Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యమాల పాటలల్ల తడిసిన వాడు,
కాలం గాయాలకు కవిత్వపు లేపనాన్ని పూసి,
సాహితీ వనంలో మందారమైనవాడు
బాల్యం జ్ఞాపకాలను, ఊరి, నీటి కథలను వెంట మోస్తున్నవాడు.
ఊరి కలలనే ఇంకా కంటున్నవాడు.
ప్రతి చెట్టును, వాగును ప్రేమించిన మనిషి.
ప్రకృతిలో మమేకమైన మనిషి... కాబట్టే కాంక్రీటు భవనాల మధ్య ఒదిలిపెట్టినా, ప్రకృతి పట్ల మమకారం పోకుండా వున్నాడు.
''ప్రకృతిని ఆరాధించడం అంటే
కవిత్వాన్ని శ్వాసించడమే''... నందిని సిధారెడ్డి 'నీటి మనసు' శీర్షికను చూడగానే తలమీద సర్వతో బాయి నుండి నీళ్ళెత్తుకొస్తూ తలరా తడిచిన జ్ఞాపకం మనసున మెదలకపోదు.
''రాయి విసిరినా చెరువు చెరువే''...
రాళ్ళు విసిరి గాయం చేసినా చెరువు అమ్మలా చల్లనిదే.
నీటిని గురించి అనేకమంది కవులు రాసినా సిధారెడ్డిగారు నీటిని చూసే విధానం వేరు. ఈ సమస్త భూప్రపంచంమంతా నీరే నిండి ఉన్నదనే భావనను తనదైన శైలి నుండి కవిత్వంగా మార్చాడు.
''మబ్బుల్లో సుడి తిరుగుతుంటది
భూమి పొరల్లో ఒడి తిరుగుతుంటది.
జీవి జీవిలో కలె తిరుగుతుంటది...'' అంటాడు.
చివరికి కవిని నదితో పోల్చడం ఒక సత్య భావన.
''కొండ విరిగి పడినప్పుడు కూడా
నీరు రెప్ప వేయదు...''
అనుక్షణం సమస్త ప్రాణికోటిని కాపాడుతుందనే భావనను కవిత్వీకరించడం వారి ప్రతిభకు నిదర్శనం.
''నీలోకి నా లోకి
ఇంట్లోకి చేన్లోకి
ఇరాం లేకుంట ప్రవహిస్తది...''
ప్రవహించే నీరు పట్ల సిధారెడ్డి గారికున్న లోతైన ప్రేమ ఈ కవితలో మనకు అర్థమవుతుంది. కవి మనసు పెడతడు. మనసు కరిగితే కవితవుతుంది
''కరిగితే కవి// పారితే నది
కవిది నది అవతారం
నాకు రెండూతెలుసు
నీటి మనసు/ /నీటి సొగసు..'' అంటూ నీటి చైతన్యపు సోయగాన్ని మన కళ్ళకు కడతారు.
వంద ఏళ్ళ సుదీర్ఘ చైతన్య చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీది. తెలంగాణా ఈ ఘనమైన చరిత్ర ఉస్మానియాలో చదువుకున్న వారికే కాదు, బయటవారికి కూడా ఉస్మానియా పట్ల ఒక ఆరాధనాభావం, గౌరవ భావం ఉంటాయి.
''రెక్కలల్లార్చుకుంటూ స్వప్నాలు ఎగిరొచ్చి
మానవుల రూపంలో
విహరిస్తుంటాయి ఇక్కడ-''
సిధారెడ్డిగారు కూడా ఉస్మానియాలోనే చదివి ఉండడం ఈ కవితకు మరింత బలాన్నిచ్చింది.
''తలకు ఆదర్శాలు చుట్టుకొని
తలపడటానికి సిధ్ధంగా ఉన్నట్టుంటుంది...
రెండు చేతులూ// బార్లాతెరిచి
శిరసెత్తి సూర్యచంద్రుల్ని ఆవహన చేస్తున్నట్టుంటుంది.''...
ఆ కాలంలో గొప్ప చారిత్రక మార్పులకు వేదిక ఉస్మానియా. దాన్ని దగ్గరినుండి చూసిన సిధారెడ్డికి సహజంగానే ఉస్మానియాపట్ల గౌరవభావం ఉన్నది.
''ఈ తోట చదువుల ఖజానా
ప్రపంచం మనిషికిచ్చిన నజరానా..''
అందుకే ఉస్మానియాను తనకవిత్వంలో చిత్రీకరించకుండా ఉండలేక పోయారు. అనేక ఉద్యమాల అంకురాలు ఇక్కడినుండే వృక్షాలై విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇక్కడి బీజాక్షరాలతోనే వైజ్ఞానిక ప్రపంచానికి సైనికులయ్యారు. ఎన్నో ప్రేమలు ఈ తోటలో పురుడుపోసుకొని బంధాలై వికసించాయి
'సృష్టి' అనే కవితలో
''మనిషన్న తర్వాత// ఓడిపోవాలి
ఓటమి తర్వాత// పోటీ పడే గెలుపుకే
పులకింతలైనా కేరింతలైనా..''
'టామ్ వాట్సన్'లాంటి ఫిలాసఫర్ చెప్పినట్లు If you want to succeed, double your failure rate''. నువ్వు ఒక్కసారి గెలవాలనుకుంటే నీ ఫేల్యువర్ రేట్ని రెట్టింపు చేసుకోవాలి అంటారు.
