Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమకాలీనంగా దళిత సాహిత్యం తనను తాను ఒక ప్రధాన సామాజిక శరీరంగా ఆవిష్కరించుకుంది. ఈ ఆవిష్కరణ వస్తువు సంస్కృతి, భాష శైలి మొదలైన విషయాల్లోనూ జరిగింది. ఇన్నాళ్ళ ప్రయాణంలో మైలురాళ్లను గమనిస్తే ప్రధానంగా మూడు మార్గాలను కాలాలను గమనించవచ్చు. 'షో వాల్టర్' (రష్ట్రశీషaశ్ర్ీవతీ) (A శ్రీఱ్వతీa్బతీవ శీట ్ష్ట్రవఱతీ ఉషఅ) ఆంగ్ల సాహిత్య చరిత్రలో స్త్రీ సాహిత్యాన్ని విభజించిన పద్ధతి ఈ విషయంలో కొంత ఉపయోగపడుతుంది. మొదటిదశ అప్పటి కాలానికి వ్యాప్తిలో ఉన్న రచనా విధానాన్ని అనుసరించి రాసినవి. అప్పటి సాహిత్య ప్రమాణాలు, సామాజిక విలువలు ఇందులో ప్రతిబింబిస్తాయి. సుమారు జాషువా లాంటి కవుల కాలానికి జరిగింది. ఇదే దళిత సాహిత్యంలో గాంధేయవాద సాహిత్యంగా చెప్పుకునే హేలావతీ (1909), ఉన్నవ లక్ష్మీనారాయణ 'మాలపల్లి', 'ఎన్.జి.రంగా', 'హరిజన నాయకుడు' లాంటి వాటిని తొలిదశగా గమనించవచ్చు. రెండవ దశలో వాటి ప్రమాణాలను తిరస్కరించడం, హక్కులు విలువల కోసం వాదించడం, ప్రచారం చేయడం కనిపిస్తుంది. కుసుమ ధర్మన్న, భాగ్యరెడ్డి వర్మ మొదలుకుని ఇప్పుడొక ప్రధాన తాత్విక భూమికగా నిలబడ్డ బాబా సాహెబ్ అంబేద్కర్ తాత్త్విక దర్శనం ఆధారంగా ఆవిష్కరించబడిన ఈ కాలపు సాహిత్యమంతా ఈ రెండవ దశ. మూడవది తమదైన ఆత్మదర్శన (రవశ్రీట-సఱరషశీఙవతీy) దశ. ఇందులో దేనిమీదా ఎవరిమీదా ఆధారపడక తమదైన స్వీయ వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని అందులోని సమగ్ర జీవన తత్త్వాన్ని ఆవిష్కరించడం కనిపిస్తుంది. ప్రధానంగా నిశాని, అంటరానివసంతం, కక్క, సిద్ది, నల్లపొద్దు, కైతునకలదండెం, మల్లెమొగ్గల గొడుగు నుండి అనేక మంది దళిత సాహిత్య వేత్తలు తెచ్చిన సాహిత్య మంతా ఆత్మావిష్కార దశలోనిది. ఇండస్ మార్టిన్ 'కటికపూలు' తెలుగులోని దళిత సాహిత్యంలో ఈ మూడవ దశకు ప్రధాన ప్రతినిధిగా నిలబడుతుంది.
ఈ కథలన్నీ బాల్య జ్ఞాపకాల్లాంటి కథలు. సహజ సిద్ధమైన భాష ఏ మాత్రం కల్పన లేనట్టుగా కేవలం వాస్తవచిత్రణ పాత్రలు, ఆయా నేపథ్యాలు వీటన్నిటినీ పెనవేసుకున్న దళిత క్రిస్టియన్ ఆత్మగౌరవ స్పృహ. అందులోంచి అంతే నిసర్గంగా ధ్వనించే సాంస్కృతిక పౌరుషం. ఇవన్నీ కటికపూలను కేవలం కథలనే స్పృహనుంచి బయటికి తెస్తాయి. ఒక భారమైన అణచివేతను తిరస్కరిస్తున్న వాస్తవ ప్రపంచాన్ని చిత్రాలు చిత్రాలుగా ఆవిష్కరిస్తాయి.
