Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైవిధ్యం అనేది బహుశ్ణ అర్థవిపరిణాపానికి గురై బహుళత్వానికి సమాంతరంగా కేవలం వస్తు ముఖంగా చూడడం మొదలుపెట్టాం. ఇప్పుడున్న నాగరిక సమాజంలో వలసల ద్వారా వచ్చి చేరుతున్న అనేక భిన్న సంస్కృతుల ద్వారా మానవుడు తన ఉనికిని కోల్పోతున్నాడు. వీటిని గమనించాల్సిన కవులు, మేధావులు కూడా ఇందులో పడిపోవటం ఒక విషాదమే. దీనివల్ల బహుళ కోణాలకు (జూశీశ్రీyస్త్రశీఅ) వైవిధ్యానికి భేదంలేని స్థితిలోకొచ్చాం. వచన కవిత వెలుగులోకొచ్చిన నాటి నుంచి వచ్చిన అనేక ఉద్యమాలలో భాగస్వామ్యమవటం ఒకటి, ఆయా ఉద్యమాల నాయకత్వాన్ని నడిపే ఆధిపత్యం ఒకటి. ఈరెండూ వైవిధ్యానికి కారణమౌతాయి. ఒక వ్యక్తి తన జీవితంలోని సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, రాజకీయాంశాలను కవిత్వం చేయడం, వాటిని అనుసరించి తన సంవేదనను చెప్పడం బహుళ కోణాలకు చెందుతుంది. తనదికాని రెండు మూడు సాంస్కృతిక క్షేత్రాలను ప్రతిబింబిస్తూ రాయడం వైవిధ్యానికి సంబంధించింది. తెలంగాణా ఉద్యమం వచ్చేదాకా తెలంగాణా కవులు, దళిత ఉద్యమం వచ్చేదాకా దళిత కవులు ఆయా మార్గాల కవిత్వాన్నెందుకు రాసుకోలేదనే అంశాన్ని పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. విశ్వ నరుడవ్వాలన్న కోరిక, భిన్నత్వంలో ఏకత్వం లాంటి వాటివల్ల కవి బలవంతంగానైనా వైవిధ్యానికి గురయ్యాడు. ఈ వైవిధ్యంలో వ్యత్యాసానికి సంబంధించిన విషయాలను మరచిపోయాడు. బహుశ: అస్తిత్వవాదాలు ప్రధానంగా చూపింది ఇదే.
వైవిధ్యం (ణఱఙవతీరఱ్y) అనేది తన నుంచి తనను వేరు చేస్తుందని గుర్తించనంత వరకు కవుల ఆత్మకు ప్రమాదకారి. వైవిధ్యాన్ని వివిధ మార్గాల్లో రాస్తూ తన ఉనికిని కాపాడు కున్నవాళ్ళున్నారు. అయితే దానిపై జరగాల్సినంత చర్చ జరగలేదు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి లాంటివాళ్ళ కవిత్వాన్ని చదివినప్పుడు ఒక వైవిధ్యభావన, సాంస్కృతిక వ్యత్యాసాన్ని గుర్తించేదిగా అంతర్గత వలసను ధిక్కరించేదిగా, సాంస్కృతిక శీలాన్ని ప్రదర్శించేదిగా కనిపిస్తుంది. ఇటీవల వచ్చిన 'తావు' కాకుండా సుమారు తొంభైనాలుగు తరువాత సుంకిరెడ్డి ప్రత్యేకంగా తన సంపుటిని తేలేదు. అందువల్ల అప్పటికి బలపడ్డ ప్రాంతీయాస్తిత్వ వాదం, ప్రపంచీకరణ రెండూ ఆయన కవిత్వంలో కనిపిస్తాయి. బహుశ: రాజకీయంగా అంతర్గతంగా ఆంధ్రప్రభావం, సాంస్కృతికంగా ఊర్లు, చెరువులు, గుట్టలు లాంటి ఊరి ఉనికిపట్టులు నాశనమవడం ప్రపంచీకరణ ప్రభావంగా ఈ రెండు ప్రధాన సమస్యలుగా కవులకు కనిపించాయి. 'తావు'లో ప్రధానంగా కనిపించేవి ఇవే. చింతనా ముఖంగా సాంస్కృతిక, రాజకీయ భూమికలు రెండూ సుంకిరెడ్డి కవితకు ప్రాణాలు. సాంస్కృతికంగా భాష, భౌగోళికత లాంటివి ఆయన కవిత్వంలో ఎలా సంలీనమౌతాయో, దృష్టి ముఖంగా రాజకీయ భూమికతో ప్రాంతీయమైన వలసాధిపత్యం ప్రపంచీకరణ రెండూ కనిపిస్తాయి. రాజకీయ, ఆర్థిక పరిమితులే కాకుండ, సాంస్కృతికమైన వ్యత్యాసాలను వీటిని ఆనుకుని ఉన్న సాంస్కృతిక మానవుని వ్యక్తిత్వాన్ని గమనించి ఆ ఉనికిలోంచి మాట్లాడడం కావాలి.
