Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడున్నర దశాబ్దాల పైబడిన జీవితం... అందులో అయిదు దశాబ్దాలకు పైగా కవిత్వ ప్రయాణం... నిరంతరం ప్రజలపక్షం, పోరాడే శక్తుల పక్షం నిలిచి కవిత్వాన్ని సృజించడం ఓ అసిధారావ్రతం. దీనిని ఆచరిస్తున్న కవి కె.శివారెడ్డి. ఆయన్ని కొన్నాళ్ళ కిందట కబీర్ సమ్మాన్ పురస్కారం వరించింది. ఇపుడు సరస్వతీ సమ్మాన్ పురస్కారం అందుకోబోతున్నారు. పురస్కారాలతో తూచే కవిత్వం కాదు వారిది. పురస్కారాలకు గౌరవాన్ని తెచ్చే కవిత్వ సంపద శివారెడ్డిది. ఈ అయిదు దశాబ్దాల కాలాన ప్రజల పోరాటాలకు సంఘీభావంగా నిలిచారే తప్ప వాటికి దూరంగా జరగలేదు. ప్రజలకోసం పోరాడేవారి సరసన నిలబడ్డారు. ఉద్యమపథంలో పయనించే శక్తులతో గొంతు కలిపారు. మరీ ముఖ్యంగా తెలుగులో కవులు నిరంతరం ప్రజాపక్షం వహించాల్సిన అవసరాన్ని తన కవిత్వం ద్వారా, ముందుమాటల ద్వారా, ప్రసంగాల ద్వారా అప్రమత్తం చేయడం శివారెడ్డి నిబద్ధతకు నిదర్శనం. ఇరవైకి పైగా కవితా సంపుటాలు వెలువరించిన శివారెడ్డి కవిగా, వ్యక్తిగా కవులకి గొప్ప స్ఫూర్తి. బతుకులో ఎన్ని ఒత్తిళ్ళు, సవాళ్ళు ఎదురయినా సరే కవిగా నిలబడటం, సృజనాత్మకంగా జీవించడం శివారెడ్డిలోని గొప్ప సుగుణం. ఇది ఈతరం కవులకీ, రచయితలకీ ఆదర్శప్రాయం.
జీవితమే ప్రతీ సాహిత్య రూపానికీ, ప్రక్రియకూ ప్రధానం. భావజాలం ఈ జీవితాన్ని చూసే చూపును ప్రభావితం చేస్తుంది. అందుకని జీవితాన్ని అందుకోవాలంటే, దాని సంఘర్షణ మీద దృష్టినేర్పరచుకోవాలంటే సమూహంలోనే ఉండాలంటారు శివారెడ్డి. ఒక కొత్త ఊహ పుట్టాలంటే, ఒక ఆలోచన చేయాలంటే ఈ సమూహ జీవితమే ప్రధానం అంటారు. సుమారు యాభై రెండు సంవత్సరాల నిరంతర యాత్ర శివారెడ్డి కవిత్వానిది. ఎదురుగా ఒకటుంటే చాలు ఒక ఊహకు పాదు దొరుకుతుందంటారు. తెలుగులో వచన కవిత బాగా వికసించాక జీవితలోని అనేక పొరలను తడిమే కవిత వస్తుంది. ఎక్కువ వస్తువులు కవిత్వంలో కనిపిస్తాయి. శివారెడ్డి కవితా అందుకు మినహాయింపు కాకపోయినా ఒక భావజాలముద్ర యేదో అన్ని వాక్యాల చుట్తూ మెరుస్తుంటుంది. ఎటువైపు కవి నిలబడాలో, బుద్ధి జీవి పోరాడాలో చెబుతుంది. జీవితాన్ని అధ్యయనం చేయడానికైనా, సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికైనా ఒకరితో ఉండాలి కనీసం అంటుంది శివారెడ్డి కవిత. అలా లేని ఖాళీ మనిషి మరణిస్తున్నాడంటారు.
