Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనాదిగా కవిత్వం మానవ హృదయాల్ని తట్టి లేపుతనే ఉంది. మానసిక సంఘర్షణను, అనుభవాలను, అనుభూతులను, ఆదర్శాలను, ఆకాంక్షలను ఎలుగెత్తి చాటుతనే ఉంది. కవిత్వం ఒక ఉత్సాహం, ఊరట, విశ్వాసం, ధైర్యం. నిన్నా నేడూ రేపూ కలగలిసి ముందుకు సాగే మానవ జీవన తాత్వికత కవిత్వం. మనస్సును సాంత్వన పరిచి, చైతన్యాన్నిచ్చి, ఆనంద తీరాలకు మోసుకెళ్ళే కవితా నావలో కాలు మోపడానికి ప్రతి ఒక్కరూ కవిత్వమై ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అందరితో కలిసి తమ భావాలను సమాజానికి అంకితమివ్వాలని అనుకుంటారు. కవిత్వ నావ కోసం ఒడ్డు దగ్గర వేచి ఉంటారు. నిరంతరం ఎగసిపడే సాహిత్య కెరటాల మీద ప్రయాణం ఎవరికైనా ఒక సాహస యాత్రే కదా! ఇట్లా, ఒక అరవై నెలలుగా పున్నమి వెన్నెల్లో సాగుతున్న కవిత్వ ప్రయాణం 'ఎన్నీల ముచ్చట్లు'.
కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రచయితల వేదిక ఆగస్టు 2013 నుండి నిరంతరాయంగా నిర్వహిస్తున్న కవిత్వ పఠన కార్యక్రమం 'ఎన్నీల ముచ్చట్లు'. మే 29న జరిగిన 60వ నెల ఎన్నీల ముచ్చట్ల కార్యక్రమంతో ఐదు సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ ఇరవై ఐదు నెలలు ప్రతీ నెల ఒక సాహితీ మూర్తి ముఖ చిత్రంతో 'సాహితీ సోపతి' సహకార పద్ధతిలో కవిత్వాన్ని ప్రచురించింది. ఆ తర్వాత దాతల సహకారంతో మూడు నెలలకు ఒక సంచికగా 10 సంచికలు ప్రచురించింది. ఇందులో కొన్ని ప్రత్యేక సందర్భాల కవిత్వ సంచికలు కూడా ఉన్నాయి. ఈ నెల మరో సంచిక విడుదల చేయనున్నది. సుమారు 200ల మంది దాకా కవులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఆయా సందర్భాల్లో రాష్ట్ర స్థాయిలోని ప్రముఖ కవులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రతీ నెల ఒక కవి/ రచయిత ఇంటి దగ్గర జరగడం ఒక ప్రత్యేకత. నిర్వాహకులు అతిథులతో సహా కవులంతా డాబా మీద/ నేల మీద గుండ్రగా కూర్చొని ఒక్కొక్కరు తమ కవిత/ పాట/ పద్యం/ మాటను వినిపించడం కూడా ప్రత్యేకతే. గత నెల కవితల సంచికను విడుదల చేయడం, ఈ నెల కొత్తగా హాజరైన వారి ముందుగా పరిచయం చేయడం, కవిత్వ రచనా మెళకువలు తెలపడం, కవిత్వం చదవడం అనే పద్ధతిలో ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. మొత్తంగా సాహిత్య లోకం ఈ ఎన్నీల ముచ్చట్ల ద్వారా ఒక కొత్త వాతావరణాన్ని చవి చూసింది.
ఈ అరవై నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సహా, సమాజంలో ఎన్నో మార్పులు, సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటికి ఈ ఎన్నీల ముచ్చట్ల కవులు ఎట్లా స్పందించారు? ఈ నావ ఏ తీరానికి ప్రయాణిస్తున్నది? లాంటి ప్రశ్నలు వేసినప్పుడు వచ్చిన సమాధానాలు ఒకసారి చూద్దాం.
