Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వం లేదా ఇతర సృజనాత్మక ప్రక్రియలు, రూపాలు వచ్చినంతగా విమర్శ రావడం లేదన్నది వాస్తవమే కాని అసలు విమర్శ లేదనేంత సత్యం కాదు. అయితే ఇప్పుడు విమర్శ శకలాలు శకలాలుగా పుస్తకంపైనో, కవిపైనో, రచయితపైనో వ్యాసాల రూపంలో వస్తుంది. ఈ శకలాల నుంచే కొన్ని సంవత్సరాల సాహిత్య గమనాన్ని వ్యాఖ్యానించడానికి వీలవుతుంది. అందువల్ల పుస్తక విమర్శను కూడా విమర్శలో భాగంగా గమనించాల్సి ఉంది. ఒక పుస్తకం లేదా కొన్ని పుస్తకాలు ఒక కవి, రచయిత లేదా కొందరు కవులు లేకుండా ఒక సాహిత్య మార్గాలను, అందులోని కాలం, సంస్కృతి, పరిణామాలు, పరిణతులను ఎలా అంచనా వేస్తారు. నిజానికి ఈ కాలంలో ప్రత్యేకంగా పరిశోధనకో, రచనకో పూనుకుంటే గాని సాకల్యంగా గ్రంథాన్ని గురించి, కవి గురించి చర్చించే అవకాశాలు లేవు. పైగా ఈ కాలం విమర్శను అంతో, ఇంతో సాహిత్యపేజీలు మోస్తున్నాయి. వాటిలో స్థలాభావం ఒక కారణం. కనుక విమర్శ రూపంలో ఉండే విమర్శాంశ గల వ్యాస సంపుటాలు విమర్శనే అనుకోడానికి సందేహం అవసరం లేదు. ఏది విమర్శ ఏది సమీక్ష, ఏది పరిచయం, ఏది సారాంశం అనే విషయాలపైన నిర్దిష్టమైన అభిప్రాయాలు లేకపోవటం వల్ల కూడా 'పుస్తకం' ఆధారంగా చేసుకుని రాసినవన్నీ 'సమీక్ష'లే అనే ధోరణి ఒకటి స్థిరపడిపోయింది. తెలుగులో కనిపించవు గాని ఇతర దేశాల సాహిత్యంలో వీటి గురించి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి.
పుస్తక సమీక్ష : పుస్తకంలోని అంశం యొక్క పూర్వాపరాలను, పరిణతిని, సాహిత్యగతిని అనుసరించి అంచనా వేస్తుంది. సాహిత్య గతి పుస్తకంలోని అంశాల మధ్య సంబంధాలను, విభేదాలను పరిశీలిస్తుంది.
విమర్శ : సాహిత్యాంశం యొక్క సాంకేతికతను, శైలిని పరిశీలిస్తుంది. సాహిత్య రచన యొక్క శక్తిని, లోపాలను అంచనా వేస్తుంది. సాహిత్య గతిలోని స్థానాన్ని నిర్ణయిస్తుంది.
సారాంశం : పుస్తకాలలోని అంశాల మొత్తాన్ని గమనించి పుస్తకం ఎటు వైపు నిలబడుతుందని చెప్పటం. సృజనాంశాన్ని అర్థమయ్యేట్లుగా రాయడం.
సమాచారం (రిపోర్ట్) : రచయిత పూర్వపు రచనలు, ఆ మార్గంలో ఈ రచన సంఖ్య. మొత్తం పేజీలు, విలువ, శీర్షికలు మొదలైన వివరాలు తెలిపేది.
ప్రస్తుతం తెలుగు వాతావరణంలో సమీక్ష స్థానాన్ని సారాంశం, సమాచారం ఆక్రమిస్తున్నాయి. ఏ అంశాన్ని గురించి ఏం చెప్పాడో రాయడం వల్ల సారాంశ స్థితికి సమీక్ష వెళ్ళింది. సాహిత్య విమర్శ అధ్యయనంతో కూడకున్న పని. ఒక రచనను పరిశీలించినప్పుడు అనుభూతి, అనుభవాలతోపాటు అధ్యయనం కూడా కావాలి. అప్పుడే రచనలోని వైశిష్ట్యాన్ని చూపగలదు. నిజానికి విమర్శ సంప్రదాయ అవిచ్ఛిన్నత (Conventional Contiguity) ను పోషిస్తుంది. దూసుకొస్తున్న రచన, రీతి, వాటికి గతంతో ఉన్న సంబంధం. అలాంటి రూపాల మధ్య సహశీలత విమర్శ అంచనా వేస్తుంది. నూతన అంశం దాని ప్రాథమిక అంశం నుండి ఎలా విడివడిందో, దానితో పోలికలను ఎలా నిలుపుకుందో చెప్పడమూ విమర్శ చేస్తుంది. కేవలం దోషాలను చూపడమే విమర్శ కాదు. అది ఒక ఇరుకైన మనస్తత్వం గలవారు చేసే పని. ఇలియట్A Critic in the narrow sense ఇలాంటి విషయాన్నే చెబుతుంది. అందువలన సహృదయత, పరిశీలన, అధ్యయన వైశాల్యం విమర్శకు అవసరమైన అంశాలు.