1. ''మీ బాట్ల ఎత్తుల్లో పాసంగం కోల్పోయిన వాణ్ణి/ మీ కాంటాసిరిమానుకు వేలాడుతున్న వెన్నెముకను/ కోండ్రలు లెక్కబెట్తి నేర్చుకున్న ఒకటి రెండ్లు/ మీ క్ల్యాలిక్యులేటర్ల మాయలో సున్నాలవుతున్నయి/ పెయి మీద బట్తలేక కూరటికెల నూనె లేక/ గింజల్ని దాయలేమనేగదరా/ మాకల్లాలు కళకళ్ళాడగానే/ ధరల చీటీ పాతాళానికి పడేసేది'' -(కాంటా.61.పే.)
2. ''నలభైయ్యేండ్లు నుంచి నడిచి నడిచి/ వూరికి నల్లగొండకూ/ వుయ్యాలోతిగ వచ్చిన ఈ రోడ్డు/ పాన్పుగాని పాన్పులా పరుసుకున్న ఈ రోడ్డు/ తరాల తరబడి/ నిలువ నీరుకు తీసిన కాల్వలా ఈ రోడ్డు/ గూడు కట్టుకున్న గూడు నుంచి/ ఎత్తి బయట పోసే ఏతం లెక్క ఈ రోడ్డు/ అక్కడక్కడ తిరిగే గాలికి/ ఎగ్జాస్టు ప్యాన్లా ఈ రోడ్డు/ ఎక్కడెక్కడి కొత్త గాలికో/ ఆహ్వాన పత్రంవోలిగ ఈ రోడ్డు/ సిలికాన్ వ్యాలీ నుంచి మావూర్లెకు దూకే/ సమాచార ప్రవాహంలా ఈ రోడ్డు/ దొరల కొమ్ములకేసే పగ్గంలా ఈ రోడ్డు'' - (రోడ్డు-53.పే)
3. చల్లని వానచినుకు లోపలికి దిగుతుంటె/ భూమిలోంచి సెగ ఎగజిమ్మినట్టు/ దొంగలు సొమ్ములు వొలుచుకున్నట్టు/ ఎవనికి కావలసిన పేజీలను/ వాడు చింపుకున్నాంక/ మిగిలిన అట్టల్లా/ ఇక్కడ ఇట్లా ఉన్న''
''చెలకలన్నీ చేతులు మారితే/ మిగిలిన రాళ్లబోడుబోతిగ/ పాయలన్నీ తలవంచుకపోతే మిగిలిన నదీ కళేబరంలా/ ఇప్పుడు ఇక్కడిట్లా ఉన్నా!'' - (అవతల.29పే.)
సమకాలీనంగా ఉండే వస్తువులే సుంకిరెడ్డి కవిత్వానికి దగ్గరవి. ముఖ్యంగా తెలంగాణా ఉద్యమం, దళిత బహుజన వాదాలు, ప్రపంచీకరణ ఇవన్నీ ఆయన కవిత్వంలో కనిపిస్తాయి. ఇతివృత్తగతంగా గమనిస్తే మొదటి రెండు కవితాభాగాలు ప్రపంచీకరణకు సంబంధించినవి. మొదటిది కార్పొరేటీకరణ వల్ల మధ్యవర్తుల ప్రాబల్యం పెరిగి రైతుల పంటలు విలువను కోల్పోతున్న అంశాన్ని, వాటి పరిణామాలను ఒక రైతు గొంతుకనుంచి సృష్టించిన కవితాభాగం. రెండవ ఇతివృత్తం రోడ్డు. ఇక్కడ రోడ్డు రావడం ఊరికుండే చరిత్ర. అందులోని మార్పులను గమనించారు. కొత్త విషయాలను, సంస్కృతిని లోపలికి తీసుకువస్తుందన్న ఎరుకతోపాటే మంచీ చెడులను రెంటినీ ఈ కవిత గమనించింది. ప్రపంచీకరణ కవిత్వం మొదటి భాగంలో రోడ్డు, టీవీ ప్రధానంగా చాలా కవిత్వం వచ్చింది. వ్యాపారానికి ఈ రెండు ప్రత్యక్ష పరోక్ష ప్రేరకాలు. మూడవ భాగం ఒకటి రెండు వాక్యాలను వదిలేస్తే కవిత మొత్తమొక పారమార్థికత (యూనివర్సాలిటీ) కోసం ప్రయత్నం చేసింది. అందువల్ల ఇతివృత్తం,వస్తువు తెలియకుండా నైరూప్యంగా సాగింది కవిత. చివరలో- ''నా నీడ కిందికొచ్చినోడు నా మీద మర్రి చెట్టయినడు'' - లాంటి వాటివల్ల తెలంగాణ ప్రాంతీయత ధ్వనిస్తుంది. చివరి భాగం దళిత బహుజన జీవితాలకు సంబంధించింది. ఇక్కడ గమనించాల్సింది తానే ఒక ప్రతి పాత్రగా రాయడం. చాలా మంది సహానుభూతి కవిత్వాన్ని రాసి సంఘీభావాన్ని ప్రకటిస్తారు. కాని ఇందులో తన ఉనికిని వదలకుండా సంఘీభావాన్ని చెప్పడం కనిపిస్తుంది. ఇలాంటి కవిత్వం, ఈ కోణంలో వచ్చింది చాలా తక్కువ. ఇవి ప్రధాన వాహకాలుగా సమకాలీనతతో కనిపించేవి. మరొకొన్ని కవితలు ఇలాంటివే. అజం అలీ స్మృతిలో రాసిన కవితతో సహా అనేక కవితలు సుంకిరెడ్డి నిజాయితీని చెబుతాయి.