1. మాట్లాడ్దానికి/ ఎదురుగా ఒకరుండాలి/ మాట్లాడక పోయినా ఎదురుగా ఒకడుంటే చాలు-/ మనిషి కాదు/ బొమ్ముండా చాలు/ ఒక బ్రహ్మజెముడు పొదుండా చాలు/ ముళ్లతో మెరుస్తున్న పండిన దాని కాయ కళ్ళు చాలు/
2. తెల్లని శూన్యంతో ఏం మాట్లాడగలం/ తెగిపడుతున్న వేల వేల తెరలతో ఏం మాట్లాడగలం/
3. చిన్నప్పుడు బర్రెల మధ్య పడుకున్నప్పుడు/ ఎంత బావుండేది/ అవి మాట్లాడేవి, ప్రేమించేవి కసురుకునేవి/ దయ చిప్పిలుతున్న కళ్లతో చూసేవి
4. ఎదురుగా ఎవరూ లేని/ ఒక ఖాళీ జాగాలో/ మనిషి మరణిస్తున్నాడు/ మనిషి మరణిస్తున్నాడు- (మాట్లాడ్డానికి.పే.13.పక్కకి ఒత్తిగిలితే)
ఈ వాక్యాలు చెబుతున్నది ఏదో ఒక సమూహంలో ఉండాలని. ఒంటరిగా కాకుండా, శూన్యంలా కాకుండా ఉండాలని. కాని ఇందులోని వాతావరణంలో అనేకమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇందులో విషయం ఉంది. దానితో పరుగుపెడుతున్న మానసిక అనుచలనాలున్నాయి. ఒక బొమ్మున్నా కొన్ని ఊహలు చేయవచ్చు. ఒక బ్రహ్మజెముడు పొద ఉన్నా, ముళ్లతో మెరుస్తున్న దాని కాయ కళ్ళున్నా ఆలోచనలు పురుడు పోసుకుంటాయి. ప్రేరేపణకు మూలమైంది ఎదురుగా కనిపించే జీవితం ఎమర్సన్-విశ్వంలోని ఒక మంచు ముక్క, బిందువు కూడా సూక్ష్మంగా ప్రపంచాన్ని చూపుతుందని నమ్మాడు. ఆయన సర్వోత్కృష్ట సిద్ధాంతం (ట్రాన్స్డెంటలిజమ్)లో ఆయన నమ్మింది ఇదే (నేచర్-1836). శివారెడ్డిలోనూ ఇదే భావన కనిపిస్తుంది. ఏ అంశమైనా జీవితంలోని ఏదో ఒక విషయాన్ని వ్యక్తం చేస్తుంది. ఒక బ్రహ్మజెముడు పొద, దాని ముళ్ళు, కరుణ చిప్పిల్లేలా చూసే బర్రె ముఖం ఇవన్నీ లోకాన్ని అర్థం చేయిస్తాయి. ఎవరూ లేని లేదా ఎవరినీ గమనించని శూన్యం నుంచి మనిషి తనకున్న ఆలోచనాశక్తిని కోల్పోయి మరణిస్తున్నాడు. శివారెడ్డి కవిత చెప్పేది ఇదే. జీవితాన్ని ఆనుకుని ఉండడం ఈ కవితకు ప్రాథమికమైందే కాని, శివారెడ్డి కవితకు మూలాలు కేవలం అక్కడ మాత్రమే లేవు.
జీవితానికి రెండువైపులా భావజాలం అనే స్తంభాలను రెంటిని పాతి వాటి మధ్యలోంచి జీవితాన్ని సునిశితంగా గమనిస్తారు. అందులోనుంచే ఎటు నిలబడాలో నిర్ణయిస్తారు. పంతొమ్మిది వందల అరవై ఏడు నాటికి ముద్రణలో అడుగుపెట్టిన శివారెడ్డి కవిత్వ కాలం ముమ్మరంగా సాయుధ పోరాటాలకు పాదులేర్పడుతున్న కాలం. ఆయా ఉద్యమాల మూలాలు సంపూర్ణంగా ఆయనలో జీర్ణమయ్యి కనిపిస్తాయి. అందుకోసం ఉదాహరణలు అన్ని సంపుటాలలో కనిపిస్తాయి.
