Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాల సాహిత్యం వైవిధ్యంతో కొనసాగుతూ ఉంటుంది. ప్రేమ, విశ్వాసం, న్యాయం, నిజాయితీ, కపటం లేకుండటం, ధైర్యం, ఆనందం, నిస్వార్థం, మంచి క్రీడాకారుల కుండే ఉత్సాహం, ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం, బాధ్యత మొదలైన కాలాతీత విలువలుగల సద్గుణాలను బోధించడానికి తోడ్పడుతుంది.'
- జాన్ రాండోల్ఫ్ (అమెరికన్ రచయిత)
ఇప్పుడిప్పుడే మంచి సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న మన బడి పిల్లలు సాహిత్యాన్ని సృజిస్తే!... ఆ సాహిత్యం నీలాకాశమంత అద్భుతంగా, చందమామంత చల్లగా, తోలకరి వానంత కమ్మగా ఉంటుంది. బాల సాహితీ వికాసం, విస్తారం, ప్రచారాల విషయంలో ఇటీవల జరుగుతున్న ప్రయత్నాలు చూస్తే ఆ దిశగా తెలంగాణా ముందువరుసలో ఉంది. ఇటీవల జరిగిన గొప్పపరిణామం బాల బాలికలు తమకు కావాల్సింది తామే రాసుకుంటున్నారు. ఇవ్వాళ్ళ ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వికాసమైనప్పటికీ బాల వికాస కార్యకర్త గరిపల్లి అశోక్ దశాబ్ది కాలంగా వస్తున్న పిలలు రాసిన పుస్తకాలను నమోదు చేసిన దాని ప్రకారం నిన్నటి వరకు 130 వరకు పుస్తకాలు అచ్చయ్యాయి. ఇవన్నీ బాలల రాసినవి. ఎక్కువ శాతం వివిధ కార్యశాలల్లో రూపొందినవే. ఇవే కాక ఇంకా పుస్తకాలు వస్తూనే ఉన్నాయి.
పాఠశాలలు, సాహిత్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో పాటు పలు ప్రచురణ సంస్థలు బాలల పుస్తకాలను ప్రచురిస్తూ వచ్చాయి. ఇటీవల పిల్లల పుస్తక ప్రపంచం 'మంచిపుస్తకం' తెలంగాణా బడిపిల్లల కథలను 'తీయని పలకరింపు' తెలంగాణా బడి పిల్లల కథలు పేరుతో వెలువరించింది. తెలంగాణా బాల సాహిత్య పరిషత్, పిల్లల లోకం, మానేరు రచయితల సంఘం వంటి సంస్థల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా పాత పదిజిల్లాల నుండి వచ్చిన వందలాది కథలను వడపోసి 59 కథలతో ఈ సంకలనాన్ని వెలువరించింది. 6 నుండి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి రచయితల సంకలనమిది. బాల సాహితీవేత్తలు డా.భూపాల్, డా.వి.ఆర్. శర్మలు ఎంపిక చేసిన ఈ కథలకు ప్రసిద్ధ చిత్రకారుడు కె.బొమ్మలు వేయడం మరింత అందాన్నిచ్చింది. ఈ కథలన్నీ తెలంగాణా బడిపిల్లలను రచయితలగా కొత్తగా పరిచయం చేశాయి.
