Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలూనిన మట్టి, కదులుతున్న సందర్భం నిన్ను నిలువరింప చేస్తుంది, ఆలోచింపజేస్తుంది, ఒక తోవను సాక్షత్కరింప జేస్తుంది, వేలు పట్టుకుని అడుగులు వేయిస్తుంది, చేతికొక సాధనాన్నందిస్తుంది. నీకేది సాధ్యమో, అమిత ఇష్టమో, అత్యంత ప్రాణమో దాన్నందుకుని కంటికి కనిపించని, అభౌతిక కదనరంగంలోకి ప్రవేశిస్తవు. ఇక అక్కణ్ణుంచి, అప్పట్నుంచి మొదలు సాగర కల్లోలాలు, తిమింగలాలతో పెనుగులాటలు, ఒక్కమాటలో గోస... గోస... అరిగోసలు.
అలాజ్ పూర్ కిషన్ సాదా సీదా పేరు. చదువు, లౌక్యం పట్టువడలేదు. ఫలితం నిత్యకృత్యమైన సమస్యల వలయాలు చుట్టముట్టడం.
రూపం చక్కదనం, పొంగిన ముఖం. అంతరంగం లోక చింత, కట్టడి చేసుకోలేని దు:ఖం.
భాషాజ్ఞానం లేదనుకున్నడు. ఉహాజ్ఞానం చాలనుకున్నడు. అత్తెసరు అక్షరాలతో సూటిగా గురి చూసే కవి అవతారమెత్తిండు.
మనసు కలి కలి అయినప్పుడల్లా, కవిత రాసిండు. రాయరానితనానికి అందివచ్చిన చెలికాళ్లతో సరి చేయించుకుంటూ 25 కవితల అల్లికతో 'వడిసెల' రూపొందించిండు.
1996లో సిద్దిపేటలో మంజీరా రచయితల సంఘం పదేళ్ల వేడుకలో ప్రముఖ కవి, గురువు శివారెడ్డి గారి చేతుల మీదుగా 'ముందుమాట' తో పాటు ఆవిష్కరణ మహౌత్సవం జరిపించుకొన్నడు. అప్పుడు విస్మయ పడింది సాహిత్య లోకం, కిషన్ మహిమకు, అతని కవిత్వ పటిమకు.
కిషన్కి మరసం తోడైన, అవ్యాజానురాగంతో అల్లుకుపోయిన నేపథ్యముంది. సాహిత్య లోతులేవీ పెద్దగా చదివి, ముట్టలేదు. కానీ మరసం వేదికకొచ్చిపోయే ప్రముఖుల ప్రసంగాల ద్వారా సుశిక్షితుడయిండు. పక్షిని రక్షించే వేటగాని బాణం లాంటి కవితా వాక్యాలు దూయడం అవగతపరుచుకొన్నడు. ప్రశ్నించడం, నిలదీయడం - భగభగ మండడం, విలవిలలాడడం రక్తగత లక్షణమైంది అతనికి.
'వడిసెల' లోని అస్త్రాల్ని మచ్చుకి కొన్ని చవిచూద్దాం!
''పన్నెండు గంటల రాత్రి/ ప్రాణమొక్కటి పాడెపై ప్రయాణిస్తుంది/ చంద్రుడు సగం తెగి ఆకాశం చీకటి పడుతుంది/ మట్టిలోకి నీటి ఊట మాయమౌతుంది/ వాడ వాడంతా యుద్ధ సన్నివేశం/.'' కవితావరణంలో ఒక గుబులు వాతావరణాన్ని కథాకథనాత్మక శైలితో ఒక్కటొక్కటిగా ప్రవేశపెడ్తడు. కొంచెం ముందుకు సాగితే, ''తలుపులపై లాఠీలతో కొట్టగానే/ గుండె కలుక్కుమంటుంది/''
వాస్తవ దృశ్యాన్ని కళ్ళ గడతడు. ''చరిత్ర చదివినందుకు/ చెరసాలల పాలవుతాం/... సూర్యుని జాడ చెప్పమని/ వీపుపై నిప్పులు గుమ్మరిస్తారు/'' ప్రభుత్వ దమన నీతికి అర్థం వర్ణిస్తున్నడు.