స్పందన లేకుండా కవిత్వం లేదు. కవిత్వం తప్పకుండా ఒక మానవీయ స్పందన కాకుండా ఉండలేదు. అణచివేతలపైనా, అన్యాయాలపైనా, అమానవీయతలపైనా ధిక్కారాన్ని ప్రకటించకుండా కవిత్వం నిలువ లేదు. సామాజిక సంఘటనలకు స్పందించి రాసిన కవితలు కొన్నిటిని చూస్తే ఈ విషయం స్పష్టమౌతుంది. తెలంగాణ సందర్భంలో సమైక్య వాదులు హైదరాబాదులో పెట్టిన సభలో శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ ధైర్యంగా జెండా ఎత్తి 'జై తెలంగాణ' అని నినదించిన దృశ్యాన్ని మమత వేణు అనే కవి ''వర్షించే మేఘానికి ముందు/ గర్జించే ఉరుమువు నువ్వు/ సైన్యం చేసే కవాతుకు ముందు/ ఎగిరిన జెండావు నువ్వు/ ఆకాశానికి చేతుల్ని చాచి/ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను/ పిడికిలెత్తి చాటిన/ ఖాకీ ఖలేజావు నువ్వు'' అని 'అంకుశం సీను' కవిత రాశాడు. అట్లాగే, హైదరాబాదును సొంతం చేసుకునే ప్రయత్నాన్ని నిరసిస్తూ 'యుద్దమింకా ముగియలేదు', 'హైదరాబాద్ సిర్ఫ్ హమారా' అంటూ గాజోజు నాగభూషణం, కూకట్ల తిరుపతి కవితలు రాశారు. ''గొంగళి పురుగై ఆవహించిన నీ దేహాన్ని చీల్చి/ నా భూమిని స్వేచ్చగా ఎగిరే సీతాకోకచిలుకను చేస్తాను/ నీ కలయికతో గాయపడిన నా నగరానికి/ అంతిమ విజయాన్ని శాశ్వత నజరానాగా ఇస్తాను'' అని, ''చలో... ముల్లె మూట సదురుకొని/ జెప్పన పిల్లజెల్లతో బైలెల్లుర్రి/ ఇంకా సొంచాయిస్తే/ గండి మైసమ్మ కాడ గావువడ్తం బిడ్డా'' అన్నారు.
తెలంగాణ ఉద్యమం చివరి మలుపులోకి వచ్చిన అక్టోబర్ 2013లో ఉద్యమ కారులకు కొత్త అతారెలు చేతులకు వచ్చినరు. అవి ఫణికర మల్లయ్య ప్రశ్నల కొడవళ్ళు, రహీమున్నీసా చెప్పుల దెబ్బలు, ట్యాంక్ బండ్ మీది విగ్రహాలు కూల్చిన వీర తాళ్ళు, మానుకోట నిరసన రాళ్ళు, డ్రైవర్ మల్లేశన్న పదునెక్కిన పాటలు. ఉద్యమ తీవ్రతకు అద్దం పడుతూ నగునూరి శేఖర్ ''ఈ కొత్త అతారెలకు పూజ చేసిన'' అంటూ ''ఫణికర మల్లయ్యలు/ ప్రశ్నల కొడవల్లెత్తుతరు/ రహీమున్నీసాలు రగిలే రుద్రమలవుతరు/ ఊళ్ళన్నీ మానుకోటలై/ మీ చీకటి కోటలకు/ బీటలు పడుతయి'' అని హెచ్చరించాడు. తెలంగాణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రతులను చింపేసిన సభ్యుల దుశ్చర్యలను 'చిచోర' కవితలో అన్నవరం దేవేందర్ ''పునరుత్తేజ పునర్విభజన బిల్లును/ బల్లోలె పట్టినా పిల్లోలె గీకినా/ నల్లికుట్ల ఎశాలెన్ని ఏశినా/ బిల్లు ఘల్లు ఘల్లుమంటది/ గుండె జల్లు జల్లుమంటది'' అని తెలంగాణ కాంక్షను చెప్పాడు. తెలంగాణ అవతరణ, నెల్సన్ మండేలా అస్తమయం, నిర్భయ సంఘటన, రోహిత్ ఆత్మ త్యాగం, కల్బుర్గి హత్య, అనేకమంది త్యాగమూర్తుల జయంతులు, వర్ధంతులు, వివిధ అధ్యయన యాత్రలు, ప్రత్యేక సందర్భాలలో సంచికలు మొదలైన ఎన్నో సందర్భాల్లో రాసిన కవితలు ఈ సంచికల్లో ఉన్నాయి
