Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశిష్టమైన లేఖా రచనను సామాజిక చైతన్యానికి, మహిళాభ్యుదయానికి ఒక చైతన్య కరదీపికలాగా వాడుకున్నారు కనపర్తి వరలక్ష్మమ్మ. 1928 నుంచి 1934 వరకు గృహలక్ష్మి పత్రికలో శారద లేఖలు పేరుతో ధారావాహిక నిర్వహించారు. ఈ లేఖలను అప్పటి స్త్రీలు చాలా భద్రంగా దాచుకుని చదువుకునే వారు. సరిగ్గా అదే ప్రయత్నం ఇప్పుడు శిలాలోలిత చేశారు. భూమిక పత్రికలో ఆమె రాసిన లేఖలు ఒక్కొక్కటి ఒక్కొక్క మణిపూస. ఈ లేఖలు ఒక్కొక్కటి చూస్తే ఒక తపన, ఒక ఆలోచన, ఒక ఓదార్పు ఇలా అన్నీ కలిస్తే ఒక 'వర్తమాన లేఖ'.
స్త్రీలను చైతన్యపరిచిన అనేక మంది రచయిత్రులను, సామాజిక వేత్తలను పరిచయం చేయడంతో పాటు వారి రచనలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపించాయో తెలియజేస్తూనే వర్తమాన విషయాలను, హృదయానికి బాధ కల్గించే విషయాలను కూడా ఈ లేఖలలో చర్చించారు.
ఒకప్పుడు వ్యక్తిగతమైన విషయాలకే పరిమితమైన లేఖలు కాలానుగుణంగా భాషా, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సాంఘిక పరమైన విషయాలను కూడా చర్చిస్తున్నారు. అందుకే ఈ లెటర్స్ పర్సనల్ లెటర్స్ కాదు పర్సనాలిటీని డెవలప్ చేసే లెటర్స్. మనసుతో మనసు పలికే ఒక ఆర్ద్రమైన సంభాషణే లేఖ. కవిత్వం రాసినట్లు లేఖ రాసేటప్పుడు కూడా విషయానికి అనుగుణంగా భాషాపరమైన చమత్కరాలను జోడిస్తూ చదవగానే పాఠకుల గుండెకు హత్తుకునేలా ఉండాలి. అలా రాయడం ఒక అద్భుతమైన కళ.
ఆ అద్భుతమైన కళకు తనదైన శైలి జోడించి శిలాలోలిత 2014 నుంచి ఇప్పటి వరకు భూమిక మాస పత్రికలో వర్తమాన లేఖ అనే శీర్షికతో రాసిన లేఖలే ఈ 'వర్తమాన లేఖ'. ఇందులో మొత్తం యాభై రెండు లేఖలున్నాయి అనేకంటే యాభైరెండు మంది విలువైన వ్యక్తుల పరిచయాలున్నాయి అని అంటే ఉత్తమంగా ఉంటుంది. ఈ లేఖలు చదువుతుంటే ఒక కూతురు అమ్మకు రాసిన ఉత్తరంలా, ఒక గురువు తన శిష్యులకు రాసిన ఉత్తరంలా, చిన్ననాటి స్నేహితురాలు తన ప్రియనేస్తానికి రాసిన లేఖలా చాలా స్వచ్ఛంగా వారితో పెనవేసుకున్న అనుబంధాన్ని, అనుభూతులను తెలియజేస్తూ సాగే ఈ లేఖల కోసం తిలక్ తపాలా బంట్రోతు కవితలో అన్నట్లు ''దేశాంతరా గతుడైన ప్రియుడి వార్త కోసం/ ఎదురుచూసిన అమ్మాయి!''లా ''అస్సాం రైఫిల్స్లో సోల్జర్ సిమ్మాచలం కోసం నిరీక్షణ/ క్షణం క్షణం ప్రతిక్షణం/ ఒక కార్డు ముక్క వ్రాశాడా'' అని
''గుడిసె ముందు కూర్చున్న పండుముసలి అవ్వ'' లాగా ఈ లేఖల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళలు ఎదురుచూశారు. ఇప్పటికీ అదే ఆతృతతో పాఠకులు వర్తమాన లేఖల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఈ లేఖలలోకి వెళ్లితే... పద్మజకు రాసిన లేఖలో సీనియర్ రచయిత్రి పి.సత్యవతి రాసిన కథల గురించి, పి.సత్యవతికి రాసిన లేఖలో ఆమె స్వయంగా అనువాదం చేసిన 'ఒక హిజ్రా ఆత్మకథ'ను గురించి, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన 'ఓనమాలు' సినిమా గురించిన ప్రస్థావన చేయడంతో వాటిని చదవాలనే ఆసక్తిని పాఠకులకు కలిగించారు. సుజాతా పట్వారీకి రాసిన లేఖలో సిరిసిల్ల రాజేశ్వరి రాసిన కవితలు తనని కదిలించిన తీరును రాశారు.
ఈ పుస్తకానికి పి.సత్యవతి, కొండవీటి సత్యవతి, జి.లక్ష్మీనరసయ్యలు రాసిన ముందుమాటలు ఈ పుస్తకం రుచిని చూపించి చదవాలనే ఇష్టాన్ని కలిగించాయి.
వర్తమాన లేఖ ద్వారా శిలాలోలిత రాసిన లేఖలు కూడా అపురూపమైనవిగా భావించి మహిళలు పదిలంగా దాచుకుని మళ్లి మళ్లీ చదువుకుంటారు. ఇప్పటి వరకు ఉత్తరం రాయని వారికి కూడా వెంటనే ఒక ఉత్తరం రాసేయాలనే ఆలోచన తీసుకువస్తాయి ఈ లేఖలు.
ఈ లేఖలలో అమూల్యమైన మాటలు, మళ్లీమళ్లీ చదవాలనిపించే మాటలు చాలా ఉన్నాయి. అందుకోసమే ఈ పుస్తకం చదవాలి. ఎన్నో అభివ్యక్తులు ఈ లేఖలలో అలవోకగా తారసపడి పలకరిస్తూ ముందుకు తొడుకుని పోతాయి.
- అనంతోజు మోహనకృష్ణ,
8897765417