''ముళ్లపొదలో మల్లెతీగల్ని/ అల్లి వుండవచ్చు/ తూరుపు పడవలో హైలెస్సా/ పాటై య్యుండవచ్చు/'', ఎన్కౌంటర్ కాబోయే వీరుడి కార్యశీలత గురించి ప్రాకృతిక భావచిత్రాలతో గాఢత కలిగిస్తడు.
''భూమీ సముద్రం ఒక్కటైన చోట/ ఉదయిస్తున్నాడని చెప్పనా/'', అంటూ వీరుని ప్రస్థానం ఆగిపోదని, పునరుత్థానం తప్పదనే సత్యాన్ని కవివాక్కుగా రూఢి పరుస్తడు.
'టార్చర్' అనే ఈ కవితలో విప్లవోద్యమ కాలం నాటి పల్లెల కల్లోలిత సంఘటనలని రికార్డు చేసిండు. కవితలో మధ్య మధ్య 'టార్చర్ టార్చర్ టార్చర్' అని పున: పున: పదప్రయోగం చేయడం ద్వారా కవిత రీఛార్జ్ అయ్యే స్థితిని పాఠకుడు పొందుతుంటడు.
''ఎవరికీ పట్టని గిట్టని పుట్టుక పుట్టినదానా'' అంటూ ప్రాసానులంకారంతో వ్యాకరణం నేర్వకపోయినా, ఉరిచ్చిన జానపద వాగ్మయ మౌఖిక జ్ఞానంతో రాయడం కిషన్ సమయస్ఫూర్తికి నిదర్శనం. పై కవితలాగే ఇదికూడా ఆవేదనాభరిత కవిత. ''గాయమైన పాపా /గేయం కాని పాపా/ రైలాగినప్పుడు కాలే కంకరరాళ్ళపై/ నువ్వు నడిచొస్తుంటే/ నా గుండెలపై నడిచినట్టుంది తల్లీ/'' అంటూ గుండెల్ని పిండేస్తడు.
ఆడపిల్ల పుటక, అడవిలో మాను పుటక ఒకటే, ఎవరికీ పట్టనిదే. కిషన్లోని కవి దాన్నే పట్టించుకుంటున్నడు.''ఐదు పైసలకే నువ్వు/ అరచెయ్యి చాచినప్పుడు /విదేశీ లాకర్లో బంధించిన/ నా తల్లి భారతి కనిపించింది నాకు/'' అంటూ తల్లి భారతి ఎట్లాంటిదో పోలికతో పోల్చి, చూపిస్తున్నడు. జాతీయ స్థితిగతులనో కంట గమనిస్తున్నందుకే ఈ పోలిక.
''నీ ఉహల పందిళ్లను కూల్చేసిందెవరు చెప్పు?/ సాక్షం చెప్పు/ నాకు సాక్షం చెప్పు/ హంతకుడెవరైతేనేం/ నేను శిక్ష విధిస్తాను/'' పరాకాష్టకు, పరిష్కారానికి తీసికెళ్ళిన కవిత. ఆర్ద్రంగా మొదలై, (పాపా! ఓ నా పాపా!!/ నిగనిగలాడాల్సిన నీ పసిబుగ్గలపై/ ఈ దేశం చేసిన గాయం కనిపిస్తుంది నాకు), హృద్యంగా సాగి (అడుక్కు తినడమే ముఖాన రాసుకున్న చెల్లీ/ ఏ చరిత్రకు సాక్షివి నువ్వు?), క్రియాత్మక, పరమార్థ పద్యంగా (శిక్ష నేను విధిస్తాను) ముగించడం, మంచి కవిత లక్షణంగ భావించవచ్చు. అందుకే ఇది రంజని- కుందుర్తి అవార్డు సాధించింది అప్పట్లో.
