Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు భాష వెలుగు కోసం విశేష కృషి చేస్తున్న వంగూరి ఫౌండేషన్ ( అమెరికా) సంస్థ తన 77వ ప్రచురణగా ఈ పుస్తకం తీసుకు వచ్చింది. 'తెలుగు భాష గొప్ప భాష - కాని కనుమరుగౌతున్నది' అనే ఆందోళనను అక్షర బద్దం చేశారు రచయిత. డా||అద్దంకి శ్రీనివాస్, ఆత్రేయపురపు పాండురంగ విఠల్ ప్రసాద్, చెన్నూరు ఆంజనేయరెడ్డి, జయధీర్ తిరుమలరావు, వంగూరి చిట్టెన్ రాజు లాంటి పెద్దలు ఈ పుస్తకానికి విలువైన ముందుమాటలు రాశారు. హరప్పా, వింధ్య పర్వతాల నుంచి కన్యాకుమారి దాకా, పడమర కనుమల నుంచి తూర్పు కనుమల దాక తెలుగువారు నివసించారు. నాలుగు వేల ఏండ్ల కాలం చరిత్ర కలిగిన తెలుగు వారు వ్యవసాయ వృత్తితో బాటు రోమ్తో వ్యాపారాలు చేసే స్థితి గురించి 'ఇండికా' గ్రంథం ద్వారా తెలుస్తోంది. వాజ్పేరు ప్రధానిగా నున్న కాలంలో హైదరాబాద్ వస్తే మీల్స్ మాటకు తెలుగు పదం అడిగారట. అన్నం - భోజనం అని మంత్రులు, అధికారులు శెలవిస్తే... ఆ పదాలు సంస్కృతం అని వాజ్పేరు అనగా... వంటవాడు మాత్రం 'కూడు - బువ్వ - తిండి' అంటారండి అని చెప్పాడట. ప్రతి ఊర్లో మనకు ఝాన్సీలు (పేరు పెట్టుకున్నవారు) కనపడతారు. కానీ రాణీ రుద్రమ పేరు గల వారు పెద్దగా కనిపించరు. 160 ఏళ్ళ కిందట పది రోజులు పాలించిన ఝాన్సీరాణి 29వ ఏట చనిపోయింది. ఒక తెలుగు రాణి 800 ఏళ్ళ కిందట 50 ఏళ్ళు పైగా పాలించి, 82వ ఏట గుర్రంపై స్వారీ చేస్తూ, ఒక చేత్తో చంటిబిడ్డను పట్టుకుని, రెండో చేత్తో కత్తి పట్టి యుద్ధంలో చనిపోయింది. అలాంటి యోధురాలు ప్రపంచ చరిత్రలో కనిపించదు. మనం గుర్తించం!
ఈ నేల మీద మొత్తం 6500 దాకా నుడులుంటే అందులో ఐదు మాత్రమే అజంత భాషలున్నాయి. వాటిలో తెలుగు ఒకటి. అజంత భాష అంటే ఆ నుడిలోని ప్రతి మాట చివర అచ్చు వుంటుంది. హిందీకి బదులు 'తెలుగు దేశానికి సరైన భాష. అనుసంధాన భాష' అని 1965లోనే పార్లమెంట్లో (హిందీ వ్యతిరేక ఉద్యమ సందర్భంగా) అన్నాదురై అన్నాడు. అవధానం - పద్యం - పాట - సంగీతం - పద్య నాటకం లాంటివి తెలుగు వారి సొత్తు. పరాయి భాషల మోజుతో నిర్లక్ష్యానికి తెలుగు ఎలా గురౌతుందో తెలుపుతూ, తెలుగు ప్రాశస్త్యాన్ని మనం ఏలికలను ఏమి అడగాలి? అనే 23 పాయింట్లు (పేజీ 110) తో విశ్లేషణాత్మకంగా రాశారు. భాషాభిమానులకు చక్కటి కర దీపిక.
తెలుగే గొప్ప భాష, రచన : పారుపల్లి కోదండ రామయ్య, పేజీలు : 112, వెల : 80/-, ప్రతులకు : నవోదయ, ప్రముఖ పుస్తక కేంద్రాలు
- తంగిరాల,
9393804472