Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అంతర్మథనంలో స్పందించిన నాలుగు రచనల్ని గాలి పటాల్లా ఎగరేసి;
కాలాన్ని మా మతాన్ని తట్టుకొని, ఎన్ని నిలుస్తవో అన్నదే గమనించాలి.
ప్రతి పదాన్ని పాదాన్ని కాలం వస్త్రకాయితం పడుతుంది'' - 'కల్పన' కవితలోని సి.వి.కృష్ణారావు రాసిన పంక్తులు కవులందరి కవిత్వాలకూ వర్తిస్తాయి.
ఆయన ఇంటిలో ప్రతి రెండో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసే కవి సమ్మేళనాల గురించి వినడమే తప్ప... నాకు 2004 దాకా వెళ్ళడం సాధ్యం కాలేదు. వారితో పరిచయం, కవి సమ్మేళనంలో వారి ఇంట పాల్గొనే అవకాశం డా||అద్దేపల్లి రామమోహన్రావు కల్పించారు. ఆ రోజు వారితో పాటు వారి ఇంట పరిచయమైన వారిలో ఒబ్బిని, మాచవోలు, శ్రీరాములు, వింజమూరి ఇత్యాదులు... వచ్చిన కవుల్ని పరిచయం చేసుకోవడం, వారి కవితల్ని వినిపింపజేయడం - చిరునామాలు రిజిస్టర్లో రాసుకోవడం, వచ్చిన వారికి చిరు ఆతిథ్యం (కార, స్వీటు, టీ లేక జ్యూస్) అందించడం... నాకు ఎంతో ఆశ్చర్యం, స్ఫూర్తిని కలిగించింది. ఎందరో కవులుగా ఆయన 'వేదిక' ద్వారా వెలుగులోకి వచ్చారని డా|| అద్దేపల్లి రామమోహన్రావు లాంటి పెద్దలు అనడం ఏదో మెచ్చుకోలు కోసం కాదు, వాస్తవం కూడా! 'నెలనెలా వెన్నెల' ఓ చక్కటి వర్క్షాపు.
సిరివెన్నెల నుండి వాడ్రేవు చిన వీరభద్రుడు, సిద్ధార్థ, శీలావీర్రాజు... ఇలా పెద్ద లిస్ట్ రాయొచ్చు. నెలనెలా వెన్నెల్లో కవిత్వం చదివి మెరుగులు దిద్దుకున్న వారి గురించి... ''దళిత, స్త్రీవాద, బహుజన, మైనార్టీ, ప్రాంతీయ, అస్తిత్వాలు వేళ్ళూనుకుని విస్తరించడానికి నెలనెలా వెన్నెలలోని ప్రజాస్వామ్యం ఎంతో దోహదపడింది'' అంటారు ప్రముఖ కవి సిద్ధార్థ. ఇది అక్షర సత్యం. వరవరరావు, జ్వాలాముఖి, శివారెడ్డి, అద్దేపల్లి లాంటి అగ్రేసర కవులూ సి.వి.గారింట కవిత్వ పఠనం చేశారంటే కృష్ణారావు గారి వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వచన కవిని, పద్య కవిని (చంధోబద్ద) సమాదరించేవారు. 90 లలో విస్తృతంగా యువతలో ప్రవేశించిన పోస్ట్ మోడ్రనిజం కవిత్వాన్ని ఆదరించి ప్రోత్సహించిన సాహితీ బ్రహ్మ సి.వి.
1926 జులై 3న రుక్మిణమ్మ, వెంకటేశ్వర శర్మ దంపతులకు జన్మించిన సి.వి.కృష్ణారావు ఈ నెల 11న (11-8-2019) ఆదివారం మలక్పేటలో క(పె)న్ను మూశారు. చింతలపాటి వెంకట కృష్ణారావు (94) నల్గొండ జిల్లా రేవూర్ గ్రామంలో జన్మించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు నల్గొండ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువ అనుబంధం వుంది. కాకినాడలో ప్రతి నెలా పౌర్ణమి రోజున 'కవితా గోష్టి' నిర్వహణ నాల్గు దశాబ్దాల కిందటే పెట్టిన కవికుల గురువు సి.వి.కృష్ణారావు. బ్యాంక్, సాంఘిక సంక్షేమ విభాగాల్లో విధులు నిర్వర్తించారు.
