Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రఖ్యాత చిత్రకారుడు మార్క్షాగల్ 'రీవర్ వితౌట్ ఎడ్జెస్' పేరుతో ఒక చిత్రాన్ని చిత్రీకరించాడు. ఉపరితలంగా చూస్తే ఏమీ అనిపించదు. లోపలికి వెళితేగానీ అసలు వాస్తవం మనకు అర్థం కాదు. గ్రామీణ జీవితం, పట్టణ జీవితం, అమోఘమైన కాల్పనీకతలను జోడించి అద్భుతాలను సృష్టించిన నేర్పరి షాగల్.
ఏ కళాకారుడు, కవియైనా అతని ఆలోచనల ఉద్వేగాల్ని కేవలం ఉద్వేగం కోసమే కాగితం పై పెట్టడు. ఒక సత్యాన్ని చెప్పడానికి, ఒక సమకాలీన చరిత్రను రికార్డు చేయడం కోసం తన భావోద్వేగాన్ని ఉపయోగిస్తాడు. తమ సమకాలీన కాలాన్ని అర్థం చేసుకొని సచేతనం చేస్తూ రికార్డు చేయాలని బుద్ది జీవులు, చైతన్య జీవులు భావించడం పరిపాటి. ఇరవై ఒకటో శతాబ్దం ఈ స్పృహను మరింత చిక్కపరిచింది. మనిషి ఆలోచనా జంతువన్నాడు అరిస్టాటిల్, హేతుపూర్వక, ఆర్థిక జంతువంటాడు మార్క్స్. అహేతుక జీవి అంటాడు ఫ్రాయిడ్. ఇంకా రకరకాలుగా మనిషిని నిర్వచించారు మేధావులు. కానీ ఈ ఖండిత శకలాల నుండి అసలు మనిషిని పైకి తెస్తున్నారు.
ఈ కాలం కవులు 'రీవర్ వితౌట్ ఎడ్జెస్' చిత్రంలాగే పైకి ఏమీ కనిపించకుండానే లోలోపలికి వెళుతున్న కొద్ది వివిధ ఖండితాల నుండి అసలు మనిషిని పైకితీసే ప్రయత్నం కనిపిస్తుంది హైద్రాబాద్ కవుల సంకలనం 'ఈ నెల వెన్నెల కాయనీ'లో. వివిధ రూపాల్లోని మనిషిలోంచి అసలు మనిషి ఎలా తనకు తాను చీల్చుకు వస్తాడో దాసరాజు రామారావు గారిని కదిలిస్తే తెలుస్తుంది. ''రుణాలను తీర్చుకోవచ్చు - ప్రేమలను తేర్చుకోవడముంటుందా'' అంటూ మొలకెత్తిన ప్రశ్నని ఏ సిద్ధాంత కాలమానాల్లోంచి కొలవగలం.
నలభైతొమ్మిది మంది కవుల కవితలతో వెలబడ్డ ఈ సంకలనంలో పేరు పొందిన ప్రఖ్యాత కవుల నుండి మొదలుకొని వర్తమాన కవుల వరకు ఉన్నారు. అమ్మంగి వేణుగోపాల్ ముందుమాటలో చెప్పినట్టు తెలంగాణ కవి మౌలికంగా నగర కవి కాదు. నగరంలో ఉన్న కవి మాత్రమే. అతని ఆత్మ ఫక్తు గ్రామీణమే. అతని ఆలోచన, అతని బాధ, అతని భవిష్యత్ దర్పణం అంతా గ్రామీణ మట్టి రేణువుల నుండే. అందుకే అతను కూడా గ్రామీణ ఆత్మనే కలిగి ఉండాలని అనుకుంటాడు. మహాచక్రవర్తి కావలసిన సిద్ధార్థుడు వృద్ధాప్యం, శవాలు, రోగాలు, దు:ఖాలను చూసి జ్ఞానం పొంది బుద్ధుడయ్యాడు. కానీ తెలంగాణ కవి పుట్టుకతోనే బుద్ధుడు. అతను నడక నేర్చుకున్నదే అనేకానేక సంఘర్షణల్లోంచి ఆ మనిషి కోసమే తపన.
అసలు హైదరాబాద్ నగర నిర్మాణమే గొప్ప మానవతా దృక్పథంతో జరిగింది. ఈ నగరం నిండా రకరకాల మనుషులతో కళకళలాడాలని ప్రార్థించాడు ఈ నగరాన్ని నిర్మించిన కులీకుతూబ్ షా నగర నిర్మాణానికి ముందు. కులీకుతూబ్షా స్వయాన కవి. అందుకేనేమో ఇక్కడ కవిత్వం సర్వకాల కోకిల పాటై ఈ గాలిలో గింగుర్లు కొడుతుంది.
ప్రఖ్యాత చరిత్రకారుడు 'ఫెరిస్టా' అభిప్రాయం ప్రకారం ఢిల్లీ, ఫతేపూర్, సిక్రి, ఆగ్రా, ఉత్తర భారతంలోని ఏ నగరమూ హైదరాబాద్కు సాటిరాదు. నగరానికి అద్దం పట్టిన చింతపట్ల సుదర్శన్ కవిత 'హైదరాబాద్ హైదరాబాద్' చదవండి. నగరం గుండా అలా నడుస్తూ వెళుతున్నట్టుగా ఉంటుంది. అలాగే వై.శ్రీరాములు గారి 'నగరం ఒక నల్ల గులాబి' కూడా అలా వీళ్ళ కవిత్వంలోంచి నగర వీధుల గుండా సంచరిస్తారట. వేముగంటి మురళి ''ఆ కేఫ్ మూతపడింది' కవిత మనల్ని రవ్వంత బాధకు గురి చేస్తుంది. ఆధునిక కాల మార్పులు నగరం కోల్పోతున్న గత వైభవాల్లో ''కేఫ్'' లు కూడా ఉన్నాయి. అవి గొప్ప చర్చా కూడళ్ళు, ''స్నేహాలను, సుదీర్ఘ చర్చలను రుచికరమైన వేడి వేడి చారుతో చిక్క పరిచే కేఫ్లు మూతపడడం ఎంత విషాదమో' ఈ కవిత మనకు చెపుతుంది.
