Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నెల 23న ఖమ్మంలో 'వాక్యాంతం' ఆవిష్కరణ సభ జరుగుతుంది. ఈ సభలో దేవిప్రియ, సుద్దాల అశోక్తేజలకు మువ్వ పద్మావతి రంగయ్య ఫౌండేషన్ వారి సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తారు.
విశ్వనాథుడు 'వాక్యం రసాత్మకం కావ్యం' అన్నాడు. రసాత్మకమైన ఒక వాక్యం కావ్యంతో సమానమని అర్ధం. విశ్వనాథుడు ఆ మాట చెప్పిన ఇన్ని దశాబ్దాల తరువాత మువ్వా శ్రీనివాస రావు 'వాక్యాంతం కవిత్వం' అంటున్నాడు. అంటే వాక్యం అంతమైన చోట కవిత్వం మొదలు అవుతుంది. నిజానికి కొన్ని అక్షరాలు కలసి పదాలు గానూ, కొన్ని పదాలు కలసి ఒక వాక్యంగానూ రూపొందుతాయి. అక్షరాలు కానీ, వాక్యాలు కానీ వాటికీ అవే అర్థాన్ని ఇవ్వవు. అ అనే అక్షరానికి ఏ అర్థమూ లేదు. కానీ అది ల అనే అక్షరం తో కలిస్తే అల అనే అర్థవంతమైన పదం జన్మిస్తుంది. అలాగే పదాలు కూడా అర్థవంతమైన వాక్యాలుగా రూపొందుతాయి. వాక్యం అంతం కావడమంటే ఒక భావం అంతం కావడం. భావం అంతం అయిన చోట కవిత్వం మొదలు అవుతుంది అని ఈ విశ్వనాథుడు అంటున్నాడు. పదాలకో, వాక్యాలకో కవి ఒక భావాన్ని లేదా రూపాన్ని ఆరోపిస్తాడు. కవి ఆరోపించిన భావం తొలగిపోయిన చోట కవిత్వం మొదలవుతుందన్నమాట.
''మనం దేనికైనా ఒక రూపాన్ని ఎందుకు ఇస్తాం? దాన్ని గుర్తించడానికి. కానీ ఒక రూపం ఇవ్వడమంటే అసలు సిసలు స్వరూపాన్ని ఒక మూసలో ఇమడ్చడమన్నమాట. అప్పుడు అసలు స్వరూపం లుప్తమైపోయి కేవలం మూస మాత్రమే మిగులుతుంది. మూసలతో మనం ఏమి సాధించగలం? నమూనాలను బద్దలు కొట్టడమంటే దానికి ఇచ్చిన రూపాన్ని అరూపం చేయడం. అరూపం చేసాక మన భావనో, అనుభవమో, అనుభూతో ఒక జ్ఞాపకంగా మిగులుతుంది. నిజానికి జ్ఞాపకం కూడా ఒక నమూనానే'' ఈ మాటలు నావి కావు. మనకాలపు మహా తత్వవేత్త కృష్ణాజీవి.
ఈ వాక్యాలను మువ్వా శ్రీనివాస రావు గారు కలలోనో, మెలకువలోనో, మెలకువగా కలగంటూనో, కలగంటూ మెలకువను అనుభవిస్తూనో రక్త మజ్జాస్తిగతం చేసుకుని వుంటారు. ఆ తత్వచింతనా సారం ఇప్పుడీ 'వాక్యాంతం'గా ముందుకు వచ్చింది. ఇది మువ్వా శ్రీనివాస రావు గారి మూడవ కవిత్వ సంపుటి. మొదటిది సమాంతర చ్ఛాయ. రెండవది 6్ష్ట్ర ఎలిమెంట్. మొదటి కవిత్వ సంపుటి నిండా మువ్వా తన గురించీ, తన భావనల గురించీ, తన ఆనంద దు:ఖ ఉద్వేగాల గురించీ కవిత్వం రాసారు. రెండవ సంపుటికి వచ్చేసరికి తను వెనుకబడి పోయి తాను నివసిస్తున్న సంఘం ముందుకు వచ్చింది. సంఘంతో తన సరస సల్లాపాలు, క్షత గాత్ర యుద్ధారావాలు కవిత్వ రూపం అందుకున్నాయి. మొదటిది మోనోలాగ్. రెండవది డైలాగ్. ఇప్పుడీ మూడవది ఇంటీరియర్ మోనోలాగ్. అంటే ఆత్మ సంభాషణ.
