Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతశ్రీ అనే కలం పేరుతో కథారచయితగా ప్రసిద్ధుడయిన జంగం చార్లెస్ గారు నవంబర్ నాలుగున అనారోగ్యంతో తన నివాసమైన కొత్తగూడెంలో మరణించారు. పందొమ్మిది వందల డెబ్బయి, ఎనభైలలో తెలంగాణ ప్రాంత బడుగు జీవుల బతుకు చిత్రాలను తన కథల ద్వారా తెలుగు ప్రజలకు, తెలుగు సాహిత్యానికి అందించిన నిబద్ధ కలం ఆగిపోయింది. అభ్యుదయ రచయితల సంఘం ప్రేరణతో ఆ ఉద్యమంలో పాలు పంచుకుంటూనే అణగారిన ప్రజల జీవన సంబంధాలను కథలుగా మలచి కథాశిల్పిగా గొప్ప కీర్తిని తెచ్చుకున్నారు.
అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదం ప్రపంచీకరణ పేరుతో అరూప శత్రువుగా మారి చేతి వృత్తుల జీవనాన్ని ఎలా ధ్వంసం చేసిందో, ఆ 'కుట్ర'ల రహస్యాలన్నింటిని మన కళ్ళముందు పరచి, ఆ కుట్రలను ఛేదించేందుకు, అంతమొందించేందుకు నిరంతరం కృషి చేసిన అంకితభావుకుడు జాతశ్రీ మనతో లేకుండాపోవటం తీవ్రమైన లోటు. 1943లో నల్లగొండలో జన్మించిన జాతశ్రీ ఆ తరువాత ఇల్లందులో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా చాలాకాలం పనిచేశారు. నేను ఏడవ తరగతి చదువుతున్నప్పటికి ఉపాధ్యాయునిగా చార్లెస్గారు తెలుసు. అప్పుడే అరసం కార్యక్రమాలను ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తూ 'స్త్రీ' అనే ఒక కవితా సంకలనాన్ని తీసుకువచ్చారు. మొదట కవితలూ రాశారు. నాటక రచనలూ చేశారు. కథలు, నవలలు రాయటం ద్వారానే ప్రసిద్దులయ్యారు.
ఆయన రాసిన మొట్టమొదటి నవల 'బలిపశువు'. ఇది ఇల్లందు పరిసర ప్రాంతపు వ్యవసాయ కూలీల జీవన సంబంధాలకు అద్దం పట్టే నవల. 1960లలో పల్లెల్లో భ్వూస్వాముల ఆగడాలు, కూలీలను అణచివేయడానికి కూలీలనే ఎలా ఉపయోగిస్తారో, ఎన్ని మాయోపాయాలు పన్నుతారో కళ్ళకు కట్టిస్తుంది. సామాన్య ప్రజల మానసిక స్థితి, మానవ సంబంధాలు వివరిస్తుంది. రెండో నవల 'వెదురు పొరలు నినదించాయి'. నవల మొత్తంగా గిరిజనుల బతుకు పోరాటాన్ని చాలా శక్తివంతంగా వినిపించిన నవల.
ఈ నవల ఇప్పుడు లభ్యం కావటం లేదు. ఇక మూడోది 'సింగరేణి మండుతోంది'. ఇది మొత్తంగా సింగరేణి కార్మికుల జీవనాన్ని, వారి పరిసరాలను, యాజమాన్య తీరును, కార్మిక సంఘాల పాత్రనూ కళ్ళకు కట్టినట్లు చిత్రించిన నవల. ఇది ఇల్లందు ప్రాంతంలో కార్మికుల జీవితాను తాను నిత్యం చూస్తూ అధ్యయనం చేసి సృజించినది. బొగ్గుగని కార్మికుల బతుకులను ప్రతిబింబించిన నవలగా చరిత్రలో నిలిచిపోయినది.
ఆ రోజుల్లో దిన, వార పత్రికల్లో అనేక సీరియళ్ళు, మధ్య తరగతిని ఆకర్షించే కథలు వస్తున్న సందర్భంలో క్రైం, డిటెక్టివ్, ప్రేమ, సెక్స్ సాహిత్యం వెల్లువెత్తుతున్న దశలో, ఇక్కడినేలపై వ్యవసాయ కార్మికుల గురించి ఎంతో చైతన్యవంతంగా నిబద్ధంగా రచనలు చేసినవాడు జాతశ్రీ. రచనలు చేయడమే కాదు శ్రామికుల ఉద్యమాలతో మమేకమయినవాడు. రష్యన్ విప్లవ స్ఫూర్తితో కొనసాగినవాడు
దాదాపు వంద కథలు రాసిన జాతశ్రీ ఆరు కథా సంపుటాలను వేశారు. 'కపోత, ప్రభంజనం, చలివేంద్రం, కుట్ర, రేగాలి, ఆర్తారావం' మొదలైనవి. నేను యువకుడిగా ఉన్నప్పుడే చదివిన జాతశ్రీ గారి కథలు 'పంక్చర్ బతుకులు, గాయం' మొదలైనవి ఇప్పటికీ వెంటాడుతుంటాయి. ముఖ్యంగా 'చలివేంద్రం, కుట్ర, ఆర్తారావం' కథల్లో చేతివృత్తులు, మధ్యతరగతి ప్రజల జీవన పోరాటాలను అద్భుతంగా చిత్రించారు. దొమ్మరి ఆటతో తమ బతుకు పోరాటం ఎలా వుంటుందో చదువుతుంటే వారిలో ఒకడుగా రచయితా జీవించాడేమో అని భావిస్తాం. మత్య్సకారులు, గౌడ వృత్తిదారులు, కుమ్మరులు, కంసాలీల జీవనాన్ని పరిశోధించి సృజించిన చిత్రాల్లా వుంటాయి.
