Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊరవతల వుంటూ, పందులు కాస్తూ బతుకు వెళ్ళదీస్తున్న ఎరుకల వెంకటయ్య సామాజిక గుర్తింపు కోసం చేసిన పోరాటమే 'వాళ్ళు గెలవాలి' నవలా వస్తువు. ఒక ఎరుకల కుటుంబం చెప్పిన విషయాలను ఆధారంగా చేసుకుని రచయిత ఈ నవల రాశారు. ఇందులో ఆ ఎరుకల కుటుంబ సాంఘిక, ఆర్థిక స్థితిగతులతో పాటు వారి ఆచార వ్యవహారాలను రచయిత ఎంత వాస్తవికంగా చిత్రీకరించారంటే ఆయన కూడా తమ కులం వాడేనేమోనని, ఆ కుటుంబ సభ్యులు భ్రమపడేంతగా. కథనం వ్యవహారిక భాషలో వుంటే సంభాషణలు తెలంగాణ మాండలికంలో వుండటంతో నవలకు సహజత్వం వచ్చింది. వెంకటయ్య దొరనూ, పెత్తందార్లనూ ఎలా ఎదుర్కొన్నాడో, ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాడో ఈ నవలలో రచయిత విశదీకరించారు. చదువుకుని పైకొస్తే తప్ప ఏ అట్టడుగు వర్గానికీ భవిష్యత్తు లేదనే సందేశాన్ని ఈ నవల ద్వారా రచయిత ఇచ్చారు. వెంకటయ్య పెద్దకొడుకు వాసు చదువుకోని పిల్లను పెళ్ళిచేసుకోనంటాడు. నవలలోని 52వ పేజీలో ''అయ్యాల నేను సద్వుకోనంటే ఆ శీను బావ జేస్కోనంటడు కాబట్టి కాదు కక్కసం సద్వుకోవల్సిందే అన్కుంట సుందరయ్య నగర్ల తోల్కొచ్చిండ్రు...'' అని మణి మనసులో అనుకుంటుంది. మణి బావ వాసు అయితే ఈ శీను ఎక్కడ నుంచి వచ్చాడో! వెంకటయ్య రెండో కొడుకు సాలె అమ్మాయిని ప్రేమించడం ఈ నవలలోని ప్రధాన మలుపు. గిరి వెంకటయ్య మూడో కొడుకు. అగ్రవర్ణ భూస్వాములు నెట్టేయడంతో వెంకటయ్య కింద పడతాడు. దాంతో అతని తలకు బొక్కపడి రక్తం కారుతూ వుంటుంది. అప్పుడు గిరి అక్కడే వుంటాడు. 'గిరి ఎప్పుడైతే తండ్రి రక్తం కళ్ళజూశాడో' అని రచయిత రాశారు. తండ్రి తల నుంచి కారుతున్న రక్తం చూశాడో అని రాస్తే బాగుండేది. రక్తం కళ్ళజూడటం అంటే వేరే అర్థమొస్తుంది కదా! ఎరుకల గురించి ఎర్క జేస్కోవాలంటే తప్పకుండా ఈ నవల చదవాల్సిందే.
వాళ్ళు గెలవాలి, రచయిత : శిరంశెట్టి కాంతారావు, పేజీలు : 208, వెల : 150/-, ప్రతులకు : ప్రధాన పుస్తక కేంద్రాలు.
- తెలిదేవర భానుమూర్తి,
9959150491