నిత్యం చలనశీలంగా ఉండే కవికి నిలువ నీటి జల క్రీడలు రుచించవు. ప్రవాహ గమనమే అతడి గమనమూ గమ్యమూ అవుతుంది. మువ్వా చలనశీలి కనుక తను రెండు సంపుటాలుగా రాసిన కవిత్వ వస్తువు పట్ల ఒక విముఖత, రూపం పట్ల ఒక వైమనస్యం ఏర్పడి ఉంటుంది. వాక్యాంతంలో వస్తువూ మారింది. రూపమూ మారింది. ఈ కవిత చదువుతూ ఏ పాఠకుడైనా మొదటగా చేసే కంప్లైంట్ ఏదైనా ఉంటే అది వస్తులేమి. వస్తువు లేదని కానీ వస్తువు అమూర్తంగా ఉందని కానీ ఫిర్యాదు చేస్తాడు. మన తెలుగు సినిమాకు ఉన్నట్టుగానే మన తెలుగు కవితకి కూడా ఒక ప్రారంభం, ఒక మిడిల్ ఎండ్, ఒక క్లైమాక్స్ వుండి తీరాలి అనుకుంటాం... మన అంతర్గత దు:ఖాలు అన్నిటికీ ఒక సాంత్వన కవిత్వంలో దొరకాలి అనుకుంటాం. కానీ అవేవీ ఈ కవిత్వంలో దొరకవు. కనుక వస్తులేమి అనే కంప్లైంట్ వస్తుంది. కానీ అది నిజం కాదు. పాఠకుడు కవిత్వంలో తనను తాను వెతుక్కుంటాడు. కవి గతంలోకి వెళితే ఆ నోస్టాల్జియా తనూ అనుభవిస్తాడు. కవి వర్తమానాన్ని అక్షరబద్ధం చేస్తే అందులో తన వర్తమానం ఎక్కడ అని అన్వేషిస్తాడు. చిత్రంగా ఈ సంపుటిలో మువ్వా వర్తమానాన్ని డిలీట్ చేసాడు. లేదా ఉద్దేశ్యపూర్వకంగా విస్మృతి లోకి నెట్టివేశాడు. గతం అంచున నిలబడి భవిష్యత్తులోకి ఒక దృక్పథాన్ని, ఒక సంవేదననీ కానుకగా ఇస్తున్నాడు. ఈ కవిత్వం చదివే పాఠకుడు కవి గతంతో సంలీనం అవుతాడు కానీ అతడి చూపు కవితో పాటు భవిష్యత్తులోకి కవి చూపు ప్రవేశించినంత సాంద్రతతో ప్రవేశించదు. అక్కడ పాఠకుడు కవితో పేచీ పడతాడు.
వర్తమానాన్ని కవి ఎందుకు డిలీట్ చేసినట్టు? దీనికి జవాబు స్పష్టంగానే వుంది. సమాంతర చ్ఛాయలోనో, 6th ఎలిమెంట్ లోనో సరిగ్గా గుర్తు లేదు కానీ పెట్టుబడిదారుల స్వర్గం అమెరికాలోని లాస్ వేగాస్ నడిబొడ్డున నిలబడి వాల్ స్ట్రీట్ జర్నల్ గోడ మీద ''ప్రపంచ కార్మికులారా! ఏకం కండి'' అని ఎర్రెర్రని వాక్యం రాసే తెంపరితనం ప్రదర్శించిన మువ్వా ఈ మూడవ సంపుటికి వచ్చేసరికి ''ప్రపంచ పేదలంతా ఏకం కావలసిందే'' అంటున్నాడు. రెండు వాక్యాల మధ్య చాలా వైరుధ్యం వున్నది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని మార్క్స్ ఇచ్చిన పిలుపుకి కచ్చితంగా వ్యతిరేకంగా ప్రపంచ పెట్టుబడి దారులంతా ఏకం అయిన సందర్భాన్ని మనం స్వయంగా వీక్షిస్తున్నాం. ఇది సైద్ధాంతిక ఓటమి. కానీ దీనిని గుర్తించడం మువ్వాకి ఇష్టం లేదు. అలాగని విస్మరించడమూ సాధ్యం కాదు. మరి ఏమిటి చేయడం? కవి కనుక ఈ విషాదాన్ని తన మన: ఫలకం మీద నుండి డిలీట్ చేసేశాడు. యాంగ్రీ సిక్స్టీన్ పునాదిగా భవిష్యత్ వైపు ఆశగా చూడటం మొదలుపెట్టాడు. కార్మికులు