Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్లెదుట జరిగిన సంఘటనలే కలగా రూపాంతరం చెంది మనల్ని చైతన్యవంతం చేస్తుంటాయి. అలా జీవితంలో కలల తాలూకు జ్ఞాపకాల్ని కాగితంపై పేర్చుకుంటూ సంపుటిగా మనముందుకు తెచ్చారు పెనుగొండ సరసిజ. వీరి కవిత్వంలో వస్తు విస్తృతి ఉంది. భిన్న కోణాలలో పరిశీలించడమే కాక కవికి సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్న స్పృహ వుంది. చైతన్య దిశగా ఈ సమాజాన్ని తీసుకువెళ్లాలన్న తపనని వీరి కవితల్లో చూడొచ్చు. మహిళల్ని గౌరవించలేని సమాజం మనుగడ సాగించలేదు. రోజు రోజుకీ మహిళల భద్రత కరువైన రోజుల్లో వారిని దేవతలుగా కొలవనవసరం లేదు మనిషిగా చూడమంటారు 'ఒక్కొక్క పువ్వేసి' కవితలో. ''స్త్రీ మూర్తిని కొలువనక్కర్లేదు/ కన్నీరు పెట్టకుండా కనిపెట్టుకొని ఉంటె చాలు''. నిజంగా అలాంటి వాతావరణం రావాలని కోరుకోవాలి. మహిళ సమస్యలపై సహానుభూతితో రాసినవి ఆలోచింపచేస్తాయి. 'మళ్ళి జన్మిస్తా'లో చెత్త కుప్పల్లో అనాథగా పడేసిన తండ్రులని నిలదీసి అడుగుతుంది ''చెత్తకుప్పల్లో నన్నొదిలిన నాన్నను/ చెంప పగలగొట్టి అడిగే/ చైతన్యంగా మళ్ళి జన్మిస్తా //అస్తమించే సంధ్యలా కాక/ నూతన ఉదయానికి ఊపిరిపోసే ఆశలా ఉద్భవిస్తా. అవును జరిగిన అన్యాయాల్ని మౌనంగా సహిస్తూ ఉండటం తగదని, ప్రశ్నించాలని కోరుకున్నారు. ప్రతి తెలుగువాడికి భాష పట్ల మమకారం ఉండాలి. అందులో మన తెలుగు తీయనైనది. మరి అలాంటి తీయని తెలుగుకి తెగులు పట్టించొద్దని విజ్ఞప్తి. ''పాడి పంటలతో, పచ్చని పైర్లతో/ చక్కనైన తెలుగు పొలానికి పట్టరాదు ఏనాడు తెగులు''. తెలుగు తీయదనం చేదుగా మారకముందే మేల్కొనవలసిన అవసరం ఉందంటారు. తల్లి తన పిల్లల పట్ల చూపే ప్రేమ అవ్యాజనీయమైనది. చాలా వరకు పిచ్చి అనిపించవచ్చు గాని తల్లి ప్రేమని కొలవలేం కదా అందుకే కడుపున పుట్టిన కొడుకులు మాటలంటున్నా భరిస్తుంది. అందుకే అంటుంది ''కడుపు కోసి కన్ననాడు/ కన్నీళ్లు కార్చలేదు గాని/ ఈటెలాంటి నీ మాటలకి ఈ నాడు ఆ గుండె నెత్తురు కారుస్తుంది/'' కొడుకులు తల్లితండ్రులని హింసిస్తున్నా, కొడుకుల్ని కూడా క్షమించి వదిలేసేంత పిచ్చి ప్రేమ తల్లిది. (తల్లి aశ్రీషayర పిచ్చిది )..
కవి అంటే ఎవరు? ఓదార్పునిచ్చే మనిషి, కలుషితమైన రాజకీయాలకి పదాల కత్తులతో సర్జరీ చేసేవాడు. కవి గొప్పతనం ఎంత వివరించినా తక్కువే. కవి గురించిన కవితలో, ''మ్యూజికల్ వర్డ్స్తో శ్రోతను సైతం కవిగా మార్చే మహేంద్రజాలికుడు''. నిజమే అద్భుతమైన కవిత్వం విన్న తరువాత కవిగా మారాల్సిందే. ఉగ్రవాదానికి మతం కులం లేదు. మనుషుల్ని చంపడమే వారి అభిమతం. అలంటి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం మృత్యువుతో చెలగాటమే. అందుకే పసి పిల్లలు బలయ్యారు ''అమృతం లాంటి అల్లా బిడ్డల్ని/ మారణహౌమానికి హారతిచ్చావు/ ఉగ్ర క్రీడలో ఇంకెంతమంది బలి కావాలో ..(ఉగ్ర క్రీడ). వంటిల్లుని తక్కువ అంచనా వేస్తారు కానీ వంటిల్లే ఇల్లాలికి సర్వస్వం. ఇంటి యజమానికి ఆర్థిక, హార్దికంగా తోడు ఉండే గొప్ప స్నేహితుడు.
ఎన్నడన్నా బొక్కెన/ బాయిల బడితే పాతాళగరిగేశి పడ్డ పాట్లు మనసంతా పారతనే ఉంటాయి/ బాత్రూం జాగల బాత్రూమ్ వచ్చిందిగాని/ బాయితే గాయబయ్యింది నామనసుకేమో గాయమైంది.
ఈ కాగితాన్ని ముద్దాడిన కల సరసిజ గారికి మొదటి పుస్తకం అయినా ఎక్కడా అలాంటి ఛాయలు కనిపించవు. ప్రతి సమస్యని భిన్న కోణాల్లో స్పృశిస్తూ సామాజికతని వైయుక్తికాన్ని కలబోసి రాసిన కవిత్వమిది. జీవితంలో ఎదురైనా ప్రతి సందర్భాన్ని కవిత్వీకరించుకుంటూ పోవడం విశేషం. సాప, బా యి, గోడ ఇలాంటి భిన్న కవిత్వ వస్తువులు వీరి కవిత్వంలో చూడొచ్చు. కవిత్వం నిండా పదును, వాడి, వేడి, తడి ఆర్థ్రత అన్ని కలగలిపి ఉన్నాయి.
- పుష్యమీ సాగర్,
9010350317