మార్టిన్ ఇరవయ్యారు కథల్లో పరచిన జీవిత శకలాల్లో ప్రధానంగా మూడు మార్గాలు కనిపిస్తాయి. 1. అణచివేత నుంచి తలెత్తుకున్న జీవిత ఆవిష్కారం. సదువు కంపు, గూచ్ గూచ్ లాంటి అనేక కథలు ఆ మార్గంలో రాసినవి. వీటన్నిటిలోంచి కేవలం అనుభవం చిత్రించడమే కాకుండా ఏవైపు మరలాలో నిర్దేశించుకోగల గమనం కూడా కనిపిస్తుంది. ప్రతి కథాంశానికి చివర్లో రాసే ఒక వ్యాఖ్య ఇలాంటి అంశాన్ని ఆవిష్కరిస్తుంది. ''జాతి వ్యత్యాసాలను పాటించడానికి ఎంతటి ఖర్చైనా చేసే పై కులాల పెద్దమనుషులు సాటి మనిషిని మనిషిగా చూడడానికి అవసరమైన ఖర్చులేని మానవ ప్రేమను వాడడానికి మాత్రం పిసినారులవ్వడం అదే మొదటిసారి చూడడం. మా అమ్మ నన్ను వూళ్ళో వాళ్ళ ఇళ్ళకు వెళ్ళనివ్వకుండా వుండడం వెనుక ఈ అవమానాల అనుభవాల నుండి మమ్మల్ని కాపాడడమే కారణమని అర్థమయింది (పే.51)''. అదృష్టమనే అహేతుక సిద్ధాంతాన్ని తయారు చేసి, మా పామర జనాల్ని అందులో ఇరికించి వంచిస్తున్న ఈ దోపిడీ సామాజిక వ్యవస్థ ఆలోచనా విధానాలనుండి బయటపడడమే విముక్తికి మొదటి మెట్టు(పే.66). నిలవనీడా, బతుకు బరోసాలు లేని మా పల్లెల్లో సావూ బతుకులు మంచాన్ని తిరగా బోర్లా ఏసినంత సవికర్యాలు. బేట పారతన్నా నీళ్ళల్లో సచ్చిన కుక్కలూ కోళ్ళూ కొట్టకపోతన్నాయి. ఆటి మజ్జ తేలతా పోతన్న బాదాం చెట్టుకొమ్మల్లో ఇంకా ఒకటీ అరా ఎర్రటి బాదాం కాయలు ఏలాడతానే ఉన్నాయి (పే.116). అణచి వేత దుర్భరమైన స్థితిని వ్యక్తం చేసే వాక్యాలివి. వీటి నుంచి కూడగట్టుకున్న ఆత్మస్థయిర్యాన్ని వ్యక్తం చేసేవే ఈ పూలన్నీ. ఉప్పెన రెండు భాగాలు, పెట్టుడు మందు లాంటి కథలు లోతైన వాస్తవికతను ఆవిష్కరించిన కథలు. అకాల వర్షం కథ ఇప్పటి తాజా సంఘటనలకూ ప్రతినిధిగా నిలిచేది.
పదిలంగా ఈ కథలు ప్రకటించే మరో అంశం సాంస్కృతిక వైభవం. ఆకలివారం, తిండీ తిప్పలు, నేడే స్సూడండే, చేపముల్లు లాంటి మరికొన్ని కథలు సాంస్కృతిక ఔన్నత్యాన్ని, జీవితంలో సంపూర్ణత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ''తరాల తరబడి నిమ్నత్వం మా మనుషులను అణగదొక్కిన మాట వాస్తవం. కానీ ఆ పోరాటం నుండే నేర్చుకున్న సహానుభూతి మాత్రం మా జాతిని ఇప్పటివరకూ అంతరించి పోకుండా నిలబెట్టి ఉంచిన మహాశక్తి (పే.20). మా నోట్లోకి వెళ్ళే తిండిని మేమే సంపాదించుకోవడం, నోరు కొట్టే వాళ్లను తెగించి నిలువరించడం, మాకు వెన్నతో కాదుగాని కందన కాయ కార్జం ముక్కలతో పెట్టిన విద్య. అందుకే ఇప్పటికీ సెల్ఫ్ రిలయన్స్ కలిగి, అన్ని కరువు కాటకాలనూ అధిగమించి ఇంకా నిలబడ్డ జాతిగా మేం మిగిలి ఉన్నాం (పే.27)'' ఇలాంటి వాక్యాలు అనేకంగా ఎత్తి రాయొచ్చు. ఇవన్నీ సాంస్కృతిక నేపథాన్ని చెప్పేవి. నేడే స్సూడండే - ఒక నాటకం వేద్దామనుకునే సందర్భంలోని జ్ఞాపకం. అలగా జనాలని చెప్పే జీవితాల్లోని సాంస్కృతిక పారమ్యాన్ని ఇది ప్రకటిస్తుంది. కళలు, వృత్తులపట్ల ఉండే గౌరవాన్ని, వినోదానికి, సంస్కారానికి పనికిరామన్న మాటలకు సమాధానంలా ఈ కథ కనిపిస్తుంది.
