Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏనుగు నరసింహారెడ్డి అప్పుడప్పుడు రాసిన వ్యాసాల సమాహారమే 'అంతరంగం' వ్యాస సంపుటి. 26 కవిత్వ పుస్తకాలపై వారు పరిశీలించి, తన అంతరంగంలో కలిగిన భావాలను వ్యాస రూపంగా అందించినవి. ఈ వ్యాసాలు కొన్ని పత్రికలలోనూ, ప్రత్యేక సంచికలలోనూ ముందుమాటలుగా రాసినవి. ఇది ఆయా రచయితల శైలినీ, కవిత్వ సృజననీ అందించేవిగా వున్నాయి. గంగుల శాయిరెడ్డి, సినారె, కాళోజీ, దాశరథి, సదాశివలతో పాటు ఆధునిక కవుల రచనలపై విశ్లేషణాత్మకతతో ఇవి సాగినయి. గేయ కవిత్వంపై మూడు వ్యాసాలున్నాయి. ఆధునిక గేయ కవిత్వం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సినారెనే. అందుకు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు లాంటివి స్మృతిపథంలో మెదలుతాయి. ఆ తదుపరి జి.చెన్నకేశవరెడ్డి గేయ కవిత్వ పరిశోధనా గ్రంథం. 'అంతరంగం'లో అనేక విషయాలపై ఏనుగు నరసింహారెడ్డి నిశితంగా తమ చూపును సారించారు. ప్రతి కవితా సంపుటిపై తనదైన సాధికారిక విశ్లేషణ చేశారు. విమర్శ చేసేటప్పుడు తమ స్వంత అభిప్రాయాలను అలవోకగా అక్కడక్కడ చెప్పినట్టు అనిపిస్తుంది. వ్యాసకర్త తను ముందుమాట రాస్తున్నానా, వ్యాసం రాస్తున్నానా, సమీక్ష రాస్తున్నానా అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ ప్రశ్న ఉదయించదు. అందువలన కొన్ని వ్యాసాలలో ఆ శీర్షికల పరిధిని దాటినట్టు అనిపిస్తుంది. అయితే ఆయా కవులపై తట్టి చూపే పరిశోధకులకు ఈ పుస్తకం చేయూతనిస్తుంది.
అంతరంగం, ఏనుగు నరసింహారెడ్డి, పేజీలు : , వెల : 150/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
- టి.శ్రీరంగస్వామి,
9949857955