'ఆ కేఫ్ దానంతట అది మూతపడలేదు / బర్మీటికీ పుట్టుకొచ్చిన కొత్త రుచులు జబర్దస్తిగా బందు పెట్టించినరు' అంటూ బాధ పడతాడు మురళి. ఆకాశాన్నంటే బంగ్లాల నిర్మాణాలకు రంగు రంగుల సీతాకోక చిలుకలుగా తీర్చిదిద్దే పెయింటింగ్ జీవితంలోని చీకటిని చూపెడతాడు ప్రఖ్యాత కవి నందిని సిధారెడ్డి. ''పరి దిగులుతూనే పాత అంగి పాత ప్యాంటు మార్చుకోవచ్చు / మారదని మార్చుకోలేనిది ముఖం... తన పాత ముఖం అంటూ మారని పెయింటర్ జీవితాన్ని' ఆవిష్కరించారు సిధారెడ్డి. హైదరాబాద్లో ఉన్న కవులతో కూడిన సంకలనమే కానీ... కేవలం హైదరాబాద్పై రాసిన కవిత్వం మాత్రమే కాదు కాబట్టి రకరకలైన భావాలు మనల్ని చుట్టుముడుతాయి. ఏనుగు నరసింహరెడ్డి రాసిన 'నిద్రనవ్వు'' కవిత ఒక పసిదాని నిద్రలోని సోయగాన్ని మనకు పట్టి ఇస్తుంది.
''వాడు నిద్రనదిలోకి జారి / మనల్ని జాగురూకపు గట్టు మీద కూర్చో బెడతాడు / మూసిన కను రెప్పల మీద / అప్సరసలు నాట్యమాడతారు / వాడి నిద్ర నవ్వులో ఎక్కడలేని సోయగం...'' నగరంలో ఉండే కవి ఎక్కడా సున్నితత్వాన్ని కోల్పోడు. అనడానికి నిదర్శనం ఈ కవిత. గాఢమైన కవిత్వాన్ని హరగోపాల్... ''మాటలని పారెరు / నిశ్శబ్దంగా మాట్లాడు / ఒంటరిగా నిరీక్షించు / ఏకాంత కావ్యానివైపో'' అంటాడు. 'జాడ' అనే తన కవితలో ప్రముఖ కవయిత్రి కె.విమల ''నల్లమల దారిలో'' కవిత రకరకాల చెట్లనీ, పక్షులనే కాదు అభివృద్ధి మాటున దృశ్యమవుతున్న ప్రకృతిని మన కళ్ళ మందు ఆవిష్కరిస్తుంది. కవి ఎప్పటికప్పుడూ అంతర్థాన మవుతూనే తిరిగి ఎలా అంకురమవుతాడో యాకుబ్ కవిత్వం చదివితే తెలుస్తుంది. ''తెగిపోతూ మళ్ళీ అతుక్కుంటాను / ఎక్కడో జారి పోతున్నాను / చిగురిస్తున్నాను / మళ్ళీ ఎండిపోతున్నాను / మళ్ళీ జన్మిస్తాను సరికొత్తగా / కొత్తగా నీలోకి నన్ను ఒంపుకోడానికి / అక్షరంలా పుడతాను'' అంటాడు.
మరో ప్రఖ్యాత కవి నాళేశ్వరం శంకరం పాల్కురికి సోమనాధుని కవిత్వ వైభవాన్ని మురిపంగా చెబుతున్నాడు ''సోమనాథా... సోమనాథా.../ నీ భవ్యాక్షరాలు..పాలకుర్తిలోని ఏ గోవు పాలు తాగాయో గానీ / మా అస్తిత్వ ఇల వేల్పులు అవే గదా / నీ మీద ఆన / మా తొలి తెలుగు కవన జీవనదివి నీవే... అంటాడు. నగరీకరణలో పల్లెను కోల్పొవద్దని హెచ్చరిస్తున్నాడు గొట్టిపర్తి యాదగిరిరావు. పల్లె ఛిద్రమవకుండా చూడవలసిన బాధ్యతను గుర్తు చేస్తున్నది కొండపల్లి నీహారిణి. బస్సు డ్రైవర్ జీవితాన్ని కవిత్వం చేసిన కాంచనపల్లి ''విశ్రాంతి కోసం పట్నం పల్లె వైపు కదిలిపోతుంటే / తను మాత్రం డ్యూటీలోని స్వ్కార్ చేసే ఆదాయ పంటవుతాడు'' అని చెబుతారు. యుద్ధాలను ఎదుర్కొని, మంచితనాలూ, మానవత్వాలూ వెల్లివిరియనీ, సుఖశాంతులతో ఈ నేల వెన్నెల కాయనీ... అవును.. ఈ నేల వెన్నెలకాయనీ...!
- చెమన్,
94403 85563