''దేవతల చరిత్ర ఆగిపోయింది
మానవుల ప్రస్థానం
చరిత్రలు చరిత్రలు సృష్టిస్తున్నది...''
గెలుపు ఓటములు తెలియాలంటే చరిత్రను చదవాలి. ఎన్ని ఓటముల తరువాత గెలుపు అందుకున్నారనేది తెలుస్తుంది... అని చెప్పిన టామ్ వాట్సన్ మాటలు అక్షరాల నిజం. పట్నంలో 'సిగెల్' అనే కవితలో 'సిగెల్' పడినప్పుడు అక్కడ ఉన్నవారి మనస్తత్వాలు, వాటి దృశ్యాలు చదివినప్పుడు ట్రాఫిక్ మధ్య ఇరుక్కొని ఊపిరాడక నిలబడినట్లుంటుంది. ప్రత్యేక వస్తుసేకరణ అర్థం అవుతుంది.
'నీటి భాష' నీరు లేని చెరువు కలత పడింది, కారుతున్న కాష్టం అంటే జీవం లేని శరీరంలా, కారుతున్న కాష్టంతో పోలిక ఎంత గొప్పనైనది.
''సాగనంపుతూ మా అవ్వ మీద పడి ఏడ్చిందిక్కడ
కన్నీళ్లయినా మిగులనిచ్చారా?...''
ఈ భావన గుండెను గుప్పిటిలో నొక్కి ఒదిలిపెడుతుంది.
''మాట రెండంచుల కత్తి
ఎటయినా తెగుతుంది
కత్తితో నీటిని కోయగలరా?'' అంటారు.
జీవితాన్ని ఒక తాత్విక కోణంనుండి విశ్లేషించి జీవిత సత్యాలు గంభీరంగా చెప్పిన కవిత 'నిజయాత్ర'. జీవన ప్రయాణంలో అన్నీ పూలదారులే కాదు. ముళ్ళదారులు, లోతైన అగాధాలు, భయపెట్టే చీకట్లు, ఎగుడుదిగుడు రాళ్ళు దారులు ఉంటాయి. అన్నిటినీ దాటుకొని ముందుకు సాగడమే మనిషి జీవిత నిజయాత్ర.
''బతుకయినా// చావయినా
ఒక పూలదండ'' అంటూ మొదలైన ఈ కవిత ప్రతి వరుస ఒక జీవిత సత్యాన్ని బొధిస్తుంటుంది. సంతోషాల్లో పొంగిపోవడం బాధల్లో కుంగిపోవడం సరికాదు అని సంతోషాలనూ, బాధలనూ ఒకే దండకు గుచ్చిన పూలదండలాగే చూడాలనే కర్తవ్య నిర్దేశికత మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా ఉంటుంది.
''రాళ్ళు విసిరేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు.
గాయపడకుండా ఎవరుంటరు'' అంటూ రాళ్ళు విసిరినా మనిషి యాత్ర ఆగకూడదని, ఏదైనా సరే హృదయంతోనే చెయ్యాలని అంటాడు.
''తడి లేని అక్షరాన్ని ఆలింగనం చేసుకోలేను
గాయపడిన బతుకునే ప్రేమిస్తా
సుడిగాడ్పు చుట్టినా బతుకంతా నడుస్తా
నాతొవ్వ నడుస్తా..'' అంటూ జీవితపు యాత్రలోని సత్యాన్ని చాటుతాడు. తెలంగాణా కవులకు ఊరు గురించి రాస్తే తప్ప మనసు మనసున ఉండదు. ఇక్కడి కవి ఎంతగా నగర జీవితాన్ని స్వీకరించినా వేర్లు మాత్రం ఊరిలో ఉంటాయి. అనునిత్యం ఊరిని కలవరించడం, నిత్యం ఊరును తడి జ్ఞాపకంగా ఉంచుకోవడం, కవిత్వానికి ఊరివాసనలను అద్ది మనపై పల్లెను చిలకరించడం తెలంగాణ కవికి పల్లెతో పెట్టినవిద్య. సిధారెడ్డి ప్రతి కవితాసంపుటిలో ఊరును గురించిన, రైతును గురించిన వ్యవసాయాన్ని, పంటలను గురించిన కవిత ఉండకుండా ఉండదు. 'ఊరినెత్తురు' కవిత నిండా ఊరితోపాటుగా, ఊరిని చుట్టుముట్టిన చైతన్య గాలులు, విషాదాలు, నిరాశలు, దు:ఖాలు మనకు కనిపిస్తాయి.
''శరీరం కోసం// భూమి వదిలిన వాడికి
భూమి మీద ప్రేమ వున్నట్టా?''
అని ప్రశ్నించడంలో సిధారెడ్డిగారి భూమిపైన, ఊరిపైన ప్రేమ మనకు తెలుస్తుంది. నేలపైన కాళ్ళు నిలుపుకున్న కవికి మాత్రమే ఇలా ప్రశ్నించడం సాధ్యం.
'ఊరి నెత్తురు' అనే కవితలో బంధాల్ని, ఉద్యమ బంధాన్ని ఒకింత బాధగా తలచుకుంటున్నాడు కవి.
అక్షరాలు ఎంత చైతన్యాన్ని ఇస్తాయో అతని జీవితమే నిరూపిస్తుంది.
''నడిచొచ్చిన తొవ్వను మరవలేదు...
నడుస్తున్న కాలంపై సోయి ఉన్నవాడు...''
- సిహెచ్. ఉషారాణి,
9441228142