Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనుషుల పట్ల మానవసమాజం పట్ల అంతులేని ప్రేమ ఉన్న కవి 'అలిశెట్టి ప్రభాకర్'. మానవ సమాజంలోని అసమానతల్ని, మనిషిని మనిషి దోపిడీచేసే అమానవీయ దోపిడీ విధానాన్ని తన కవిత్వంతో ప్రశ్నించిన కవి అతను. అతని కవిత్వమంతా మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని కలలుగన్నది, అతని కవిత్వమంతా పీడితుల పక్షాన నిలచి ఆలోచింప చేసింది. అలా ఆలోచింపజేసే కవితల్లో ఒక కవిత అతను రాసిన..
''అన్నీ అధ్యయనం చెయ్''.... మనిషికి అర్థంకాని అనేక విషయాలను అధ్యయనం చెయ్యటమనే ఒక మానవ విలువలతో కూడిన సలహా ఇందులో దాగి ఉన్నది.
''శ్రమజీవి కండరాలపైని స్వేదబిందువుని/ అదృశ్య శక్తులు అపహరించే వేళ/ దోపిడీని అధ్యయనం చెరు'' అంటూ శ్రమజీవుల స్వేదం ఎలా దోపిడీ చేయబడుతుందో ఆలోచించమని అంటాడు. ఈ శ్రమ దోపిడీలోంచే వివక్షలతో కూడిన సమాజం ఏర్పడుతుందని, దాన్ని సరిచేయాలంటే కష్టజీవుల శ్రమ ఎలా దోపిడీ చేయబడుతుందో తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉన్నది.
''మోడు ఎముకల గూడై/ అర్థించే ఆకలి కొమ్మల చేతుల్నీ/ అనుక్షణం అంతస్తుల రాతిపాదాల కింద పడి విరిగే/ ఈ దేశపు దారిద్య్ర జీవన శిథిలాల్నీ/ అధ్యయనం చెరు'' అంటూ ఈ దేశ సంపద పెరుగుదలలో ప్రధాన వనరుగా వున్న శ్రామికుల రెక్కల కష్టాన్ని గుర్తించమని అంటాడు.
పెరిగే భవనాల కింద, పెరిగే సంపదలను కింద కనిపించకుండా పోయే, లెక్కకు రాకుండా పొయే శ్రమపెట్టుబడిని అతను గుర్తించాడు. దాన్ని అందరితో గుర్తింపబడాలని అతను భావించి ఆ అట్టడుగున పడిపోయిన శ్రమజీవులను తన కవిత్వంలో సాక్షాత్కరిస్తాడు.
''కత్తి అంచుమీద తడితడిగా/ నెత్తుటి బొట్టు తచ్చాడుతున్న వేళ.../ ఆయుధాన్ని అధ్యయనం చెయ్'' అంటూ తిరుగుబాటు ఆయుధపు అనివార్యతను అర్థం చేసుకోమంటాడు.
అలాగే ''ప్రవహించే నెత్తుటి ఒడ్డున మనిషి/ ఆయుధంగా మొలకెత్తే అనివార్యమైన/ భౌతిక పరిస్థితులను అధ్యయనం చెయ్'' అంటూ మనిషి ఆయుధంగా మొలకెత్తడమనే ఒక తిరుగుబాటు దృశ్యాన్ని చిత్రణ చేయడం అలిశెట్టి లాంటివాళ్ళకే చెల్లుతుంది. 1970ల తర్వాత నుండి 90ల వరకూ తెలంగాణ పరిస్థితులకు తన కవిత్వం ద్వారా అద్దం పట్టినవాడు అలిశెట్టి ప్రభాకర్. అతని కవిత్వమంతా పీడిత జన పక్షపాతంగా మలచి పీడితుల పక్షాన నిలిచిన కవి అలిశెట్టి.
- సిహెచ్.ఉషారాణి,
9441228142