సంస్కృతి గౌరవంతో పాటు కనిపించే మరో ప్రధానాంశం భాష. మార్టిన్ కథల్లో భాషను గురించిన అవహేళనకు సంబంధించిన కథలు అంటరాని యాస, ముప్పయ్యారు డెబ్భైరొండు, బతుకు పాట, సదువు కంపు లాంటివి ప్రత్యేకంగా కనిపిస్తాయి గాని, అన్నిటిలోనూ జీవ చైతన్యంతో నడిచే యాస కనిపిస్తుంది. ఏ జీవితాల చిత్రణ ఆ జీవితాల జీవద్భాషలోనే సజీవంగా చిత్రింపబడుతుంది అనేదానికి ఈ కథల్లోని భాష ఉదాహరణగా కనిపిస్తుంది. మొదటి రెండు అణచివేత, సాంస్కృతిక చైతన్యాల సమాహారంగా మూడవ అంశాన్ని చూడాలి. ఎందుకంటే అంటరాని యాస, ముప్పైయ్యారూ డెబ్బైరెండులో అణచివేత కనిపిస్తే, అనేక కథల్లో కనిపించే పాటలు గేయాల్లాంటి సాహిత్యం సంస్కృతిని ప్రకటిస్తుంది. 'అంటరాని యాస'లో భాషా సంబంధంగా మార్టిన్ ఒక చర్చే చేశారు. దళిత సాహిత్యం వచ్చిన తొలినాళ్ళలో సాధారణ ప్రమాణ భాషనే సాహిత్యంలో కనిపిస్తుంది. తొంభైల తరువాత భాషమీద మార్పు కనిపిస్తుంది. తెలంగాణా ఉద్యమ కాలంలో యాసల పట్ల ఒక పెద్ద చర్చనే జరిగింది. వీటిని యాస, మాండలికం అనొద్దని, జీవద్భాష, ప్రజాభాష, ప్రజా నుడికారం అనాలన్న ప్రతిపాదనలు అనుసరణలూ వచ్చాయి. ఈ సందర్భంలో ఎక్కువగా చర్చింపబడిన గుంటూరు, కృష్ణా రెండు జిల్లాల భాష అనేక విమర్శలకు గురైంది. అందులోనుంచే శ్రామిక వర్గం, రైతుకూలీ వర్గం దళిత వర్గం వాడే భాషను ఇక్కడ నిలబెట్టారు. ''అసలు యాస అనేపదం నుండి నిమ్నత్వాన్ని నగుబాటుని పూర్తిగా తుడిచెయ్యాలి'' (పే.118) అన్న దిశా నిర్దేశం మార్టిన్ కథలది.
గతంలోనూ సంస్కృతి, భాష, అణచివేతల పైన సాహిత్యం తెలుగులో కనిపిస్తున్నా వాస్తవికమైన జీవితాన్ని పెనవేసుకుని ఈ మూడూ ఈ కథల్లో కొత్త చైతన్యంతో కనిపిస్తాయి. ఛాందసత్వపు పాదాలకింద నలిగిన పూల ఆత్మఘోష 'కటికపూలు'.
- ఎం.నారాయణ శర్మ, 9177260385