Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేం హైస్కూల్లో చదివే రోజుల్లో ఎనిమిదో తరగతి తెలుగు వాచకంలో 'వదరుబోతు' వ్యాసం ఒక పాఠంగా వుండేది. విద్యార్థుల పఠనాసక్తిని పరిశీలించడానికి ఇలాంటి గ్రాంథిక వ్యాసాలనే ఎంపిక చేసుకునేవారు. తర్వాతికాలంలో అక్కడొకటి, ఇక్కడొకటి వ్యాసాలను చదువుకుంటూ పోయామే తప్ప, అన్నీ ఒక దగ్గర చదువుకునే అవకాశం రాలేదు.
1917 ఆగస్టు 1 నుండి అనంతపురం పట్టణం కేంద్రంగా 'స్టూడెంట్స్ క్లబ్ అనంతపురం' పక్షాన విద్యార్థులు సమిష్టిగా 'వదరుబోతు' పేరున వ్యాసాలను కరపత్రాల రూపంలో ప్రచురించడం ప్రారంభించారు. ఈ వ్యాసాలు పరోపకార గుణం, విలువలతో కూడిన విద్య, గ్రంథాలయాలు, కళాశాలల ఆవశ్యకత, దేశాభ్యుదయం, సహజ స్వభావశక్తి విశిష్టత, స్వదేశీ వస్తూత్పత్తి, మూఢ మతభక్తి నిరసన, అనర్హ గౌరవం, కీర్తి కండూతి, ఆడంబర జీవితం, అనవసర ధనవ్యయం, పరాయి సంస్కృతి, పరాయి అనుసరణ వ్యతిరేకత, హాస్యం ఆవస్యకత, సత్యవంధిత, కవిత్వ నాటకతత్త్వం, తెలుగు సంస్కృత సాహిత్యాల వికాసం - ఇలా మానవ ప్రవృత్తికి, సహజ పోకడలకు సంబంధించిన అనేక అంశాల నేపథ్యంగా 'వదరుబోతు' వ్యాసాలు సాగుతాయి.
మొత్తం రెండేండ్ల కాలంలో యాభై వ్యాసాలు ప్రచురించగా అందులో హిందూపురంలోని ఏక్కా గురురామాచార్యుల వద్ద లభ్యమైన ఇరవై రెండు వ్యాసాలను 1932లో వదరుబోతు పుస్తకంగా సాధన ముద్రణాలయం పక్షాన ప్రచురించారు. కరపత్రాలుగా వెలువడినప్పుడు వదరుబోతు వ్యాసాలకు శీర్షికలు లేవు. 1932 ముద్రణలో చదువరులకు అనుకూలంగా వుండేందుకు ప్రతి వ్యాసానికీ శీర్షికలు ప్రకటించారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ పీఠిక రాశారు. నిజానికి 'వదరుబోతు' వ్యాసాల రచయితలు ఎవరు? వారి ఆశయాలేమిటి? ఎందుకు తాము మరుగున వుంటూ కరపత్రాలుగా వ్యాసాలను ప్రచురించారు? లాంటి విషయాలను వివరంగా చర్చించిన అప్పిరెడ్డి హరనాథరెడ్డి ముందుమాట విలువైనదే. కాని 1917లో 'వదరుబోతు' ....కు 1913లోనే వచ్చిన 'సాక్షి' వ్యాసాలకు ఎలాంటి సంబంధమూ లేదనుట సంశయాత్మకమే. సాక్షి వ్యాసాలను అనుసరించి ఆదోనిలోని కొందరు యువకులు 'ఆదోని పురాణ సంఘం' గా ఏర్పడి 1928 ఫిబ్రవరి 2 నుండి రాసిన మూడు వ్యాసాలను 'సాధన' పత్రికలో ప్రచురించి ప్రోత్సహించారు. ఈ వ్యాసాలు ఆనాటి స్త్రీల పరిస్థితులు, స్త్రీల స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, విధ్వంసమవుతున్న విలువల గురించి తెలియజేస్తాయి.
ఈ వ్యాసాలు ఉత్తమ పురుషలోను, ఆత్మస్వగతంగా చెబుతున్నట్లు, సర్వసాక్షి దృష్టికోణంగా, సందేశాత్మకంగాను కొనసాగుతాయి. వ్యాసాల ఎత్తుగడలో విషయ చర్చలు, ఉపపత్తుల సమీకరణలో, ముగింపులో ఇలా అన్ని సందర్భాలలో నిర్మాణ నైపుణ్యం భావితరాలు అనుసరించదగ్గవి. వ్యాసాలు ఎలా రాయాలో నేర్చుకునేవారికి నమూనాగా ఈ వ్యాసాలు తోడ్పడతాయి.
వదరుబోతు (వందేళ్ళ కానుక - 17), సంపాదకులు : డా||అప్పిరెడ్డి హరినాథరెడ్డి, పేజీలు : 136, వెల : 50/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
- కె.పి.అశోక్కుమార్, 9700000948