ఈ ఎన్నీల ముచ్చట్లలో రాటుదేలిన కొన్ని కొత్త గొంతుకల కవితలు
''రాజ్యాంగాన్ని మనకై రాసుకుందీ మనం/ అభివృద్ధికి ఆమడదూరంలో మనం/ రాజకీయ కుల రక్కసి ఆధిపత్యంలో మనం/ కుములుతూ బ్రతుకులీడ్చే పోరులో మనం'' (మనం-నేదునూరి అజరు కుమార్), ''రంగుల ప్రపంచంలో/ కళాత్మకంగా జీవించే మనుషుల మధ్య/ మనిషితనం రంగు వెలసి మసకబారుతున్నది'' (దాగుడు మూతలు-మమత వేణు), ''ఆ మూడేళ్ళ సిరియా బాల్యం/ సముద్రపు ఒడ్డున విగత జీవిగా/ విప్లవాన్ని తొడిగి/ చీకటి తత్వాన్ని చెప్పి/ ఉత్త చేతులను చూపిస్తూ/ ముఖాన్ని మట్టిలో కప్పుకుంటే గాని/ దేశాధిపతులు మానవత్వాన్ని మనిషికింత పంచుకోలేదు'' (సిరియా బాల్యం-రామానుజం సుజాత), గృహాలు గ్రహాల్లా మారాక/ మనిషికీ మనిషికి మధ్యన మాయా తెరలు వెలిశాక/ నువ్వూ నేనూ/ అడుగుదూరంలో ఉన్న గ్రహాంతర వాసులమే కదా'' (గ్రహాంతర వాసులు- విలాసాగరం రవీందర్), ''అర్ధరాత్రి అపరాత్రి/ ఆర్తితో కొన్ని చేతులు/ అలలు అలలుగా కదులుతున్నవి/ చీపురు కర్రలై పాకిని చిమ్ముతున్నవి'' (చీకటి ఔదార్యం- తప్పెట ఓదయ్య), ''నా తొలి స్పర్శతో ప్రసవ వేదన మరచి/ ఉప్పొంగిన నీ రక్తాన్ని పాలధారగా మార్చి/ నా ఆకలి దప్పులు తీర్చి నన్ను పెద్దజేసిన/ నీ సేవకు రుణపడి ఉన్నానమ్మా'' (అమ్మ-హరిప్రియా గిరిధర్ రావు), ''ఇప్పటికీ ఆమెకర్థం కానిదొకటే/ పుట్టుకతో వచ్చిన/ బొట్టు కాటుక పూలు/ మధ్యలో వచ్చిన పుస్తెలతో/ ఎందుకు మాయమైనాయో'' (అర్థంకాని తెలుపు- పెనుగొండ సరసిజ), ''అతడు నిజాం అణచివేతపై పూరించిన/ సమర శంఖారావం/ వతన్ దార్ జమీన్ దార్లతో తలపడ్డ/ మూలవాసుల యోధుడు/ సర్కార్ దురాగతాలను/ గెరిల్లా యుద్ధ నీతితో/ సింహంలా ప్రతిఘటించి/ అమరుడైన వీరుడు'' (మూలవాసుల యోధుడు- డా. వాసాల వరప్రసాద్), ''నీ అన్న/ నీ చెల్లె/ నీ వూరంటేనే/ నీకు పంచపానాలు/ చిట్ట చివరకు/ గా పంచ పానాల పానాదులల్లనే/ నికరమైపోతివి/ నిట్ట నిలువూత నన్ను ముంచిపోతివి'' (అమాస బతుకు- సి.వి కుమార్), ''భవిష్యత్తు పేక మేడలా కూలినప్పుడు/ తనలో నిశ్శబ్దం ఆవహించింది/ అది మౌనంగా ఉరితాడై మెడకు చుట్టుకుంది/ రోహిత్ వేముల అక్షర పుష్పమై నేలరాలాడు'' (ఒక అక్షర పుష్పం- యం.డి. నసీరొద్దీన్), ''చీకటి రాజ్యం చిక్కులుదెంప/ కాలం అంచులపై కలం కంచులు మెరిపిస్తా/ అక్షరాయుధాలు విసురుతా/ కవిత్వ ఎన్గులు నాటి/ రచనారంగంలో/ ప్రజాక్షేత్రాన్ని/ పసిపాపవోలె కాపాడుకుంటా'' (సిరాజులుం- కల్లెం లక్ష్మణ్), ''ఇప్పుడేవి/ దురహంకారంపై గర్జించిన గళాలు/ దుర్జన సమాధులను దున్నేస్తామన్న నాగళ్ళు'' (ఇప్పుడేవి-కొత్త అనిల్ కుమార్), ''ఆగని దుక్కపు వేదన/ పిడికిలెత్తి ప్రశ్నించమంది/ సామ్రాజ్యవాద విషనాగుల పనిపట్టమంది'' (ప్రశ్నించమంది- ఇనగంటి సూర్యారావ్), ''పాటకు పల్లవి జతగా ఉన్నట్లు/ మువ్వలకు సవ్వడి తోడైనట్లు/ మన రెండు హృదయాల భాష ఒక్కటై నిలవాలి'' (ఒకే హృదయం- మాధవ్ గుర్రాల), ఆది మానవుడే మన పూర్వీకుడు/ అతడే మన చరిత్రకారుడు/ అతడే మన చిత్రకారుడు/ అతడే మన శాస్త్ర వేత్త'' (ఆది మానవుడు- పి. క్రిష్ణ గోపాల్), ''నా కన్నా అడుగున్నర పొట్టి కానీ/ మునికాళ్ళపై నిలబడి తలెత్తి చూస్తే గానీ/ అందని మహౌన్నత వ్యక్తిత్వం ఆమె'' (ఆమె- వి.