Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రశ్న అంటే ఎత్రాజ్' అనే గొప్పగా చెప్పాడు వర్మ. ప్రశ్ననే గదా సమాజ అంశను దొరుకబట్టేది. ప్రశ్న లేకపోతే మళ్ళీ చెప్పింది వినే బానిస మనస్తత్వం వ్యాపిస్తది. అల్లకల్లోలం అవుతున్న సామాజిక అంశాలను సహజంగానే కవి పట్టుకుంటాడు.
నాగవర్మ కవిత్వంలో ఇది మొదటి కోండ్ర. ఆయన కరీంనగర్లో 2004లో డిగ్రీ చదువుతున్నప్పుడే కవిత్వ పొలిమేరలకు వచ్చిండు. ఆ తర్వాత ఉన్నత చదువువులు, ఉద్యోగవేట వివాహం అన్న దశలు విజయవంతంగా దాటుకొని సాహిత్య వ్యవసాయంలో సాలు పెట్టిండు.
ముత్యం నాగవర్మ కవిత్వం నిండా ఎవుసం, వ్యవసాయదారుడు, ఊరు, బడి, బడిపిల్లలు అల్లుకుంటరు. భూమి మీద మనసుకు పట్టనివ్వని ఆవేదన గన్పిస్తది.
నీకు భూమంటే మన్నే కనువడతది
కాని ఈ భూమే
మాకు బువ్వ పెట్టే తల్లి
ఆసర పెట్టే కొడుకు
ఆపతిల ఆదుకునే సోపతి
మంచిర్యాల జిల్లాకు ఎర్రగుంటపల్లిలో ఏండ్లకు పైగా సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్కు తమ భూమి ఇయ్యమని రైతులు నిరాహారదీక్ష చేస్తున్నరు. ప్రభుత్వం బలవంతంగా భూములు గుంజుకునే విధానాలపై ఆయన చలించి పోయిండు.
నాగవర్మ మిషన్ కాకతీయ ద్వార చెరువుల తవ్వకాన్ని రైతుకవిగా ఆనందాన్ని పంచుకుంటాడు.
నిన్నటిదాకా పని లేని నీరటి ఇగ
కాలువ గట్టు మీద కవాతు చేత్తడు
నీరు గట్టె అసొంటి నాగలి ఇగ
జేరొ పోతై పరుగులు తీస్తది
కవి అనుకులమా వ్యతిరేకమా అని కాదు ఆయా విధానాలపైనే ఒక ద్రష్టగా వ్యాఖ్యానిస్తాడు. ముందే చెప్పినట్టు పల్లెటూర్ల మీద రాయని కవి లేడు. నాగవర్మ పుట్టింది ఉద్యోగం చేస్తున్నదీ పల్లెనే గనుక ఆ అనుబంధం ఇంకా పచ్చిపచ్చిగా కొనసాగుతుంది.
చెరువులు కుంటలు
కాలువలు వాగులే కాదు
చిన్న చిన్న మడుగులు కూడా
నా మనోఫలకం మీద మహా సముద్రాలే
ఎందుకంటే
నీటి బొట్టు తాకితేనే తప్ప
మొలకెత్తని రైతు కుటుంబంలో పుట్టాను
ఇట్లాంటి పలు కవితలు సాళ్ళు సాళ్ళుగా పరుచుకున్నాడు. బడి మీద పిల్లల మీద బాగానే ఉన్నయి. ఎందుకంటే నిరంతరం పాఠశాలనే జీవితం గదా!
పిల్లని ప్రశ్న ఒక ఇత్తు
సారు ఇగురం తోనే మొలకెత్తు
రకరకాల ప్రశ్నించే విద్యార్థులకు పదును పెట్టి శాస్త్రీయ, ఆలోచనల వైపు ప్రోది చేయాల్సింది ఉపాధ్యాయుడు. అందుకే ప్రశ్న అనే విత్తనాన్ని ఇగురంగా మొలకెత్తించాల్సిందిగా చెప్పుతాడు.
ఇప్పుడు ఇక్కడ ప్రశ్నించే ఎత్రోజ్
నిలదీత ధిక్కారం నీ కంట్లో కారం
ఇప్పుడు ప్రశ్నలకు భయపడే కాలం. కొన్ని ప్రశ్నలను ఆదిలోనే అంతం చేస్తున్న కాలం దాపురించింది. 'ప్రశ్న అంటే ఎత్రాజ్' అనే గొప్పగా చెప్పాడు వర్మ. ప్రశ్ననే గదా సమాజ అంశను దొరుకబట్టేది. ప్రశ్న లేకపోతే మళ్ళీ చెప్పింది వినే బానిస మనస్తత్వం వ్యాపిస్తది. అల్లకల్లోలం అవుతున్న సామాజిక అంశాలను సహజంగానే కవి పట్టుకుంటాడు.
కూర తిన్నందుకే
కుతికెలు కోస్తిరా అని ప్రశ్నిస్తే
కుల్లబొడిసి నల్లసిరా మొఖానికి పూసిపోతరు
బహుళ సంస్కృతుల సమాజంలో విపరీత పెడధోరణుల పల స్పందించినట్లే తన నానమ్మ మరణంపై చాలా గొప్ప ఎలిజీ రాసిండు. 'ఎడారైన వాడ' అనే కవితలో వాల్ల ఊరివాల్లు మరణించినప్పుడు ఒక్కొక్కరి పేర్లతో కవిత వాల్లకు నివాళిగా ఉంది. 'వరికల్లం' శీర్షికన వచ్చిన ఈ కవిత్వం భాషలో, భావంలో కొత్తకొత్తగా ఉంది.
- అన్నవరం దేవేందర్,
94407 63479