ఏకం కావడం అనే ఒక పరిమిత లక్ష్యం విఫలమైన చోటే పేదలంతా ఏకం కావడం అనే విశాలమైన సంకల్పాన్ని చెప్పుకుంటున్నాడు. నేను ఒక్క రాజకీయ వైఫల్యం గురించి చెప్పాను కానీ వైఫల్యం జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతి రంగంలో వుంది.. ప్రతి పరాన్ముఖ కోణంలోనూ వుంది. మరొకరు, మరొకరు అయితే ప్రస్తుత పరిస్థితులలో వెళితే సినిసిజంలోకి వెళ్లేవారు. లేకపోతే నోస్టాల్జియాలోకి మళ్ళేవారు. లేకపోతే ఆగామి కవిత్వం అంటూ ప్రాకృతిక, ప్రేమ కవిత్వం రాసేవారు. కానీ వైఫల్యం అంచున నిల్చుని ఒక కొత్త గీతం ఆలపిస్తున్నాడు. ఇది ఈ కవిత్వంలో ఉన్న సుగుణం. ఈ సుగుణాన్ని సరిగ్గా వ్యక్తం చేసే కవిత్వ వాక్యాలు ''వెలుతురులోకి తొంగి చూసే చీకటి. చీకటిని తేరిపార చూసే వెలుతురు'' అంటూ ఎంగిలి చందమామ అనే కవితలో వ్యాఖ్యానించాడు.
అలాగే మనిషిని మనిషిగా మార్చెయ్యడానికి/ ఎవరైనా/ నాలుగు కవితా వాక్యాలు ఇస్తారా (ఏమివ్వాలి) అంటాడు ఒక కవితలో.
ఈ నాలుగు కవితా వాక్యాల ద్వారా ఒక మనిషిని కట్టెయ్యాలి అనుకుంటున్నాడు మువ్వా. ఈ నాలుగు కవితా వాక్యాలనే ఎవరి భావనకు అనుగుణంగా వారు బీజాక్షరాలు అనో మ్యానిఫెస్టో అనో అనుకోవచ్చు. మువ్వా కట్టేయాలి అనుకున్న మనిషి ఎలా ఉండాలి? కూడికలూ+ తీసివేతలు అనే కవితలో చెపుతున్నాడు. మనిషికి ఏమేమి కలిపి ఏమేమి తీసివేయాలో చాలా స్పష్టంగా చెపుతున్నాడు. ఒక ఏకాంత ద్వీపంలా మారిపోయిన మనిషిని మళ్ళీ సమాజ గతం చేయాలి అంటున్నాడు. జాయింట్ ఫ్యామిలీ పోయి, సింగిల్ ఫ్యామిలీ పోయి, ఆటమిక్ ఫ్యామిలీ వచ్చిన ఆధునిక దశలో మళ్ళీ కుటుంబ సభ్యుల మధ్య కొత్త కూడికలు కావాలి అంటున్నాడు. ప్లాఫీలో వెన్నెల కాకుండా పంట చేలో పండువెన్నెల కురుస్తున్నప్పుడు/ మంచెను పట్టెమంచంగా వాల్చెయ్యాలి అంటున్నాడు.
అంతేనా ఈ లివింగ్ రూమ్ని/ ఇరుగుపొరుగు వచ్చిపొయ్యేలా/ ఇంటిముందు అరుగుగా మార్చాలి అంటున్నాడు. పొంత కుండలో నీళ్ళని/ చెంతనే ఉన్న నూతి పళ్ళెంలో నిలబడి/ ముద్దాడాలి అంటున్నాడు. మరొక మాటలో చెప్పాలి అంటే మనిషి ప్రకృతితో సహజీవనం చేయాలి అంటున్నాడు. ఇదంతా గతంలో ఉన్నదే కదా. శుద్ధ నోస్టాల్జియా అని కొట్టెయ్యవద్దు. ఆ నోస్టాల్జియా మువ్వకి బేస్ పాయింట్. ఆ పాయింట్ మీద నిలబడి ఒక కొత్త మానవుడిని అతడు స్వప్నిస్తున్నాడు.
అతడి మనిషి ఒక ఊదా పువ్వు.. ఆ పువ్వు పరిమళమే అతడి పిలుపు. దాన్ని గెలుచుకోవడం కోసమే అతడి తపన. అతడి అన్వేషణ. ఈ అన్వేషణలో కవిత్వమొక ఆలంబన. దరిదాపు రెండువందల కవితలను ఏక బిగిన చదవడం ఒక అందమైన అనుభవం.
- వంశీకృష్ణ,
95734 27422