Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలోనే కాదు వచన కవితా రంగంలోనే తొలి కవిగా 1953 లోనే మహైక దీర్ఘ కావ్యంతో నిల్చిన కవితామూర్తి శ్రీ కవిరాజమూర్తి. వీరి మహైకకు ముందుమాటలో నయాగరా కవుల్లో ఒకరైన బెల్లంకొండ రామదాసు వ్యాఖ్యానిస్తూ చిలీ కవుల్లో పాబ్లో నెరుడా ఎంతటివాడో సర్వదేవభట్ల నరసింహమూర్తిని అంతటి వాడుగా కీర్తించారు.
శ్రీ కవిరాజమూర్తి అసలు పేరు శ్రీ సర్వదేవభట్ల నరసింహమూర్తిగారు. శ్రీ నరసింహమూర్తి గారు పిండిపోసలు గ్రామంలో 1926లో పుట్టారు. విద్యాభ్యాసం బాల్యం ఖమ్మంలోని మామిళ్ళగూడెంలో జరిగింది. ఖమ్మం జిల్లాలో ప్రజాసాహిత్య పరిషత్తును స్థాపించి ఎందరో యువ, నవ కవులను ప్రోత్సహించిన కవితావరేణ్యులు. వీరు ఆనాటి నిజాం పోరాటంలో స్వయంగా పాల్గొన్నారు. తాను భూస్వామ్య, ధనవంతుల కుటుంబం నుంచి వచ్చినా, ఆయన ఆనాటి రజాకార్ల, జమీందార్ల, గ్రామ పటేల్ పట్వారీల దోపిడీ పీడనలకి వ్యతిరేకంగా పేదసాదల పక్షాన నిల్చి పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన కవితాశక్తిని ప్రశంసించి స్వయంగా నాటి నిజాం నవాబు చేత సత్కరించబడి 'కవిరాజ్' అనే బిరుదునందుకొన్నారు. వీరి కలం నుండి అనేక రచనలు వెలువడ్డాయి. వాటిలో ప్రణుతి దీర్ఘకావ్యం, తొలి దీర్ఘ వచన కావ్యాల కవిగా నిల్చిపోయినాడని ఆచార్య మాదిరాజు రంగారావు రాసిన నవతలోని వ్యాసంలో ప్రకటించారు. 1953 నాటికే వీరి రచనలు వెలువడటం, వీరి కవితా ప్రతిభకు దర్పణం. శ్రీమూర్తి 'మానవ సంగీతం' కావ్య సంపుటిని, నవయుగశ్రీ అనే గేయాలను బుర్రకథా రూపంలో వెలువరించారు. ఇదే కాక 'మైగరీబ్హు' నవలను, ఆఖరీరాత్, ఇంకా అనేక కథలు, వ్యాసాలు, కవితలు వెలువరించారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియల్లో తన కళాచాతుర్యాన్ని ఆవిష్కరించి చూపిన కళావతంసులు. చక్కటి వక్త, హాస్యప్రియుడు, చమత్కారం ఆయన సహజ లక్షణం. ఆయన 'మధుర ధారలు' అన్న ఉరుదూ, పారసీ కవుల కవితా మాధుర్యాలను ఆ కవిత్వాల శక్తిని 'గజల్' రూపంలో ఉన్న వీటిని ముక్తకాలుగా రచించారు. మధుధారల్లో ఒకచోట ప్రకటించినట్లుగా ''నన్ను మీరేమీ చేయలేరు/ నేను మరణించిన తరువాత కూడా / నలుగురి భుజాల మీద స్వారీ చేస్తాను'' అనేశారు. ఇటువంటి దృఢ దీక్షా, కాంక్షాపరులు. వీరు ఉరుదూ, తెలుగు, ఆంగ్ల సాహిత్యాల్లో మంచి ప్రవేశం ఉంది.
వీరి మహైక కావ్యాన్ని ఒక ఎపిక్గా పోల్చటం జరిగింది. మహైక ముందుమాట లాంటి దర్పణంలో మార్క్సిస్ట్ దర్శనంతో పరిపూర్ణ నవమానవ దర్శనాన్ని సమన్వయించడానికి వంతెన కోసం మరో అన్వేషణ సాగిస్తున్నారు శ్రీమూర్తి. వారిలో బెల్లంకొండ రామదాసు, అనిశెట్టి, రెంటాల గోపాలకృష్ణ మొదలైన యువకులు, దార్శనికులూ నవీన దర్శనావతరణం కోసం మార్క్సిజాన్ని సమగ్రంగా అవగాహన చేసుకొన్నారు. ఇటువంటి సమయంలోనే వెలువడింది ఈ మహైక కావ్యం.