ఈ సంపుటిలో 'చావూ బతుకూ', 'తెలంగాణా' అనే కవితలున్నయి. 'నిలదీత' యీ కవి ఎంచుకున్న సాహస మార్గం. శర పరంపరగా సంధిస్తడు కవితా వాక్యాల్ని. ''మా ఊరికి బడెప్పుడొస్తదో/ బస్సెప్పుడొస్తదో అడగం/ వ్యానెప్పుడొస్తదో చెప్పండి/ మీ రాజభటులెప్పుడొస్తారో చెప్పండి/''. తన ఊరిని ఇట్లా కాపాడుకోవాలనే తల్లికోడి లాంటి తపనే ఆ తెగింపుకు కారణం. ''కోళ్ళనీ గొర్రెల్నీ పంటనీ దాచుకోవాలి/ మా బిడ్డల్నీ, ఉన్నకాడికి పైసల్నీ దాచుకోవాలి/... మమ్మల్నీ, మాకంటి వెలుగుల్నీ దాచుకోవాలి/'' పూర్తి వ్యతిరేకార్థాలతో 'చావూ బతుకూ' అని శీర్షిక పెట్టినట్లున్నా, రెండిటికి పెద్ద తేడా లేదనే స్పష్టపరచదలచుకొన్నడు.
ఇక 'తెలంగాణా' కవిత. దీని నిర్వహణ అంతా సంభాషణాత్మక, ప్రశ్నా జవాబు రూపంలో ఆసక్తిని కలిగిస్తూ, ఆలోచనాత్మకంగా కొనసాగుతది. అప్పట్లో ప్రయోగ వైచిత్రిగా చర్చింపబడ్డది కూడా. ''తల్లి తెలంగాణా ఏం కలగంది?/ బిడ్డలెవరి కళ్ళల్లో కన్నీరు చూడనంది/ ...సముద్రమేమంది?/ విశ్వమంతా ఒకే నినాదమై ధ్వనించమంది/ ...ఈ నేల ఏమంది?/ మరణించిన వీరుని రక్తం తన నుదుటిపై దిద్దమంది/ ...అరణ్యం ఏమంది?/ యుద్ధభూమిపై జీవించమంది/ యుద్ధభూమి ఏమంది?/ ఆయుధం ఇచ్చి సాగనంపింది/ ఆయుధం ఏమంది?/ శత్రువు గుండెలో పేలమంది/''.
కిషన్ ''పోరాడుతూ తమ ప్రాణాల్ని మల్లెల్లా వెదజల్లుతున్న వీరులకు'' ఈ సంపుటిని అంకితమించిన నిబద్దత కవి. అందుకే 'వారసత్వం' కవిత రాయగలిగిండు. ''ఖడ్గాన్ని మోసుకొస్తున్నాను'' అంటూ ''ఖడ్గమంటే/ చరిత్రకీ చరిత్రకీ మధ్య వారసత్వపు జెండా'' అని సత్య నిరూపణ చేస్తడు. ''ఖడ్గం పట్టే దగ్గరే నువ్వు నాకు దూరమయ్యింది /ఎప్పుడైనా ఖడ్గం పట్టే దగ్గరే మనం ఏకమయ్యేది'', శత్రువెవరో మిత్రుడెవరో కనిపెట్టే నిపుణతా వాక్యం ప్రయోగించిన ప్రతిభ అబ్బురపరుస్తది. ''ఖడ్గం మీదే మనం ఆశలు అల్లుకొన్నది/ ఏనాటికైనా ఖడ్గమే కదా/ మానవ మహాకావ్యాన్ని రచించేది'', అసంగతని, అస్పష్టతని, సందిగ్ధతని దరి చేరనివ్వని కవిత్వం కిషన్ది.