మనం 'పిల్లలకు ఏం తెలుసులే అనుకుంటాం' ఒక్కసారి అవకాశం, ప్రోత్సాహం కలిగిస్తే అంతర్నిగూడంగా ఆ బాల మేథావుల మనస్సులో దాగిఉన్న ఎన్నో అంశాలు సృజన రూపంగా, ఆటలు, పాటల రూపంగా ఆవిష్కృతమవుతాయి. అలా జరిగిన మహా ఆవిష్కారమే ఈ కథలు. అయితే ఇందులో విద్యార్థులు సొంతంగా రాసిన కథలున్నాయి. కొన్నింటిని విద్యార్థులు విని వాటిని అనుసరించి రాసినవి ఉన్నాయి. మరికొన్ని చెప్పగా విని అనుకరణ చేసినవీ ఉన్నాయి. అన్నింటికి మించి పిల్లలు తాము ఎదుర్కుంటున్న వివక్షను గురించి, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను గురించి రాసారు. వీటితో పాటు వాళ్ళ అవగాహనలోని అనేకానేక సమస్యలను కథలుగా మలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్థులు చేస్తున్న ఈ సాహిత్య సృజన తెలుగు బాల సాహిత్యంలో పరిశీలించాల్సిన ఒక కొత్తపాయ. బాల సాహిత్యం పేరుతో పిల్లల స్థాయి మించిన రచనలు, సృజనాత్మక రచనలు, వివిధ వస్తువుల, పదార్థాలను వర్ణిస్తూ రచనలు, విజ్ఞాన రచనల పేర వస్తు రచనలు వస్తున్న సందర్భంలో పిల్లలు తమ కోసం తాము రాసుకోవడం అభినందించాల్సిన విషయం. నిజానికి క్షమతా పూర్ణతలేకుండా, బాలల స్వభావానికి దగ్గరగా లేకుండా చేసే రచన అది ఏదైనా బాల సాహిత్యం ఏమేరకు అవుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సైన్స్ సాహిత్యం అవగలుగుతుందా? ఆలోచించాలి. ఇక ఈ కథల విషయానికి వస్తే ఇందులోని తొలి కథే పిల్లల రచనా శక్తిని పటిమని పట్టిస్తుంది. కథ పేరు 'ఓ అమ్మాయి గర్వం.' నిజామాబాద్జిల్లా తడపాకల్ విద్యార్థిని ఎ.నిఖిత ఈ కథను రాసింది. కథలోని అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అద్దంలో తనను తాను చూసుకుంటూ అందంగా ఉన్నానని మురిసిపోయేది. కానీ కొద్దిగా నల్లగా ఉన్న తన మోకాళ్ళంటే ఆమెకు ఎంతకూ నచ్చేవి కాదు. ఒకసారి నీళ్ళు తాగేందుకు బావి దగ్గరకి వెళ్ళింది. అక్కడున్న మతిస్థిమితం లేని అబ్బాయి ఈ అమ్మాయి వెంటపడతాడు. అతని నుండి తప్పించుకునేందుకు మోకాలిచిప్పలకు పనిచెప్పి వేగంగా ఊర్లోకి పరుగు పెడుతుంది. అప్పుడు ఆ అమ్మాయికి జ్ఞానోదయం అవుతుంది. అమ్మో నా మోకాళ్ళు నాజూగ్గా, అందంగా ఉంటే నేను ఎలా వేగంగా పరిగెత్తే దానిని. నా మొహం, చెవులు కాదు, మోకాళ్ళు కూడా బంగారమే అనుకుని మురిసిపోయింది. ఇదీ కథ. శరీరంలోని అన్ని అవయవాల ప్రాధాన్యతను చెప్పినకథ ఇది. అన్నీ ఇలాంటి బంగారు కథలే. అదే తడపాకల్కు చెందిన ఎం.డి.సమ్రీన్ రాసిన కథ 'మూగజీవుల ప్రేమ'. రామయ్య వద్ద ఒక ఆవు, ఒక కుక్క కలిసి మెలిసి ఉంటాయి. అనుకోని స్థితిలో ఆవును అమ్మివేయాల్సి వస్తుంది. తరువాత కుక్క పడిన తపన, చివరికి ఆవు కుక్క ఒకటిగా కలిసిపోవడం ఈ కథలో చూడొచ్చు. ఇది మన పిల్లల ఆలోచనా సరళి. జంతువుల పట్ల వారికి గల అపారమైన ప్రేమ వారితో ఇటువంటి కథలను రాయిస్తోంది.