మార్క్సిస్ట్ దర్శనాన్ని పరిపూర్ణంగా ప్రతిఫలించే మహత్తర కావ్యశ్రేణిలో చేరే ఉత్తమ కావ్యం ఇదని అంటారు బెల్లంకొండ రామదాసు. మహాప్రస్థానం, అగ్నివీణ, త్వమేవాహం, వజ్రాయుధం, సంఘర్షణ, ఉదయిని, అడవి, మహైక ఈ మహాకావ్యాలు మానవజాతికి మార్గదర్శనమైనవని అంటారు.
వికలమానవుని భీకర వేదనను వినిపింపచేస్తుంది ఈ కావ్యం. చరిత్ర పన్నిన కుట్రను ఛేదించి ప్రస్తుతాన్ని పరివర్తించి భవిష్యత్తును నిర్మిస్తుందంటారు.
శ్రీ కవిరాజమూర్తి గొప్ప దర్శనం గల కవి. గొప్ప కవులకు గొప్ప దర్శనం, గొప్ప వేదన, గొప్ప శాంతి ఉంటుంది. అలాంటి వారినే మహాకవులనవచ్చునంటారు.
మహైక చదువుతుంటే టి.యస్. ఇలియట్ వేస్ట్ లాండ్ గుర్తుకు వస్తుందంటారు బెల్లంకొండ రామదాసు. కవి జగత్తును ప్రశ్నిస్తాడు. జగత్తు సమాధానం చెబుతుంది.
నీరసించిన మీ కండ్లలోని పరిశ్రాంతి
నిలువుటద్దంలోని నీడలాగా అనిపిస్తున్నది
ముదిమితో మదమెక్కిన లోకం -
దరిద్రుల మనుకోవడమే మహాదరిద్రం.
అంతానన్నుకొన్నారు
ప్రతికలం నాకు హలాహలం
ఖైదీ కన్నుల్లో నన్ను నేను చూశానంటారు.
ఈ విధంగా కవిరాజమూర్తి ఈ మహైక కావ్యంలో ఖైదీకన్నుల్లో, పసిపాప నీరస వదనంలో, పడుపుకత్తె చెరిగిన ముంగురుల్లో తన ఆత్మను తనే సందర్శిస్తాడు. ఈ విధంగా అధునాతన వికల విశ్వాసానికి ప్రతినిధులైన కార్మికుడు, సామాన్యుడు, పడుపుకత్తె కవికి నిర్వేదాన్ని నివేదించుకుంటారు. కవి ఓదార్చి విశ్వ విముక్తికి విప్లవాత్మక మార్గాన్ని అందిస్తాడు. ఆశనూ, ఉజ్వల భవిష్యత్తును సూచిస్తాడు. సమగ్రమైన మార్క్సిస్టు దర్శనం గల ఉత్తమ కావ్యాలలో మహైక ఒకటి. తెలంగాణ యువకులకు ఈ కావ్యోత్పాదకత ఒక నూతన మార్గాన్ని సూచిస్తుంది. ఒక కొత్త వెలుగునిస్తుంది. తెలంగాణ విప్లవ సాహిత్యానికి నూతన శోభను చేకూరుస్తుంది.
అభ్యుదయ కవిత్వంలో ఇంతటి కవి ఎందుకు సరియైన గుర్తింపు అందకోలేదో తెలియదు కానీ తెలంగాణ కవి కావడం వల్లనా? ఏమిటో అభ్యుదయోద్యమానికే తెలియాలి.
సమాకాలీన సమాజ రూపాన్ని ఉన్నదున్నట్లుగా కాకుండా సామ్యవాద దృక్పథంతో భావించి, విశ్లేషించి, వ్యాఖ్యానించి, చిత్రించడం ఈ సాహిత్య ప్రధాన లక్షణం. శ్రీశ్రీ కవితామార్గంలో అభ్యుదయ భావనతో ఇలియట్ టి.యస్. శిల్ప సంవిధానంతో అవతరించిన కావ్యం 'మహైక'. రచయిత సర్వదేవభట్ల నరసింహమూర్తి, అభ్యుదయ భావన, స్వేచ్ఛాతత్వం, మానవతా దృష్టి కలిగిన మూర్తి వ్యక్తిత్వం ఇందులో రూపు కడుతుంది. శిథిల స్థితిలో ఉన్న ప్రాచీన వ్యవస్థ నుంచి, అభ్యుదయాత్మక వ్యవస్థ నిర్మాణాన్ని కవి ఆకాంక్షిస్తున్నాడు.
- సి.హెచ్.ఆంజనేయులు, 9154834964