Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పటి కథా రచనకు, నేటి కథావిధానానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు కథంటే స్త్రీల కథలంటే నాలుగు గోడలకే పరిమితమయ్యేవి. అలాగని నాలుగు గోడలంటే గోడలు కావు. నాలుగు ప్రపంచాలు. కానీ నేడు సమాజంలో జరిగే ప్రతి సంఘటనకూ, సమస్యకు ఒక చక్కని పరిష్కారం చూపుతూ రచించే కథలు అనేకం రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో చక్కని కథా రచయిత్రిగా ముదిగంటి సుజాతారెడ్డి గారు తెలుగు పాఠక లోకానికి సుపరిచతురాలే. ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వీరి కథా సంపుటిలో ప్రతి కథా సజీవమైన శిల్పంలా అలరిస్తుంది. ఉదాహరణకు అందరి హృదయాలను బరువెక్కించే కథ ''నాటు పడ్డ వరిమొక్కలు''. .తెలంగాణ సాయుధ పోరాట సమయంలో జరిగిన సంఘటనల తర్వాత పరిణామాల్ని చిత్రించింది. సాయుధ పోరాట కాలంలో తమదైన ఊరిని, తన వాళ్ళని విడిచి వచ్చిన తర్వాత దొరల బతుకుల్లో వచ్చిన మార్పుల్ని తెలియజేసే తీరులో ఎంతో వాస్తవం కనిపిస్తోంది.
మరో కథ ''స్నిగ్థచ్ఛాయ' లో నేటి రాజకీయ స్థితిగతులు, పదవులల కోసం దిగజారుతున్న నాయకుల తీరును కళ్ళకు కట్టినట్లు తెలిపారు. పల్లెల్లో బతకలేక నగరాలకు వలసపోతున్న మనుషుల్ని, వారి కన్నీటి వ్యధల్ని 'వలస' కధలో తెలిపారు. అలాగే సారాబట్టీలు ధ్వంసం చేయాలని పాశవికంగా ప్రవర్తించిన ఎక్సైజ్ పోలీసుల దుర్మార్గం మీద సమాజ వైఖరిని ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. మార్కెట్ తీరుతెన్నుల్ని తూర్పారపెట్టే తీరులో సాగిన కథ 'మార్కెట్ యుద్ధం'. ఇవే కాకుండా 'పెండ్లి అంటే ఇది', ఈ పెండ్లి నిలుస్తుందా' సీతయ్య చెల్క, దీనికి అంతం లేదా?. 'నిత్య కల్లోలం', కథలన్నీ మహిళల జీవితాలకు సంబంధించిన వివిధ కోణాల్ని విశదీకరించారు. ఆధునికంగా సమాజం ఎంత ముందంజలో ఉన్నా సరే, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి రాలేకపోతున్నామని ఆవేదన ఈ కథల్లో కనిపిస్తుంది. దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా అన్యాయానికి పట్టం కడుతున్న ప్రభుత్వ వైఖరిని తెలియజేసే కథ ''సారీ తప్పలేదు'' ఇలా సాగిన వీరి కథలన్నీ సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని రచించినవే. ఎంతో విషయ పరిజ్ఞానంతో సాగిన వీరి కథలన్నీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. కథ పరిపూర్ణతకు కావాల్సినవన్నీ తెలుసుకుని కథా రచన చేసే ముదిగంటి సుజాతారెడ్డి గారికి ధన్యవాదాలు.
నిత్య కల్లోలం, ముదిగంటి సుజాతారెడ్డి, వెల : 150/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
- శైలజామిత్ర, 9290900879