1. 'వర'గా మిగలటమా, లేదూ/ కత్తిగా బయటికి రావటమా-/ అతనడుగుతున్నాడు, కలుద్దామా అని/ అతన్ని రమ్మనటమా, నే వెళటమా-/ ఇద్దరూ కలిసే ప్రదేశానికి/ ఆత్మార్పణమని పేరు పెడదామా- (ఈ దోవెమ్మటి. పే.26)
2. ''హత్య జరిగింది/ కాదు, ఆత్మ హత్య జరిగింది/ చరిత్ర వెనక్కి నడుస్తున్నది/ చీకటి లోకాల చెరువొడ్డున/ పందులు కాసుకునేవాడు/ తన్ను తాను కాల్చుకుంటున్నాడు/ తన్ను తాను కీటక సామ్రాజ్యాధినేత/ కాళ్ల ముందు నిర్ద్వంద్వంగా సమర్పించు కుంటున్నాడు/ ఆత్మహత్య చేసుకున్న ఆలోచనా పరులందరికీ/ ధన్యవాదాలు'' -(కీటక సామ్రాజ్యంలో.28)
3. ''నీరుకాయ పంచ/ ఉప్పురికిన అరచేతుల చొక్కా/ ఈ చరిత్రకి నిదర్శనమా!/ గుల్లబారి కంకి రాలిపోయినట్టు/ రాలిపోయిన జీవితాన్ని కూడగట్టలేక-/ ఈడుండి లేనట్టుండడం అలవాటు చేసుకున్నాడా/ ఇన్ని యుగాల్నుంచీ గాయపడని వ్యక్తి/ ఇవాళ తలకిందులైనట్టు, తలకట్టు లేనట్టు/ అతడు దిగులు భారంతో కుంగిపోయినప్పుడు/ భూమి ఒక పక్కకి ఒరిగిపోతుంది/ సముద్రాలన్నీ కళపెళ ఉడుకుతాయి'' (అతడు-178).
4. బూడిద కుప్పలుగా సముద్రాలు మిగులుతున్నప్పుడు/ ఆకాశం పెళ్లపెళ్లలుగా రాలుతున్నప్పుడు/ నదులు తమ్ము తామే మింగుతున్నప్పుడు/ వాణ్ణి కవిత్వీకరించడం ఒక సవాలు/ ఒక కొత్త ప్రపంచపు దార్శనికుడు వాడు/ వేలుబెట్టి చూయించడానికి వీల్లేని స్వచ్ఛమానవుడు/ సమస్త విశ్వం వాడిలోంచే లేస్తుంది/ వేలవేల పక్షులన్నీ కొత్త రెక్కలు సంతరించుకుంటున్నాయి/ త్యాగ మూర్తులందరి ప్రతీక వాడు/ రేప్పొద్దున మేఘాన్ని పక్కకి తొలగించి/ లేత సూర్యుణ్ణి బయటికి లాగుతాడు/ వాణ్ణి కీర్తించడం కన్నా, వర్ణించడం కన్న మరో ఉత్కృష్టమైన పనేముంది- (ఇప్పుడు వాణ్ణి-101)
పసిపిల్లలను మొరటుగా అదుపులోపెట్టే తల్లుల్ని చూసి, మేకలను, పశువులను అమ్మే గోల్నాకాను చూసి, రైతుని చూసి రాసిన అనేక కవితలున్నా.. వీటన్నిటి మధ్యలో తనదైన ముద్రగల కవిత్వం అడుగడుగునా కనిపిస్తుంది. పైవాటిలో ఒకటి, మూడు, నాలుగు భావాంశాలు విప్లవ పోరాటాల తాలుకు వాతావరణాన్ని ప్రతిఫలిస్తాయి. పోరాడటం, లేదా పోరాటానికి ఊతమిచ్చేలా బతకడం రెంటిని గురించి మాట్లాడిన వాక్యాలు మొదటి దానిలోవి. రెండు కలిసే ప్రదేశానికి ఆత్మార్పణమని పేరు పెడదామనటంలో. ఉద్యమంలోని రెండుపార్శ్వాలు కనిపిస్తాయి. రెండో భావాంశం ఇలాంటిదే. మొదటి భావాంశంలోని 'వర'ను గురించే ఈ వాక్యాంశం మాట్లాడింది. హత్య, ఆత్మహత్య అనే రెండు అంశాల గురించి మాట్లాడుతూ సందర్భాన్ని వ్యాఖ్యానించడం కనిపిస్తుంది. 