Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడో వాన పడుతుంటే మన నాసికను పలకరిస్తుంది కమ్మటి మట్టి వాసన... హాయిగా పీలుస్తూ పరవశానికి లోనవుతాం. అంతకన్నా పరిమళించే మట్టివాస నొకటుంది... ఆ వాసన కావాలంటే మనం పల్లెకు వెళ్ళాల్సిందే.... అక్కడ రైతు పొలం దున్నేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు, కలుపుతీసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు మనల్ని ఆప్యాయంగా పలకరిస్తుందా మట్టి వాసన... అమ్మ చేతి స్పర్శలా, మిత్రుని పలకరింపులా..!
రైతు బిడ్డే రచయిత అయినందువల్లేమో మట్టి పరిమళం మరింత గాఢతను సంతరించుకుందీ 'మట్టి వాసన' కవితా సంపుటిలో. ఆ పేరును ఎంచుకోవడంలోనే మట్టితో తనకున్న అనుబంధానికి కవి ఎంత గౌరవమిస్తారో అర్ధమవుతుంది.
ఇందులోని కవితలన్నీ రైతుల ఆవేదనల గురించి, పల్లెల గురించి, కొన్ని మానవత్వపు విలువలు గురించి ఉన్నాయి.
ఈ 'మట్టి వాసన' కవి మేరెడ్డి యాదగిరి రెడ్డి. ఉపాధ్యాయులైన వీరి ప్రవృత్తి రచనలు చేయడం. ఇందులో 37 శీర్షికలతో మట్టి పరిమళాన్నందించిన మేరెడ్డి యాదగిరి రెడ్డి, ఒక రైతుగా తాను పడ్డ మానసిక ఆవేదనను అక్షరీకరించినట్లు ప్రతి కవితలో అనిపిస్తుంది.
''మల్లెల వాసనకన్నా/ గులాబీల పరిమళాలకన్నా
అత్తరు సెంటు వాసనలకన్నా/ నా మట్టి వాసనలు మిన్న''
'మట్టి వాసన' శీర్షికలో కవి అంటున్న మధురమైన మాటలు ఇవి.
మనిషి మనుగడే మట్టి వాసన. జీవకోటికి ఆయువు మట్టి వాసన. ఇప్పుడు ఆ వాసనలన్నీ మాయమయ్యాయి. రియల్టర్ల చేతిలో భూమి వ్యాపార వస్తువయిపోయింది. పచ్చని పొలాలు ఉన్నచోట ఆకాశాన్నంటే ఇంద్రభవనాలు వెలిశాయి... అంటూ కవి ఆవేదనను వ్యక్తం చేశారు.
'అన్నదాత' శీర్షికలో కష్టాన్ని నమ్ముకున్న రైతుకు పనిగంటలు లేవు. కార్లు లేవు, మేడలు లేవు, సెలవులు అసలే లేవు. రైతుమిత్రలు, రుణ మాఫీలు, పావలా వడ్డీలు అన్నీ ఎడారిలో ఎండమావులు. వచ్చేపోయే కరెంటుతో పంట పండుతోందో, ఎండుతోందో తెలియని స్థితిలో మట్టిని మెతుకులుగా మారుస్తూ తాను మాత్రం గంజినీళ్ళు తాగుతున్నాడు అంటూ... .రైతు జీవనస్థితి నేడెలా ఉందో వివరించారు. రైతు దేశానికి వెన్నెముక అనే మనదేశంలో రైతు వెన్నెముక విరిగి పోతుండడం అసలు ఎవరికీ కనిపించడంలేదు. పెట్టుబడికి పంటధరలకు పొంతనలేదు. కష్టించి పండించేది రైతైతే ధరను నిర్ణయించే హక్కుమాత్రం దళారులదే. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు కవి.
- శాంతి కృష్ణ,
9502236670