ఆర్ గణపతి), ''పక్కవాటాలో ఎవరున్నారో తెలియని/ అపార్ట్మెంట్ సంస్కృతిలో / కంప్యూటర్ మీట నొక్కుతూ ఆడే గేమ్స్/ గెలిచిందెవరు ఓడిందెవరు'' (పాపం పసివాళ్ళు-తోట నిర్మలారాణి), ''ఊర చెరువులో చేపల వేట/ గోదావరిలో జలకాలాట/ జన్నచేలో పెసరకాయల వేట/ చేను యజమాని తిట్ల పాట/ ఎంత గమ్మత్తు ఆ బాల్యపు రోజులు'' (బాల్యం- దామరకుంట శంకరయ్య), ''విషవాయువులు పీల్చి విగతజీవులైన/ పాతికజీవుల ప్రాణాల/ పాతికేళ్ళ పోరాటం/ పాలకుల పరిహాసానికి/ న్యాయ స్థానంలో అన్యాయమైపోయింది'' (భోపాల్ పాపాల్- పెనుగొండ బసవేశ్వర్). ఇంకా ఎందరో కవుల ఎన్నో కవితలు ఇక్కడ ప్రస్తావించలేక పోతున్నాను.
నెలకు అరవై డెబ్బై కవితలు... ఈ అరవై నెలల్లో కనీసం మూడువేల కవితలు పుస్తకాల్లో అచ్చైనాయి. కనీసం పదిమంది ఎన్నీల ముచ్చట్ల కవులు తమ మొదటి కవిత్వ పుస్తకాల్ని అచ్చువేశారు. అనేక కొత్త పుస్తకాలు ఎన్నీల ముచ్చట్ల వేదిక ద్వారా ఆవిష్కృతమయ్యాయి. రాష్ట్రంలోనూ ఇతర ప్రాంతాలలోనూ మరెందరో ప్రేరణ పొందడానికి ఈ కార్యక్రమం దోహదం చేసింది. ఈ మధ్య కాకతీయ విశ్వవిద్యాలయంలో 'ఎన్నీల ముచ్చట్ల' సంచికలపై పత్ర సమర్పణ కూడా జరిగింది. వార్తా ఛానళ్ళు, పత్రికలు కూడా ప్రత్యేక కథనాలు ప్రచురణ, ప్రసారం చేశాయి. అట్లాగే, కరీంనగర్లో మరో రెండు సంస్థలు కూడా ఈ మధ్య 'కవిత్వంతో కలుద్దాం', 'కన్నీటి ముచ్చట్లు' అనే పేరుతో కార్యక్రమాలకు రూపకల్పన చేయడం గమనార్హం.
సహృదయ దీపాలు అంతటా ఉన్నాయి. తృష్ణ అనే చమురుతో నిండి ఉన్నాయి. ఆశ అనే వత్తితో ఎదురు చూస్తున్నాయి. ప్రకాశనం చేయడమే తరువాయి. కళ్ళు జ్యోతులై వెలుగుతున్నాయి. హృదయాలు విశాల కాంతి పుంజాలై సమాజమ్మీద పరచుకుంటున్నాయి. చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోవడం కన్న ప్రయత్నించి ఒక చిరు దివ్వెను వెలిగించాలన్న కాంక్ష ఫలితమిది. కవిత్వారాధకుల సంఖ్య పెరగడమంటే సహృదయుల సంఖ్య పెరగడమే. మనస్సును మధించి నాలుగు అక్షరాలను వెలికి తీసి లోకానికి పంచేవాడు సమాజ హితుడు కాకుండా ఎలా ఉంటాడు. సమాజం కోసం వేదన చెందే వాడు కారుణ్య హృదయుడు కాక మరేమవుతాడు. జనం గొడవను తన గొడవగా చేసుకున్న కాళోజి వారసుడు అన్యాయాన్ని ఎదిరించి ఆరాధ్యనీయుడు కాకుండా ఎలా ఉంటాడు. కవిత్వం వ్యక్తినీ, సంఘాన్ని సంస్కరించే కొత్త తొవ్వ కాక మరేమవుతుంది.
- బూర్ల వేంకటేశ్వర్లు, 9491598040