ఏనుగు నరసింహారెడ్డి కవిత్వంపై చేసిన విశ్లేషణాత్మకమైన వ్యాసాలు ఈ 'అంతరంగం'. ఇవి ఆయన పరిశీలన దృష్టిని, అధ్యయన శీలతను, లోతైన అనుభవాన్ని ప్రకటిస్తాయి. కవిత్వం అనే ఒక రేఖపై ఇందులోని సృజన రూపాలున్నా, ఇవన్నీ వచనకవిత, గేయం, గజల్ లాంటి వైవిధ్యాంశాలపై చేసిన విశ్లేషణలు. ముఖ్యంగా ముందు మాటలు, వ్యాసాలు, సదస్సు పత్రాల రూపంలో వేర్వేరు ప్రయోజనం గలవి. ఒకటి, రెండు మినహాయిస్తే ఇందులోని కవిత్వానికంతా తెలంగాణా ప్రాంతమే భూమి. బహుశ: ఇప్పుడున్న సాంస్కృతిక పునరుజ్జీవన, పునర్మిర్మాణ స్థితుల ప్రభావం కూడా కారణం కావొచ్చు.
రాశిలో వచన కవిత్వం పై రాసినవే ఎక్కువ. ఇందులోనూ శిల్పం, ఊహ, దృక్పథం మొదలైన అంశాలపైన దృష్టి ఎక్కువ కనిపిస్తుంది. తరువాతి స్థాయి పద్యానిది సామల సదాశివ, కూరెళ్ళ విఠలాచార్య, దాశరథి రంగాచార్య, గంగుల శాయిరెడ్డిల పద్య సాహిత్యంపై రాసినవి. ముందుమాటలుగా రాసిన రెండు పాట, గజల్ రూపాలకు సంబంధించినవి. సమిష్టి కవితాసంకలనాలు, తెలుగులో గేయకవిత్వం, గేయ కవితా వికాసం, ప్రయోగాత్మక కవిత్వం- విమర్శ. అంశాత్మకంగా రాసిన వ్యాసాలు. ఇవి కాక ఒకటి రెండు పుస్తకాలపై రాసిన లఘు వ్యాసాలు, సమీక్ష ఇందులో ఉన్నాయి. 'శివారెడ్డి కవిత్వంపై విశిష్ట అధ్యయనం' అధి విమర్శ (Meta criticism) కు సంబంధించిన వ్యాసం. అయితే ఇందులో చర్చింపబడింది కూడా కవిత్వ విలువల గురించే.
నరసింహారెడ్డి అనుశీలన చారిత్రక పరిణతులు, వికాసం, శిల్పం, అందులోని ముద్ర ఇలాంటి అంశాలను అంచనా వేసింది. 'దాశరథి వచన కవిత - వస్తువు, శిల్పం' వ్యాసంలో ఈ దృష్టి ఉంది.
1. దాశరథి కవిత్వ పోకడలోని ప్రక్రియా వైవిధ్యాలకు, విప్లవతత్త్వానికి , అభ్యుదయ పురోగమనానికి, ప్రణయాసక్తికి ఆయన నివసించిన కాలమే కారణమయింది. (పే.6)
2. ఉద్యమనాళ్ళల్లో పద్యంలో పరుగు తీసిన దాశరథి, స్వాతంత్య్రానంతర వివేచనలు వచనం రాసాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో తన కవిత్వంలో ఆవేశం స్థానంలో ఆలోచన ప్రవేశించింది. ఆలోచనకు పెద్దపీట వేయగల వచన కవిత వాహిక అయిది. (పే.9)
ఇలాంటి ప్రతిపాదనలు చాలా చోట్ల చేస్తారు. లోతైన పరిశీలన వల్ల వీటిని నరసింహారెడ్డి చేర్చారు. ఈ రెండు ప్రతిపాదనలు వస్తువును, రూపాన్ని కాలమే నిర్ణయిస్తుందన్న రూఢిని చెబుతాయి. కవులు కాలాన్ని, రూపంలో వస్తున్న మార్పును గమనించాలన్న ఎరుకను చెబుతాయి. పద్యం నుంచి వచనం దాకా అధ్యయనం, సమకాలీనత వీటిని గ్రహించలేక పోతే ఈ ప్రతిపాదనలు రావు. అధ్యయనంలో బుద్ధి ప్రవహిస్తుంది.