శ్రమజీవులతో మమేకమై వుండే సి.వి. దళితుల ఉద్వేగానికి ప్రతీకగా 'వైతరిణి, అవిశ్రాంతం' కవితా సంపుటాలు తెచ్చారు. అలాగే మహారాష్ట్రలో భూకంపం వచ్చినప్పుడు రచించిన 'కిల్లారి' ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఉద్యోగరీత్యా ఆదిలాబాద్, వరంగల్లో వున్నప్పుడు గిరిజనుల వెలుగుకై కృషి చేశారు. గోదావరి జిల్లాలో పనిచేస్తున్న కాలంలో చెంచులకు ఇళ్ళు కట్టింపజేయడంలో కృషి మరువలేనిది. అలాగే క్షీరసాగరం అంటూ పాల విప్లవం తేవడంలో గ్రామీణ పశుసంపద అభివృద్ధికి కృషి చేశారు.
ఆయన సేవాభిలాషకు గుర్తుగా ఆత్మీయులు 'నడక నావ' పేరుతో ఒక పుస్తకం వెలువరించారు. సామాన్యుల బాధలకు అక్షర రూపంగా కవితాసేద్యం కడవరకూ సాగించిన కృష్ణారావు కవులకు, కవిత్వాభిలాషులకు, సాహిత్య సాంస్కృతిక రంగ కార్యకర్తలకు, సంస్థలకు ఒక చక్కటి స్ఫూర్తి ప్రదాత.
హైదరాబాద్లో ఒకనాడు నవ్యసాహితి, తెలంగాణ రచయితల సంఘం, విశ్వసాహితి, యువభారతి లాంటి సంస్థలు కవులకు వేదిక అందించి ప్రోత్సహించేవి. అలాంటి కాలంలో 'నెలనెలా వెన్నెల'లో ప్రవేశానికి వయసు, హౌదా, సభ్యత్వం, సభ్యత్వ రుసుములు, సిద్ధాంతాలు, జెండాలు, ఎజెండాలు లేకుండా ఎలాంటి ఆంక్షలూ లేకుండా; స్త్రీ పురుషులు, కులం మతం, జాతి విబేధాలు లేకుండా అందర్నీ తన ఇంటి వెన్నెల కవిత్వ నీడలోకి ఆహ్వానించిన అరుదైన - రేపటి తరం అనుసరించాల్సిన విశిష్ట వ్యక్తిత్వం సి.వి.కృష్ణారావు గారిది. గొప్ప సహృదయుడు ఆయన. ఎందరో కవుల కవితా సంకలనాలు తన వెన్నెల్లో ఆవిష్కరింపచేసి వారికి ఆతిథ్యం, ఆరంగ్రేట్రం చేయించిన ఆదర్శ చైతన్యమూర్తి, సమైక్య స్ఫూర్తి సి.వి. తన వ్యక్తిత్వానికీ, కవిత్వానికీ మధ్య సరిహద్దు రేఖను ఆయన ఎప్పుడో చెరిపేసుకుని జీవించారు. ఏది జీవితంలో అనుభవిస్తున్నామో, అదే కవిత్వంలో చొప్పించారు. ఏది కవిత్వంలో చెప్పారో అది జీవితంలో అనుసరించారు. కొత్త కవుల్ని, కవయిత్రుల్ని ప్రోత్సహించే తత్వం సి.వి. నుండి నేడు అగ్రేసర కవులంతా అలవర్చుకోవాల్సిన గొప్ప అంశం.
- తంగిరాల చక్రవర్తి,
9393804472