Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్లిష్టమైన సమాజంలో కవి మౌనం వహించడు. మౌనంగా ఉన్నట్టు అనిపించినా లోలో పల ఒక కల్లోలం ఉంటుంది. తనకీ సమాజానికీ పొసగ నితనంతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. అది పైకి కనిపించని నిశ్శబ్ద యుద్ధం. ఇదే యాదగిరిరావు కవితా సంపుటి శీర్షిక అయింది. సమాజంలోని అపసవ్యతల మీద ఆగ్రహం, మనుషుల్లోని కపటత్వాన్ని ప్రశ్నించేతత్వం వారి కవిత్వంలో చూస్తాం. ఇదివరలో 'అలజడి', 'విస్ఫోటనం' సంపుటాలతో కవిగా సుపరిచితులైన యాదగిరిరావు వెలువరించిన మరో కవితా సంపుటి 'నిశ్శబ్ద యుద్ధం'. కవిత్వంలో అస్పష్టతకు తావుండదు. చెప్పాలనుకున్నది సూటిగా, సరళంగా, భావనాత్మకంగా చెప్పడంలో తనదైన శైలిని సంతరించుకున్నారు యాదగిరిరావు.
వారి కవితా వస్తువుల్లోనూ వైవిధ్యం ఇమిడివుంది. పుట్టిన ఊరు మాత్రమే కాదు, దేశం, దేశభక్తి, దేశం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి కాపలా కాసే సైనికుల వరకు వారి కవితావరణంలో కనిపిస్తారు. జ్ఞాపకాల కలబోత, వర్తమాన జీవితంలోని సంక్షోభం, అభివృద్ధిలోని బహుళ పార్శ్వాల ప్రకంపనలు యాదగిరిరావు కవితా వస్తువులు.
'తొలకరి'కి ఆనందంగా స్వాగతం చెప్పే 'నేటి రైతు' గురించి చెబుతూ వ్యవసాయ రంగపు దుస్థితిని, రైతు శ్రమని చిత్రిక పడతారు. ఆధునికత, అభివృద్ధిలోని భిన్నకోణాల్ని చూపుతారు. అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కుతున్నాయో, అభివృద్ధి పర్యవసానాలు ఎలా పరిణమిస్తున్నాయో చాలా కవితల్లో వ్యక్తమయ్యాయి. రెక్కల చెమటతో నగరాన్ని శోభాయమానం చేసే కార్మికులకు కాకుండా మాదకద్రవ్యాల మత్తులో జోగాడే వారికి నగరం కేంద్రం కావడంలోని వైచిత్రిని 'అభివృద్ధి'లో ఎత్తిచూపుతారు. నగరం ఉన్న వాళ్ళ కొమ్ముకాస్తున్న వైనాన్ని అక్షరీకరిస్తారు. టెక్నాలజీ కారణంగా 'ఆధునికత' కొత్త పుంతలు తొక్కాలి. అందుకు భిన్నంగా మనుషులకు మధ్య ఎడం పెరుగుతున్న దుస్థితిని కవిత్వం చేస్తారు.
కొన్ని కవితల్లో ఆర్ద్రమైన వ్యక్తీకరణలు బలంగా కనిపించాయి. 'రెండు రూపాలు, అమ్మ-నాన్న, బొందితో నరకం, అక్షరం, కాన్గి సదువు' వంటి కవితలు హృదయాన్ని ఆర్తితో కదిలింపజేసే రీతిన ఉన్నాయి. తెలంగాణలో ఒకనాటి చదువుల తీరుతెన్నుల్ని, వాటిలోని మేలిమిదనాన్ని 'కాన్గిసదువు' లో వ్యక్తం చేశారు. అలాగే అమ్మ, నాన్నల అనురాగ ప్రవాహంలోని వైవిధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో 'అమ్మ-నాన్న' కవిత తెలియజేస్తుంది. ప్రేమ చూపే తీరులో వైవిధ్యమే తప్ప వైరుధ్యం లేదు, వొకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భావానికి చోటు లేదు. అమ్మకన్నా నాన్న త్యాగం, ప్రేమ, అనురాగం చిన్నదేమి కాదని బోధపరిచే విలక్షణమైన కవిత ఇది. తల్లి-భార్య మగవాడి జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతారో, వారి స్థానం ఎంతటి విలువైనదో చెబుతుంది 'రెండు రూపాలు' కవిత. ఈ రీతిన స్త్రీల పట్ల గౌరవాన్ని, వారి వైశిష్ట్యాన్ని చెప్పే ఈ కవితలు యాదగిరిరావు ఇతివృత్త వైశాల్యాన్ని సుసంపన్నం చేశాయి.
తెలంగాణకు సంబంధించిన డిక్షన్, తెలంగాణ స్థితిగతులు, తెలంగాణ విశిష్టతల్ని వ్యక్తం చేసిన కవితలు కవికి తెలంగాణ నేలతల్లిపై ఉన్న మమకారాన్ని, తెలంగాణ ఉదాత్తతని ప్రతిబింబించాయి. భాష, సంస్కృతుల రీత్యా తెలంగాణ ప్రత్యేకతల్ని కవిత్వం చేయడంలో ఈ కవి సఫలమయ్యారు. చాలా కవితల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలు అంతర్లీనంగా ఉన్నాయి. కొన్ని కవితల్లో తెలంగాణతనం ప్రస్ఫుటంగా కనిపించింది. తెలంగాణని సత్కరించిన కవితలు - తెలంగాణ తెలుగు, నా తెలంగాణం. 'కవి పండిత గాయకుల పుట్టినిల్లు నా తెలంగాణం' అన్న మాట అక్షరసత్యం.
యాదగిరిరావుది సరళమైన వ్యక్తీకరణ. దీర్ఘమైన ఉపమానాల జోలికి వెళ్ళకుండా చెప్పాలనుకున్నది సూటిగా, హృదయాన్ని హత్తుకునేలా చెప్పడం విశేషం. ఈ సారళ్యం కారణంగా కవిత్వానికి పాఠకులు పెరుగుతారు. చదివిన వెంటనే బోధపడేతత్వం ఇమిడి వున్నప్పుడు కవిత్వం వైపు సామాన్య పాఠకులు ఆకర్షితులవుతారు. ఈవిధంగా పాఠకుల దరి చేరుతూ, వారిలో స్పందనాశీలతని ప్రోది చేసే విలక్షణ కవిత్వమిది.