Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వంలో మనను తీర్చిదిద్ది, మన ఉనికిని బలపరుస్తూ ఆహ్లాద పరిచేశక్తి వుంటుంది. అలాంటి శక్తి మరెక్కడా వుండబోదు అన్నాడు వర్డ్స్ వర్త్. జీవితాన్ని గురించి చెప్పడం, ఉద్బోధించడం, ఆహ్లాదపరచడం అనే మూడు ప్రతిపాదనలు ఈ వాక్యాల్లో వున్నాయి. సాధారణంగా కవుల మనసు నైతిక విలువల పట్ల ఆకర్షణకు లోనవడం వల్ల ప్రాథమికంగా జీవిత సంబంధమైన ఉద్బోధన కనిపిస్తుంది. జీవితంలోని అనుభవాల నుంచి కూడగట్టుకున్న నైతికశక్తిని కవిత్వం ప్రతిపాదిస్తుంది. అలాంటి నైతిక మూలాల అనుకలనం ప్రభాకర్ జైని 'పాద ముద్రలు'.
ప్రాతిపదికంగా జైని నవలా రచయిత. నంది బహుమతి పొందిన ఆయన నవల ప్రసిద్ధం. సమాజం నుండి వేటిని చేదుకోవాలో, వేటిని ఇవ్వాలో తెలిసిన రచయిత. జైని కవిత్వంలో కథనాత్మక భాగం ఎక్కువ. ఆంగ్ల సాహిత్యం చెప్పిన మూడు కవితా రూపాల్లో మొదటిది. నవల, కథల్లోనూ ఉండే కథనాత్మకతకు, కవితలోని కథనాత్మకతకు భేదాలున్నాయి. వస్తువు, ఇతివృత్తం, విషయం రెంటిలోనూ వుంటాయి. కాని కథ ఎక్కువ భాగం అమరికపై ఆధారపడితే, కవిత్వంలోని కథనం భావార్థకతపై ఆధారపడుతుంది. అందువల్లే ఐ.ఎ.రిచర్డ్స్ కవిత్వ భాషను భావార్థక భాష (ఎమోటివ్ లాంగ్వేజ్) అన్నాడు. జైనీ కవిత్వంలో కథనం సందర్భాన్ని కాకుండా వ్యక్తిని, నైతికతను ఆనుకుని వుంటుంది. 'నలుపు తెలుపుల దృశ్యం' (పే. 37) లాంటివి ఒకటి రెండు సందర్భాలపై నిలబడిన కవితలు. పరువు హత్య (పే.64) లాంటి వాటిలో అంశం, సందర్భం ఉన్నా వ్యక్తి ముఖమైన నైతికతే ప్రధానం.
1. దేముడూ/ నేనూ కలిసి నడుస్తున్నాం/ సముద్రం ఒడ్డున దేముడితో కలిసి నడుస్తున్నానేమో, చిత్రంగా/ నా జీవితంలోని సంఘటనలన్నీ/ అలవోకగా నా ముందు ప్రత్యక్షమయ్యాయి - (పాదముద్రలు. 10.పే)
2. ''ఎందుకు నాన్నా/ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయావ్?/ మేమింకా పసివాళ్ళమే/ నీ ఛత్ర ఛాయలో హాయిగా వున్నాము/ మేమింకా నీ ఆశయాల మెట్లెక్కి/ జీవిత శిఖరాలను అధిరోహించనేలేదే/ ఊరెళ్ళి వస్తానని చెప్పి శవమై తిరిగొచ్చావ్'' - (నాన్నా. 30.పే)
3. కాయానికి సౌఖ్యం పెరిగింది/ కానీ, గుండెకు గాయమయింది/ ఇప్పుడు, వందల కిలోమీటర్ల దూరం/ వేలమైళ్ళ ప్రయాణం లాగా విసిగిస్తుంది - (వృక్షవిలాపం 46)
జైని గారిలో బహుముఖీన అనుభవాలున్నాయి. మానవాతీతమైన ఊహలున్నాయి. ఇవి ఆకాంక్షల వంటివి కూడా ''దేముడితో కలిసి నడుస్తున్నానేమో'' అనుకోవడంలో ఈ దృష్టి వుంది. నిజానికి దేవుడు మనిషిలోపలే వుంటాడనేది తత్త్వ సారాంశం. కాళిదాసు 'క్షేత్రాభ్యంతర వర్తినమ్' అన్నాడు. శరీరంలో వుండేవాడు అని. అంటే మనిషే దేవుడని కాదు. ఒక విషయం, శూన్యం కూడా దేవుడుగా భావనాశక్తి మానవుడిదేనని. ఈ దైవానుభూతిగల పాదముద్రలనే జైని అన్వేషిస్తున్నది.
నాన్న కవిత ఎలిజీ లాంటిది. కొడుకు గొంతులో నైతిక విలువలు ధ్వనించడం గమనించదగింది. 'ఛత్రఛాయ'లో హాయిగా ఉన్నామనడంలో తండ్రిపై వుండే గౌరవం కనిపిస్తుంది. తమను పెంచిన నాన్న ఉన్నతిని చూడలేదన్న భావన కనిపిస్తుంది. మూడవ భాగం సామాజికమైంది. ఇందులోనూ నైతికాంశమే వినిపించినా, సందర్భం, వస్తువు సామాజికమూ, ప్రకృతి గతము అయినవి. కాలుష్యం, మానవుని స్వార్థం వల్ల ప్రకృతికి జరుగుతున్న నష్టం ప్రధానమైనవి అయినా మనిషి కోల్పోతున్న దాన్ని ఈ కవిత చెబుతుంది.
మొత్తంగా 'పాదముద్రలు' కోల్పోయిన జీవితాలలోని శాంతిని పునరన్వేషిస్తున్నాయి. వస్తువు ముఖ్య ప్రయోజనం సందేశాన్నివ్వడమే. గతించిన జీవితంలోని నిరాపేక్షమైన శాంతప్రవృత్తి, ప్రకృతిని, మానవ ప్రవృత్తిని గాయపరచనని జీవితంవైపు ప్రేరేపించడమే ఈ కవిత సందేశం. ''మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో: బంధనే విషయాసక్తి ముక్తో నిర్విషయం మనః'' - అని ప్రాచీనుల తత్త్వ దర్శనం. బహుశః ప్రకృతి గతమో, నైతికమూ, దైవగతమైన అంశాల పట్ల దృష్టియే జైని కవిత్వానికి కారణం. ఇంకా కవిత్వసాధనలో పాదముద్రలు కొత్తదారులు వెతకాలి. ఆ అవసరం సాహిత్యానికి ఎప్పటికీ వుంటుంది.
పాదముద్రలు (కవిత్వం), ప్రభాకర్ జైని, పేజీలు : 87, వెల : 150/-,
ప్రతులకు : ఫ్లాట్ నెం.111, సి బ్లాక్, విష్ణు రెసిడెన్సీ, గాంధీనగర్, హైదరాబాద్ - 80.
- ఎం.నారాయణ శర్మ,
9177260385