అది ఈ బాల రచయితల్లో ఎక్కువ మంది విద్యార్థినులు కావడమే...! బి.అభినయ, ఎ.స్రవంతి, సి.హెచ్. రజిత, డి. క్రిష్ణవేణి, ఎస్.సరళాదేవి, వై. సంధ్య, కె.వినిత, బి.శ్రీహిత, వి.మహాలక్ష్మి, కీర్తన, కె.మంగ, పి.శ్రావణి, ఎన్.అశ్విని, జి.అక్షిత, నికిత, ఎం.లోకిత, సిహెచ్. అపర్ణ, ఎ.వసంత, ఓ.పల్లవి, వి.గౌతమి, సిహెచ్. దీక్షిత, యం.జాహ్నవి, ఇ.సాయి ప్రియ, ఎన్. దేవిక, సిహెచ్. మనీష్, ఓ.రవళి, పి.పూజిత, పి.వైశాలి, ఎం.స్రవంతి, ఎస్.సింధూశ, బి. గౌతమిలు ఈ తీయనిపలకరింపులోని బాలికలు. బి.మణి వెంకట్, వి.శ్రీనివాస్ రెడ్డి, జి.అనీల్, కె.అరవింద్ రెడ్డి, వై. ఇంద్రసేనారెడ్డి, పి.శివకృష్ణ, ఇ.ఆదిత్య, జి.రమేష్, పి.నరేష్, డి.వినరు, పి.పవన్ కుమార్, జి. రాజు, బి.విష్ణువర్ధన్, బి.సాయి కిశోర్, డి. జగదీష్, కె.ఉదరు కిరణ్, కె. అభిశేఖర్ రెడ్డి, బాలాజి, డి.దిలీప్లు బాలురు. వస్తువు, అంశాల విషయంలోనూ ఈ తేడా స్పష్టంగా తెలుస్తోంది.
ఆడపిల్లలు రాసిన దాదాపు అన్ని కథల్లో దాదాపుగా స్త్రీ విద్యను, సమస్యలను చర్చిండం యాదృచ్చికమే కావచ్చు, కానీ రేపటి తరం ఆలోచనా విధానానికి ఇవి ప్రాతినిథ్య కథలుగా నిలుస్తాయి. ఇతర కథలన్నీ నీతి, నిజాయితీ, సమాజం, మానవత, జంతు ప్రేమ, మానవీయ విలువల వంటి వాటికి ప్రాధాన్నాన్నిచ్చాయి. పుస్తకాల సంచి పట్టుకుని బడికి వెళ్ళి సరదాగా గడిపే విద్యార్థులకు ఒక్కసారి రాసే అవకాశం వస్తేనే ఆచిట్టి చేతులు ఇన్ని అద్భుతమైన జీవితాలను అక్షరాలుగా సృష్టించాయి. ఈ పని, పరంపర ఇలాగే ఒక సజీవ స్రవంతి మాదిరిగా సాగితే ఆ ప్రవాహపరంపరను గురించి బహుశా మనం ఊహించలేం.
విధిగా విద్యార్థులకు అన్ని పాఠశాలల్లో రచనా కార్యశాలలు ఏర్పాటు చేయాలి. బాలల అకాడమిని పునరుద్దరించి తద్దారా కేరళ విధానంలాగా రాష్ట్రంలోని మారుమూల పాఠశాలతో దానిని అనుసంధానం చేయాలి. అప్పుడే మనం కలలు కన్న సమాజం మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. గతంలో పిల్లల రచనలతో వచ్చిన తెలంగాణ బాల సాహిత్య పరిషత్ ప్రచురణ 'బంగారు నెలవంకలు', రంగినేని సుజాత మోహన్ రావు చారిటబుల్ ట్రస్ట్, సిరిసిల్ల ప్రచురించిన 'కతల వాగు', 'కవితల సింగిడి'లు తెలంగాణలోని బడిపిల్లల్లో స్ఫూర్తిని నింపగా, ఈ 'తీయనిపలకరింపు' తెలంగాణా పిల్లల కథలకు ఒక రకంగా ప్రాతినిథ్య కథల సంకలనంగా నిలవగలిగింది. పాత జిల్లాలోని రెండు జిల్లాలనుండి కథలు రానప్పటికీ ఉన్న కథలు తెలంగాణా జీవితాల్ని, ప్రాతినిథ్యాన్నిచ్చాయి. కథకులుగా మారిన పిల్లలకు, సంపాదకులకు, ప్రచురణ కర్తలకు అభినందనలు.
- డా|| పత్తిపాక మోహన్,
9966229548