ఇదే త్యాగాల తోవలో నడుస్తున్న ధీరోదాత్త కవి గనకే 'సామ్రాజ్య కోర'ల నిజస్వరూపం'' వైట్ హౌస్ తెల్లగా ఉంటే చాలు వాడికి/ ప్రపంచమంతా నల్లగా ఉంటే వాడికేమిటి?/ ...డాలర్ ఆయుష్షు పెరుగుతున్నంత కాలం/ రూపాయి ఆయుష్షు తరుగుతూ ఉంటుంది/ ...మన కన్నీళ్లకు/ ఏ డాలరూ కరిగి రాదు/ ...పెరిగి పెరిగి డాలర్ ఉరితాడయి/ మెడచుట్టూ బిగుసుకుంటుంది/ భారత్ అమెరికాల రాపిడిలో/ కొత్త మానవుడు ఉదయించలేడు'' ఇదీ అని సత్య వివేచన కలిగిస్తడు.
సంపుటి 51 పేజీలే అయినా, ప్రతి పేజీ స్వచ్ఛమైన అక్షరాల్ని మోస్తున్నదే. మట్టిరేణువు నుంచి మహాకాశం దాక, జీవన హేల నుంచి మరణ జ్వాల వరకు కిషన్ కవిత్వమై పలవరించిండు.'నాకు పిడికెడు గడ్డేసి సాదరా?' అని పసురం 'గోస'.
''ఈత కొడ్తామని తొంగి చూస్తే/ ఆనాటి నిండు బాయేది?'' బాల్యంపై 'జ్ఞాపకం మిగిలింది', ''మా నొసళ్ల మీద/ కాయకష్టం చెయ్యమని రాసిండట'' కుల వివక్షపై 'అంటరాని మట్టి', ''వేల సంవత్సరాల చరిత్ర గల మానవుడు/ దేవుడి పాదాలపై ఇంకా మోకరిల్లుతాడా?'' అన్న ఇంగిత జ్ఞానంతో 'దేవుళ్ళింకా బతికే ఉన్నారా?', అంటూ పలు వైవిధ్యభరితమైన, అనుభూతి వశమైన కవితలు పఠితుల్ని ఉద్విగ పరుస్తయి.
చరమాంకంగా- అలసత్వమో, మనోవ్యాకులమో, సమస్యల సుడిగుండాల మునకో మరేదో తెలియదు కిషన్ కవిత్వానికి దూరమయిండు. అప్పట్లో మరసం మిత్రుల మధ్య ఈ చర్చ కూడా జరిగేది, రాయలేని తనానికి సమాజం కూడా పరోక్షంగానైనా కారణమౌతుందా! అని.
''కొంతమంది కవుల్ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. చాలా సామాన్యంగా, మాములుగా, అమాయకంగా ఉంటారు. ముట్టుకోండి, వేళ్ళు కాలిపోతాయి! దగ్గరగా వెళ్ళండి, తుక తుక ఉడికే మరో ప్రపంచం కనపడుతుంది. నిర్భయం రూపు తీసుకుంటున్నట్టుగా వుంటారు'' శివారెడ్డి గారి ముందుమాట కిషన్ గురించి.
తను 'కవి మూగబోడు' అని రాసుకున్నడు. ''ఏవేవి తగలబడాలో/ తగలబడే దాకా/ కవి మండుతూనే వుంటాడు'' అని.
కిషన్! నీ అక్షరాలు ఎవరూ రాయరు, రాయలేరు. నువ్వే రాయాలి. ఇన్ని సంవత్సరాల ఖాళీలు ఎదురుచూస్తున్నయి!!!
''ఈ లోపల/ గాలిరెక్కల మీద/ మనిషిని చేరుకోవాలె/ ఎవరికీ తలవంచని రేషం అద్ది/ పద్యం ఎగురవేయాలె'' -నందిని సిధారెడ్డి.
వింటున్నావా కిషన్ !!!
- దాసరాజు రామారావు,
9618224503