోర అవమానం. రాజ్యం అగ్ని గుండమైంది. అరాచకం మరింత ప్రబలింది. ఆందోళనను అదుపు చేయడానికి, ప్రజలను శాంత పరచడానికి ఒకే ఒక మార్గం విభీషుడ్ని పదవీచ్యుతుడ్ని చేయడం.
విభీషణుడి మీద అభియోగం రాజద్రోహం, ప్రజల ముందు నిరూపణ చేసి శిక్షిస్తే ఊరట కలుగుతుంది. ఇలా జరిగి ఉండవచ్చునేమో..!? - అనే ఊహా కల్పనగానే ప్రదర్శించారు.
అంటే మౌలికంగానే తర్క ఔచిత్యానికి తావు లేకుండా చేశారు. మరి నాటక స్రష్ట మిశ్రో ఈ నాటకం ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పదలచుకున్నారో స్పష్టంగా బోధపడదు సరికదా మరింత గందరగోళానికి తావిస్తుంది.
లంకలో రావణుడ్ని అభిమాన గణం వ్యక్తి పూజ ఉన్మత్తులై జాతిపితగా మహాత్మునిగా కీర్తిస్తున్నట్టు ప్రతిపాదిస్తారు. జాతిపిత అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మహాత్మా గాంధీ. మహాత్ముని త్రికరణ శుద్ధి కార్యాచరణ ఉత్కృష్టమైనది గనుకనే ఆ బిరుదులు గాంధీజీకి సర్వత్రా హర్షామోదం పొందిన విషయం విధితమే. అలాగాక తల్లివేరులా పాతుకుపోయిన అభిమానుల వెర్రి ఉన్మాదమే పాలకులను మహాత్ములుగా కీర్తించడమే కాకుండా, పాలకుల్ని ఆకాశమంత ఎత్తుకు ఎదిగే నియంతల్లా చేస్తుందని జ్ఞాన భండారకుని చేత చెప్పించడం సమంజసంగా తోచదు.
కాగా ప్రధాన పాత్రధారి రావణాసురుడు ఒక పక్క దేవుడు లేడు అంటూనే మరో పక్క శివునితో మీదంతా కుటుంబ పాలన అని ఎద్దేవా చేయడం ఏమిటో అర్థం కాదు.
రావణ వధ కోసమే సీతారాములు అరణ్యవాసం చేసారని, సీతాపహరణ సమయాన సీత సంకేతంగా ఆభరణాలు జారవిడవడం సర్జికల్ స్ట్రైక్ వంటిదేనని భావించడం, రామరావణ యుద్ధాన్ని శివకేశవుల వైరంగా పేర్కొనడం, శైవ - వైష్ణవ బేధాన్ని మత మార్పిడి సంకేతాలుగా సూచించడం, ఏదీ ఒక విధంగా నప్పదు. హేతువుకు అందదు. ప్రస్తుతం ఆర్.ఎస్.ఎస్. వారు చెప్తున్నట్టు ఒకే జాతి, ఒకే మతం, ఒక దేవుడు అన్న సిద్ధాంతం మాదిరి రాముడొక్కడే దేవుడు (జైశ్రీరాం) అన్న అంశం అంతర్లీనంగా సాగుతుంది. కాగా ద్రావిడులు లంక నుండి భారత భూమిలోకి ఉగ్రవాదుల్లా ప్రవేశించారని చెప్పడం మరీ అర్థరహితం.
రామాయణంపై గతంలోనే విస్తృత పరిశోధన గావించి 'రామాయణ విశేషములు' అను గ్రంథం రచించిన ప్రముఖ చరిత్రకారులు సురవరం ప్రతాపరెడ్డి గారు కూడా 'లంక ఎచ్చట?' అన్నది గడ్డు ప్రశ్నగానే చెప్పారు. 'వాల్మీకి రామాయణం ఈ విషయంలో మనకేమి సహాయం చేయదు.పైగా చిక్కులు తెచ్చిపెట్టియున్నద'ని తెలిపారు.
అందువలన పురాణ సహిత రచనలెప్పుడూ నిర్దిష్ట సమాచారం ఇవ్వక, ఒక్కోసారి తమకు తాముగానే ఖండించుకుంటూ ఉంటాయి. నాటక కర్తలు వాటిని తేటపరిచి రసజ్ఞత కలిగిన జ్ఞాన సమాచారం ఇవ్వాలి. లేకుంటే గందరగోళం నుండి మరింత గందరగోళంలోకి పడే ప్రమాదం ఉంటుంది.
ఇలాంటి సందర్భంలోనే కవిరాజు త్రిపురనేని రామస్వామి మాటలు జ్ఞప్తికి తెచ్చుకోవాలి! 'హేతువాదము లేనిదే నీతి జనత కు రాదురా. నీతి జనతకు రానిదే జాతి ప్రగతికి పోదురా'.
మానవాళి స్వభావంలోని మాలిన్యాన్ని ప్రక్షాళన చేసేందుకే (కెథోరిసస్) ఆవిర్భవించిన నాటకకళ ఆధునిక కాలంలో దుర్మార్గమైన రాజ్య విధానాలను సైతం ప్రశ్నించే ధిక్కార స్వరంగా మారింది. ప్రజలు చెప్పుకోలేని మూగవేదనకు అద్దం పడుతూ వారిని సన్మార్గంలో చైతన్యపరచడమే నాటక ధర్మం. మహా రచయిత ప్రేమ్చంద్ చెప్పినట్టు 'సత్ సాహిత్య కళారూపాలు సమాజానికి ఎంత దగ్గరవుతాయో, సమాజమూ వాటికంతే చేరువవుతుంది'. ప్రజలకు అవసరమైనది ఇవ్వకుండా నాటకాలు ప్రజలు ఆదరించడం లేదని ఎంత వగచినా ఫలితం ఉండదు కదా...!
- కె.శాంతారావు,
9959745723