'చరిత్ర వెనక్కి నడవడం' అనుకున్న పద్ధతిలో ఉద్యమం సాగని సమయాన్ని వ్యాఖ్యానిస్తుంది. పందులు కాసేవాడు కీటక సామ్రాజ్యాధినేతకు తన్ను తాను సమర్పించుకోవడం కూడా ఇలాంటిదే. అందువల్లే చివరలో 'ఆత్మహత్య చేసుకున్న ఆలోచనా పరులందరికీ ధన్యవాదాలు' అంటారు. ఆలోచన వల్లే ఉద్యమాలు నిలబడతాయని ఈ వాక్యాలు చెబుతాయి. నాలుగో భాగం కూడా ఇలాంటిదే. ఇదంతా ప్రతీకాత్మకంగా కనిపిస్తుంది. సముద్రం, ఆకాశం-ఉద్యమాన్ని, నదులు-ఉద్యమంలోని రెండవ వాతావరణాన్ని, పక్షులు -ఉద్యమ కారుల్ని, లేత సూర్యుడు ఉద్యమోదయానికి సంకేతాలు. ఇవన్నీ కలిపి అలాంటి వ్యక్తిని వర్ణించడానికే తన కవిత ఉన్నట్టు చెబుతారు.
మూడవ భాగంలోనూ సముద్రం ఉంది కానీ, ప్రధానంగా ఈ వాక్యాలన్నీ రైతు వర్తమానాన్ని పెనవేసుకున్నవి. 'గుల్ల బారి కంకి రాలిపోయినట్టుగా' రైతు జీవితం రాలిపోయి సమాజంలో ఉండీ లేనట్టుగా అంటే ఎవరూ గమనించనట్టుగా రైతు మారిపోయాడని అనడం కనిపిస్తుంది. జీవితాన్ని అనుశీలిస్తున్నప్పుడు పోరాటాలను స్పర్శించినట్టుగానే, ప్రగతి శీలకమైన ఏ అంశాన్నీ శివారెడ్డి కవిత వదిలిపెట్టలేదు. ఆలోచన పాదుకొలిపి ప్రేరేపించడానికే ప్రయత్నం చేసింది. 'ఆమె ఎవరైతే మాత్రం' (2009) లాంటి ప్రత్యేక సంపుటాలు తెచ్చిన శివారెడ్డి కవిత ప్రతీ అంశాన్నీ విశ్వసంబంధంగా చూస్తారు. ప్రతీ అంశం ప్రపంచానికి సంబంధించినదిగా ఎలా కనిపిస్తుందో, ప్రతీ స్త్రీ నుంచి అన్ని దేశ కాలగమనాల స్త్రీలను చిత్రిస్తారు. జీవితం ఏదైనా, సారాంశం ఒకే మార్గంలోని వివిధ దశల్లో ఉంటుందని అంచనా వేస్తారు. కాంట్ (ఇమ్మాన్యుయల్ కాంట్) తన పారమార్థిక ఆదర్శవాదం (ట్రాన్స్డెంటల్ ఐడియలిజమ్)లో 'మానవుని స్వీయ, అతీంద్రియమైన అహం వాటి ఇంద్రియ ప్రతిఫలనాలను దాటి, వాటి వర్గాల విశ్వభావనలకు సంబంధించిన జ్ఞానాన్ని నిర్మిస్తుంది' అన్నాడు. శివారెడ్డి గారి 'సీతకీ' (పే.40) ఇలాంటి విశ్వభావనలను ప్రేరేపించే కవిత. ఇలాంటివి ఆయన కవిత్వం నుండి అనేకంగా ఎత్తి రాయొచ్చు. ఒక కవితకు సార్వత్రికత (యూనివర్సాలిటి) సార్వకాలికత ఎలా చేర్చాలో పాఠంగా బోధిస్తుంది ఈ కవిత.