జాతశ్రీ రచనల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే తాను ఎంచుకున్న కథలోని జీవితాలను మొత్తంగా పట్టి ఇవ్వడం. భాష, సంస్కృతి, మానసిక రాజకీయ, సామాజిక సారాన్ని మనకందిస్తారు. ముఖ్యంగా తెలంగాణ భాషను యాసను, నుడికారాన్ని పలుకుబడులను అద్భుతంగా పట్టుకున్నవాడు జాతశ్రీ. ఎవరి జీవితాన్ని కథగా చేయాలనుకుంటారో వారి జీవితాల్లోకి వెళ్ళి రాకుండా ఏ కథా రాయలేదు.
తొంభైల తర్వాత రచనా వ్యాసంగాన్ని ఆపేసి స్తబ్దతగా ఉండిపోయారు. బహుశా సాహిత్య రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కావచ్చు. ప్రపంచీకరణ ప్రారంభంలో వైయక్తిక ప్రాధాన్యతలు విపరీతంగా ముందుకు రావడం, సామాజిక చింతన సన్నగిల్లటం కూడా కారణం కావచ్చు. కానీ 1999లో ఖమ్మం జిల్లాలో 'సాహితీ స్రవంతి' పేర సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడం, నిర్మాణం నిర్వహణ విస్తరించిన తరుణంలో వారిని కలిసిరమ్మని కోరగా, ఎంతో ఆనందంగా సాహితీ స్రవంతిలో మాతో పాటు కొనసాగటమే కాకుండా కథలు రాయటం తిరిగి ప్రారంభించారు. అప్పుడే 'కుట్ర' అనే కథను రాశారు. అదే పేరుతో సాహితీ స్రవంతి ఆ సంకలనాన్ని తీసుకువచ్చింది. అలా పునర్సృజన కొనసాగించి ఎన్నో కథలు రాశారు. ఇది సాహితీ స్రవంతికి, నేటి తెలంగాణ సాహితికి ఎంతో గర్వకారణంగా నిలుస్తుంది.
ఇదే క్రమంలో పదేళ్ళ క్రితం సాహితీ స్రవంతి వార్షికోత్సవం పాల్వంచలో జరుగుతున్న సందర్భంలోనే వారి సతీమణి ఉపాధ్యాయురాలు కస్తూరిబాయి యాక్సిడెంట్లో మరణించడం ఒక విషాదం. అప్పటి నుండి వీరు చాలా మనోవేదనకు గురయ్యారు.
జాతశ్రీలోని గొప్ప విషయాలు రెండున్నాయి. అవి ఒకటి సామాన్య ప్రజల పట్ల నిబద్ధత కలిగి, వారి కోసమే రచనలు చేయటం. రెండు పేరు కోసం పాకులాడకుండా చాలా సామాన్యంగా జీవించడం. అయితే ఆయనకు రావాల్సినంత పేరు రాలేదని నాతోపాటు చాలామంది అభిప్రాయపడతారు కానీ, తెలుగు సాహిత్యరంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచే వుంటుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రసిద్ధ రచయితలు ముల్కరాజ్ ఆనంద్ లాంటి వారితో సాహిత్య సమావేశాల్లో పాల్గొనే అవకాశాన్ని పొందినవారు జాతశ్రీ. 'వట్టికోట ఆళ్వారుస్వామి పురస్కారం' తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం మొదలైనవి ఎన్నో అందుకున్నారు.
ఆయన భౌతికంగా లేడు కానీ ఆయన కథలు సజీవంగా మనతో మాట్లాడుతూనే వుంటాయి. ఆయన నిబద్ధ జీవితాశయమూ ఉంది. ఆ బాటలో పయనించటమే మనం చేయవలసిన కర్తవ్యం. ఆయన కథలు, నవలలు, నాటికలు, కవితలు అన్నీ కలిపి ఒక సంపుటిగా తీసుకురావాలి. తెలంగాణ నేలకు కథారచయితగా కీర్తి తెచ్చిన జాతశ్రీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించి తిరిగి వెలుగులోకి తీసుకురావాలి. ఆయన కథలపై, నవలలపై జాతీయ సెమినార్ నిర్వహించాలి.
వ్యధార్త జీవుల యధార్థ బతుకులను, అందులోని సంఘర్షణను కథల్లో చూపించిన జాతశ్రీ సాహిత్యలోకంలో చిరస్మరణీయుడు. అతని ఆశయంతో ముందుకు పోవటమే వారికి నిజమైన నివాళి.
- కె. ఆనందాచారి, 9948787660