Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజల బాధలు రాయడంలో ప్రజాకవులది ఒక ప్రత్యేక స్థానం. తెలంగాణలోని ప్రజాస్వామ్య జీవితంతో మమేకమై కవిత్వాన్ని రాయడంలో ఆచరణాత్మకత ఉన్న కవిత్వం నందిని సిధారెడ్డిది. విప్లవ కవిత్వం విస్తరిస్తున్న రోజుల్లో ఆ ప్రవాహంలో కలిసి అనేక గొప్ప కవితలను ఆయన రాశారు. రైతు జీవితంపైన సిధారెడ్డిగారికున్న అపారమైన ప్రేమ ఆయన కవిత్వంలోకనిపిస్తుంది. తెలంగాణ గ్రామీణ జీవన చిత్రణ ఆయన కవిత్వంలో ప్రధాన అంశంగా ఉంటుంది. అందులో భాగంగా ఆయన 'ఉసురు' కవిత రాశారు.
రాజ్యం ప్రజలపై ప్రయోగించే నిర్బంధకాలంలో గ్రామం ఖాళీచేసి వెళ్ళవలసి వచ్చిన తప్పనిసరి దయనీయ పరిస్థితులను ఆయన కవిత్వీకరించిన తీరు మనల్ని కలచివేస్తుంది. కవితను ఎత్తుకున్న మొదటి రెండులైన్లలోనే కవిలోని మానవీయ కవితాశక్తి పాఠకుల్ని కాసేపు నిశ్శబ్ద పరుస్తుంది.
''ఇల్లు ఖాళీ చేసినంత సులభంగా/ జీవితం ఖాళీ చెయ్యలేం కదా...''
అని ప్రారంభించిన కవిత అక్షరాలన్నీ మనల్ని తడి తడిగా తగులుతాయి.
కవిత్వం మొత్తం చదివాక ఒకతడి మన గుండెను ముంచెత్తకపోతే ఎక్కడో మనలోని మానవతను జార్చుకున్నట్టు లెక్క.
''ఇల్లు ఖాళీ చేసినంత సుతారంగా/ ఊరు కూడా ఖాళీ చెయ్యలేం/ పల్లెటూర్లో పచ్చటి బాల్యాన్ని/ వీపుల మీద ఆడించిన తాతయ్యల్ని ఖాళీ చెయ్యలేం'' ఊరితో ఎన్ని అనుబంధాలు పెనవేసుకుని ఉంటాయి. పరిసరాలు, పచ్చని చేలే కాదు, పచ్చని మనుషులు కూడా. అవన్నీ వదిలి ఖాళీ చేయటమంటే ఎంత గుండెకోత ఉంటుందో కవిత చదువుతున్న సేపు తెలుస్తూనే ఉంటుంది.
''కళ్ళముందు కలలు బతుకమ్మలు పేర్చే/ పూలతోటలు ఖాళీ చేయడం కష్టం/ అన్నింటికంటే అన్నీ అయ్యింది తల చిక్కులు తీసిన/ అమ్మ ఒడి ఖాళీచేయడమంటే/ సన్నటి గునపంతో గుండెను తవ్వుతున్నట్లుంటుంది'' అంటూ తల్లిపేగు దూరం చేసిన రాజ్య నిర్బంధ స్థితిని సున్నితంగా వివరిస్తారు.
''బూట్లు టకటకలాడించుకూంటూ ఖాకీ గుర్రాలొచ్చినపుడల్లా ఊళ్ళు ఖాళీ చెయ్యడం వాళ్ళకు తప్పని సరైంది'' అంటూ తెలంగాణ పల్లెల్లోని రోజులను తన కవిత్వంలో చూపారు సిధారెడ్డిగారు. ఈ పరిస్థితి 1980 - 90 కాలాల్లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని మెజారిటీ యువకులకు ఈ పరిస్థితులు అనుభవంలోనివే. లాఠీలూపుకుంటూ పోలీసులు లోపలికొచ్చినప్పుడే ప్రాణాలు పోతాయి. బాలింతలకు తల్లుల మానాలు పోతాయి అంటూ ఆ చీకటి రోజుల భయంకర సన్నివేశాలన్నీ మన కళ్ళకు కట్టినట్టు తన కవిత్వంలో వివరిస్తారు.
''పోలీసులొచ్చిన ఊళ్ళో/ ఆకాశమ్మీది చంద్రుడు కూడా హఠాత్తుగా మాయమవుతాడు'' అని ఆ భయానక నిర్బంధ క్షణాల దు:ఖపు వేదాల్ని వివరిస్తాడు. చివర్లో రాజ్యహింసకు ఇంటి నుండి ఊరు నుండి వెళ్ళిపోయిన కన్న కొడుకులను గుర్తు చేసుకుంటూ తల్లులుపడే వేదనను మన హృదయానికి అతికిస్తారు.
''ఊరడించడానికి ఊరపిచ్చుకా రాదు/ చెట్టంత కొడుకూ రాడు/ ఎన్నిరోజులైనా తల్లిదు:ఖం ఒడువదు'' అని మాతృవేదనని అక్షరాల్లోకి ఒలికించి కళ్ళను తడి చేస్తారు. ఇలాంటి గుండెతడిగల అనేక కవితలని నందిని సిధారెడ్డిగారు తన సాహిత్య ప్రయాణంలో సృజించారు. అయితే ఇది ప్రత్యేకంగా గుర్తుంచుకోదగ్గ కవిత. అనుకోకుండానే గుర్తుకు వచ్చే కవిత. అందుకే ఇప్పుడు దాని గురించి మననం చేసుకోడం.
- సిహెచ్.ఉషారాణి,
9441228142