1. సీతకీ/ శూర్పణఖకీ/ ఊర్మిళకీ/ చరిత్రకీ ఏమిటి సంబంధం/ నరాలు కత్తిరించి/ కారుతున్న రక్తం నుంచి నిర్మింపబడుతున్న వాళ్ళు/ వంటింటి నుంచి లేస్తున్న పొగనుంచి పుట్టిన వాళ్ళు/ ధూమశకటాన్నెక్కి దేశ దేశాలు తిరిగొచ్చిన వాళ్ళు/ డెస్టిమోనాని, క్లియోపాత్రని, వీనస్నీ/ వెంటేసుకు తిరుగుతున్నవాళ్ళు
2. సముద్రాలకి రెక్కలొచ్చి ఎగురుతున్నట్టు లోక సంచారం చేస్తున్న వాళ్ళు// మగదేవతలందరూ, మగాళ్లందరూ/ వాళ్ళచుట్టు పురుగుల్లా మూగగా/ రెక్కలుతెగి సముద్రాలింకి/ ఎడారులుగా, తగలబడ్డ అడవులుగా మిగిలినవాళ్ళు/
3. సరస్వతికీ బ్రహ్మకీ/ గౌరికీ శివుడికీ/ లక్ష్మికీ విష్ణువుకీ చరిత్రకీ ఏమిటీ సంబంధం/ ఒక మాతృమూర్తికీ చరిత్ర గమనానికీ సంబంధముందా?/ ఒక లేత రావి ఆకు రాలి ఎదపై బడింది/ తొలగించలేక మోయలేక చస్తున్నా. మొదటి యూనిట్లో భారతీయ పాత్రలను, ప్రపంచపాత్రలను ఒక చోట ముడివేసి ఒక ప్రతిపాదన చేసి ఒక ప్రతీకతో వాళ్ల అనువర్తనాన్ని చిత్రిస్తారు. శివారెడ్డి గారికి ఒక అలవాటుంది (నిజానికి ఇలాంటివి చాలా వెదికి రాయొచ్చు) సముద్రాన్ని అనేక సందర్భాలలో రకరకాల అర్థాలతో ప్రతీకగా చేస్తారు. 'సముద్రాలకి రెక్కలొచ్చి', 'సముద్రాలింకి'లో భిన్న అర్థాలతో ప్రతీకలుగా చెబుతారు. 'లేత రావి ఆకు ఎదపై బడడం' వర్తమానం. మాతృమూర్తికి చరిత్రగమనానికి సంబంధముందా? అనే ప్రశ్న. నిజానికి ప్రతిపాదనే.. కవిత్వం అలంకారాల నుంచి పాశ్చాత్య కళా మీమాంస నుండి ప్రకటనాత్మకత (సెమియోటిక్ ఎక్స్ప్రెషన్) దాకా చేరింది. శివారెడ్డి కవిత నిండా ఈ ఆధునిక నిర్మాణసరణికి (మాడరన్ డిక్షన్) ఉదాహరణలు కనిపిస్తాయి. శివారెడ్డి కవిత్వం కొత్త తరాన్ని ప్రేరేపిస్తుంది. బోధిస్తుంది. మార్గాన్ని చూపుతుంది. అన్ని కాలాల్లో సమూహాల వెంట, జీవితాల వెంటా ఉండమని ప్రబోధిస్తుంది.
(కె.శివారెడ్డి గారి 'పక్కకు ఒత్తిగిలితే'కు ప్రతిష్టాత్మక 'సరస్వతీ సమ్మాన్' వచ్చిన సందర్భంగా...)
- ఎం.నారాయణ శర్మ,
9177260385