Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ వైతాళికులు ఒద్దిరాజు సోదరులు బహుముఖ ప్రజ్ఞాశాలురు. సంగీతం, సాహిత్యం, కళలను స్వయంగా నేర్చుకున్నారు. కమ్మరం, కుమ్మరం, వడ్రంగం, తోలు పనులు, తోట పనులు వంటి లౌకిక విద్యలన్నీ నేర్చి, శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటి చెప్పడానికి తమ పనుల్ని స్వయంగా చేసుకున్నారు. ఆయుర్వేదం, హోమియో, అలోపతి వైద్యాలు నేర్చి, కొన్ని కొత్త మందులను కనిపెట్టి పేద న్రపజలకు ఉచితంగా వైద్య సేవ చేశారు. కళాభావనలు, దేశభక్తి భావనలతో ముద్రణాయంత్రాన్ని మారుమూల ఇనుగుర్తి గ్రామానికి తీసుకువచ్చారు. విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాలను స్థాపించి, ఎందరివో పుస్తకాలను ముద్రించారు. తెలుగు భాషా సాహిత్యాలకు సేవచేస్తూ, తెలంగాణ సమాజాభివృద్ధి కోసం 'తెనుగు' వార్తా పత్రికను స్థాపించి, మార్గదర్శకులుగా నిలిచారు. తెలంగాణ వైతాళికులుగా ఒద్దిరాజు సోదరుల జీవితాన్ని, వారి స్వయంకృషి ఫలితాలను, పరిశోధన - పరిశీలనా దృష్టిని, ప్రజాసేవను, సాహిత్యకృషిని వివరంగా తెలియజేస్తూ కొండపల్లి నీహారిణి వెలువరించిన పరిశోధనా సిద్ధాంత గ్రథమిది.
అప్పటి తెలంగాణ నేపథ్యంలో ఒద్దిరాజ సోదరుల జీవిత విశేషాలను, పట్టుదల - కార్యదీక్షను, సేవనిరతిని, సాహిత్య కృషిని వివరిస్తూ - వారి జీవితం ముందు తరాలకు ఎలా ఆదర్శప్రాయమో తెలియజేయడం మొదటి అధ్యాయంలో వుంది. మహాకావ్యం, లఘు కావ్యాలు, ఖండకావ్యాలు, శతకము, ప్రకీర్ణకాలుగా విభజించి, 'కార్యకర్తలుగా ఒద్దిరాజు సోదరుల' గొప్పదనాన్ని రెండవ అధ్యాయంలో తెలియజేశారు.
ఒద్దిరాజు సోదరులు రాసిన నాలుగు నవలలను, ఆరు కథలను విశ్లేషిస్తూ నవలా రచయితలుగా - కథా రచయితలుగా వారి విశిష్టతను తెలియజేయడం మూడవ అధ్యాయంలో చూడవచ్చు. సాంఘిక నాటకాలు, చారిత్రక, భక్తి నాటకాలు, ఏకాంకితలను రాసిన ఒద్దిరాజు సోదరుల ప్రజ్ఞను నాల్గవ అధ్యాయంలో వివరించారు. చేతి పనులు, బాల విజ్ఞాన మంజూష, ఛాయ కర్షణము, శారీరక శాస్త్రము, విద్యుద్విజ్ఞానము మొదలైన సాంకేతిక, విజ్ఞాన శాస్త్ర రచయితలుగా ఒద్దిరాజు సోదరుల ప్రత్యేకతను అయిదవ అధ్యాయంలో తెలియజేశారు. ఒద్దిరాజు సోదరుల సంస్కృత రచనలు - శతకాలు, ఆంగ్ల, తమిళ రచనలను పేర్కొంటూ, బహుభాషా పండితులుగా వారి గొప్పదనాన్ని ఆరవ అధ్యాయంలో వివరించారు. పత్రికా నిర్వాహకులుగా ఒద్దిరాజు సోదరుల ప్రతిభ ఏడవ అధ్యాయంలో కనిపిస్తుంది. 'ప్రకీర్ణకాలు' అనే ఎనిమిదవ అధ్యాయంలో ఒద్దిరాజు సోదరులు రాసిన వ్యాసాలు, చాటువులు, పేరడీలు, కవితలు, బుర్రకథల గురించి వివరించారు. అనుబంధంలో ఒద్దిరాజు సోదరుల వంశవృక్షం, ఫొటోలు, సంతకాలు, చేతిరాత, సోదరుల రచనలపై పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, ప్రముఖుల ప్రస్తావనలు తదితరాలు వున్నాయి.
ఒద్దిరాజు సోదరుల జీవితం - కృషి గురించి సమాచారమే దొరకని స్థితి వుంది. పైగా వారి పుస్తకాలు సగానికి పైగా అముద్రితాలు. ముద్రితమైనవి కూడా అలభ్యాలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కొండపల్లి నీహారిణి, ఒద్దిరాజు సోదరులను పరిశోధనాంశంగా ఎన్నుకోవడమే సాహసం. అయినప్పటికీ పరిశోధకురాలు విపరీతంగా శ్రమించి, వారికి సంబంధించిన ఎన్నో జీవిత విశేషాలను వెలికితీయగలిగారు. ఆ సోదరులు ముద్రించిన పుస్తకాలు శిథిలావస్థలో నుండి సేకరించి, అముద్రిత గ్రంథాల లిఖిత ప్రతులను శోధించి, వాటి గురించి విశ్లేషణాత్మకంగా వివరించడంలో పరిశోధకురాలు చూపిన ఓర్పు, నేర్పు ప్రశంసనీయం. విస్తీర్ణం దృష్ట్యా పరిశోధనా సిద్ధాంత గ్రంథాలను కుదించి ప్రచురించడం పరిపాటి. అయినప్పటికీ నీహారిణి తన సిద్ధాంత గ్రంథాన్ని యథాతథంగా అనగా 700 పేజీలతో ప్రచురించడం మరో సాహసమనే చెప్పాలి. ఆచార్య వెలుదండ నిత్యానందరావు పర్యవేక్షణలో రూపొందిన ఈ సిద్ధాంత గ్రంథం, ఒద్దిరాజు సోదరుల మీద వచ్చిన మొదటి ప్రామాణిక గ్రంథంగా నిలిచిపోతుంది.
తెలంగాణ వేగు చుక్కలు ఒద్దిరాజు సోదరుల జీవితం - సాహిత్యం (పరిశోధనా గ్రంథం)
కొండపల్లి నీహారిణి, పేజీలు : 702, వెల : 800/-,
ప్రతులకు : ప్రముఖ పుస్తకకేంద్రాలు.
- కె.పి.అశోక్ కుమార్