Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక వైపు దాదాపు మూడు దశాబ్దాలుగా తెలంగాణ భాషకు, సాహిత్యానికి, చరిత్రకు జరిగిన వివక్ష పట్ల ఆందోళన తీవ్రస్థాయిలో కొనసాగింది. అన్ని రంగాలలో కేంద్ర స్థాయిలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగింది అన్న అంశం బలంగా చర్చనీయాంశం అయింది. అంతిమంగా తెలంగాణ ప్రజలు చలనశీల ఉద్యమాలతో రాష్ట్రాన్ని సాధించుకోగలిగారు. ఇప్పుడు తెలంగాణ తన మూలాలను అన్వేషిసూ అస్తిత్వ చైతన్యంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నది. తెలంగాణ రాష్ట్ర నిర్మాత గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వైభవోపేతంగా ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరిగాయి. భాష, సాహిత్య సాంస్కృతిక రంగాలలో యావత్తు ప్రపంచం ముందు తెలంగాణ విదితమైంది. ''మన తెలంగాణము - తెలుగు మాగాణము'' అన్న నినాదం తెలంగాణ జాతి జనుల సాంస్కృతిక నాదమైంది.
సరిగ్గా ప్రపంచ తెలుగు మహాసభలకు రెండురోజుల ముందు ఇదే హైదరాబాద్ నగరంలో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకులు ఆచార్య ఎన్.గోపి గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన న్యాయ నిర్ణేతల కమిటీ ఇద్దరు తెలంగాణ అగ్రశ్రేణి సాహితీవేత్తలను పక్కకు నెట్టి తిరిగి గుంటూరు కవికి పట్టం కట్టింది. గత ఐదు సంవత్సరాల పురస్కారాలలో వరుసగా నాలుగు గుంటూరు వాసులను వరించడం అభ్యంతరకరం. భవిష్యత్తు చరిత్ర క్షమించదన్న కనీస భయం లేని కేంద్ర సాహిత్య అకాడమీ వైఖరి పట్ల తెలంగాణ సాహితీవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో సంగిశెట్టి శ్రీనివాస్ లేవనెత్తిన ప్రశ్నలు కేవలం ఆరంభం మాత్రమే. ఆశ్యర్యకరంగా గత నాలుగు సంవత్సరాలుగా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, జూకంటి జగన్నాథం, నందిని సిధారెడ్డి, ఎస్వీ సత్యనారాయణల గ్రంథాలు తుది పరిశీలన దాకా చేరుకుని అక్కడ వైకుంఠపాళిలోని పాము మింగేయడం విషాదకరం. తెలంగాణ కలాలు, గళాలు దేశవ్యాప్తంగా వెలుగొందకూడదన్న రహస్య ఎజెండాను బద్దలు కొట్టవలసిన సమయం ఆసన్నమైంది. భవిష్యత్తులో తెలంగాణ సాహితీవేత్తలకు, తెలంగాణేతర సాహితీవేత్తలకు విడివిడిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందజేస్తే తప్ప ఈ వివక్షను ఆపడం సాధ్యం కాదు. విజ్ఞలు గమనించవలసిందిగా కోరుతున్నాను.
- సత్యాన్వేషి