సాంస్కృతికమైన ఉనికి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కవితకు ఆయువు పట్టు. ఈ డైవర్సిటీనుంచి తప్పించిందీ అదే. భాషను ప్రధాన సాంస్కృతిక పరికరంగా వాడుకుని ప్రాంతీయతను, సంస్కృతిని, భాషను పరికరాలుగా చేసుకుని సమకాలీన అంశాలను వ్యక్తం చేయడం ద్వారా ఈ కవిత తన ఉనికిని నిలబెట్టుకుని, సైద్ధాంతికమైన ప్రామాణిక ముసుగు నుంచి తప్పించుకుంది. చెప్పడం ప్రపంచీకరణ గురించే చెప్పినా -
'బాటు, పాసంగం, కాంటా, సిరిమాను, కోండ్రలు, కూరటికె, కల్లం' లాంటి పదాలను ఉపయోగించడం ద్వారా - 'నిలువ నీరుకు తీసిన కాలవ', 'ఎత్తి బయటపోసే ఏతం' లాంటి పోలికల ద్వారా ఉనికిని ప్రసారం చేశారు.
నిజానికి కవిత్వభాష అధిభాష (వీవ్a శ్రీఱఅస్త్రబaశ్రీ) సాధారణ భాషకు సారూప్యం లేనిది. దానికి కారణం సమాచారాన్నుంచి, ప్రకటన దాకా కవిత్వ భాష విలువ ఉంటుంది. సాంస్కృతిక మేళనలో భాగంగా పదజాలాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని సమస్యలున్నాయి. ప్రకటనకు సరిపడే పదాలు లేకపోవడం వల్ల నాటకీయభాషను ఉపయోగించడం ఇందులో ఒక భాగం. దీనికి కారణం ప్రమాణభాషను వదులుకోలేక, పూర్తిగా సాంస్కృతిక ప్రాతినిధ్యాన్ని అనుసరించలేక ఉండడం. అందువల్ల డ్రమెటిక్గా భాషను ఉపయోగిచడం కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం తరువాత ఈ స్థితి ప్రమాణస్థాయికి చేరింది. పూర్తి ప్రాంతీయ నుడికారంతో కవిత్వం రాయడంలో కొన్ని సమస్యలున్నాయి. వాటిని అధిగమించలేని సమయంలో నాటకీయతకు వాక్యాలు వెళతాయి. ఒకరకంగా చెప్పాలంటే కృత్రిమ నుడికారమొకటి రూపొందుతుంది ఈ సమయంలో.
ఈ సమయంలోనే వాక్యాన్నివ్వడంలో నారాయణ రెడ్డి శైలిని గురించి చెప్పుకోవాలి. సాంస్కృతిక స్థలాన్ని, విలువను, గొంతును చేతబట్టుకున్న పదాలతో వాక్యాన్ని సృష్టించడమొక భాగమైతే, కృతకమైన నుడికారాన్ని సృష్టించకపోవడం మరో అంశం ఈ కవితా వాక్యాల్లో. అందువల్ల ప్రామాణిక అధిభాషా స్థితి, నుడికారం వల్ల తొలగించుకున్న వైవిధ్యతా ముసుగు, వీటన్నిటిని మేళవించుకుని తన ఉనికిలోంచి స్పష్టంగా కవిత్వమవడం ఈ కవిత్వాన్ని నిలబెడుతుంది. సాధారణంగా సమకాలీన అంశాలనీ కనిపించినా చాలా మంది వదిలించుకోలేని, వదులుకోలేని శైలిని ఈ కవిత్వం వదులుకుంది. అందువల్లే ప్రత్యేకంగా కనిపిస్తుంది. వ్యక్తి విలువలను శైలిని నశింపజేస్తున్న ప్రామాణికత నుంచి జాగరుకతగా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కవిత్వం తప్పించుకుంది. ఈ శైలిమీద ఇంకా విశ్లేషణలు కొనసాగాల్సిన అవసరం ఉంది. అప్పుడే వైయ్యక్తిక ముద్రలు, సాంస్కృతిక ముద్రలు, సామాజిక ముద్రలను మరింతగా గుర్తించవచ్చు.
- ఎం. నారాయణశర్మ, 98483 48502