అది ఇలాంటి ప్రతిపాదనలకు మూలం. కొన్ని వచనకవిత సంబంధంగా ఆలోచించదగిన విషయాలను చర్చించారు.
1. అర్థం కావడం అన్నది 'తాత్పర్యం రాయడం'లోంచి పుట్టుకొచ్చిన బాధ అనిపిస్తుంది. ప్రాచీన కావ్యాల్లోలా కథ ఉండి, వాక్యంలో కర్త, కర్మ, క్రియ ఉండి ఆధునిక కవిత్వం ఎందుకు నడుస్తుంది (34 పేజీ)
2. సిధారెడ్డికి ఒక తాత్త్విక పునాది ఉంది. అది మార్క్సిజం కావొచ్చు, మానవతావాదం కావొచ్చు. ఆయన చూపులో దైన్యం ఉంటుంది. అట్టడుగు వర్గాల పట్ల స్పష్టమైన పక్షపాతం కనిపిస్తుంది. (పే. 131) సంక్షిప్తత, సూటిదనం, భాషా సారళ్యం, తాత్త్వికత సిధారెడ్డి కవిత్వ లక్షణాలు (పే. 135) వస్తువుకూ, శిల్పానికి మధ్య సమన్వయం సాధించడం కొందరికి కష్టం. వస్తు వాదాలకు, పోరాటవాద కవిత్వానికి మరింత కష్టం. ఈ అభిప్రా యానికి డా. నందిని సిధారెడ్డి కవిత్వం విపర్యాయం (పే. 138).
ఇలాంటివన్నీ పరిశీలనానుభవం ఉన్న వ్యాఖ్యలు. రూపం. చరిత్ర, పరిణతులు, కవి స్వభావం, కవిత్వ స్వభావంపై ఇలా ఆలోచించదగదినవి, అనేకసార్లు అనుశీలనకు ఉపయోగపడేవైన ప్రతిపాదన, వివరణలు ఈ వ్యాసాల్లో అనేకంగా ఎత్తి రాయొచ్చు. ఇవన్నీ కావ్యానుభవానికి దర్పణం పట్టేవి.
బేట్సన్‘The Scholor’ అనే పుస్తకాన్ని రాశారు. విమర్శకు పాండిత్యావసరాన్ని ఇది చెబుతుంది. నిజానికి పఠనంలో మెదడు, హృదయం రెండు కలసి నడుస్తాయి. ఈ సమయంలో అనుభవాన్ని, పాండిత్యం అజమాయిషీ చేయవచ్చు. ఈ పాండిత్యం అనుభవాన్ని ప్రతిపాదన చేసే వరకు, నిలబడితే చాలు అన్నవారున్నారు. మాథ్యూ ఆర్నాల్డ్ విమర్శకుని వ్యక్తిత్వాన్ని గురించి రాస్తూ ''రచనతో ప్రశంసా పూర్వక సంబంధం పెట్టుకుని, దాని వల్ల కలిగిన అనుభూతిని మాటల్లో అందించడం తన కర్తవ్యంగా భావించే వాడు'' (పే. 147. ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం. జి.వి.సుబ్రహ్మణ్యం) అన్నాడు. నరసింహారెడ్డిలో ఈ లక్షణం ఎక్కువ. ఆయన దృష్టి కూడా ఈ రకమైన 'అభిరుచి విమర్శ'కు దగ్గరిదేననిపిస్తుంది. ఈవిధంగా కవిగా ప్రసిద్ధుడయిన ఏనుగు నరసింహారెడ్డిలోని విమర్శకుడు ఈ పుస్తకం ద్వారా సాహిత్యలోకానికి పరిచయమవుతున్నారు.
- ఎం.నారాయణశర్మ,
98483 48502