Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇతిహాసాల్లోని ఘట్టాలను కథావస్తువులుగా తీసుకుని ఇప్పటి పరిస్థితులకు అన్వయిస్తూ కన్నడంలో ప్రభాకర శిశిల నవలలు రాశారు. ఆయన రాసిన నవలల్లో మత్స్యగ్రంధి కూడా ఒకటి. మత్స్యగ్రంధిని మహిళల ఆత్మస్థయిర్యానికి ప్రతీకగా ఈ నవలలో రచయిత చిత్రీకరించారు. ఈ నవలలోని మత్స్యగ్రంధిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. భర్తను, ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నా ఆమె ధైర్యాన్ని కోల్పోదు. మత్స్యగ్రంధి దాశరాజు, కంధరాల పెంపుడు కూతురు. వారి బెస్తవాడలో అందరికీ ప్రియమైనది. పరాశర మునికి తనను తాను అర్పించుకుంటుంది. ఆయన ద్వారా విద్యావంతురాలవుతుంది. కృష్ణ ద్వైపాయనుడికి జన్మనిస్తుంది. పరిస్థితుల కారణంగా శంతన మహారాజును పెళ్ళాడుతుంది. భర్త, ఇద్దరు కుమారులు మరణించిన తరువాత భీష్ముడి సహాయంతో కురు సామ్రాజ్యాన్ని రక్షిస్తుంది. అంబిక - అంబాలికలతో నియోగానికి వేదవ్యాసుడిని రప్పించి కురు సామ్రాజ్య పతనం చెందకుండా చూస్తుంది. విచిత్రవీర్యుడు మరణిస్తే తన కోడళ్ళయిన అంబిక - అంబాలికల మంగళ సూత్రాలు తొలగించడానికి మత్స్యగ్రంధి అంగీకరించదు. అందరినీ ఎదిరించి బ్రహ్మచారైన భీష్ముడి చేత విచిత్రవీర్యుని అంత్యక్రియలు జరిపిస్తుంది. ఈ నవలలో అంబ అప్పటి పరిస్థితులకు ఎదురొడ్డి శస్త్రవిద్య, శాస్త్రవిద్యను అభ్యసిస్తుంది. మత్స్యగ్రంధి నవలలో శంతన మహారాజు ఆదర్శాల కోసం జీవించిన వ్యక్తిగా రచయిత చిత్రించారు. శంతనుడు కులాంతర వివాహం చేసుకుంటాడు. వివాహానికి జాతి, కులం ముఖ్యం కాదని, మనసు ముఖ్యమని అంటాడు. స్త్రీలకు మగవాళ్ళకున్నటువంటి హక్కులుండాలంటాడు. భర్త మరణిస్తే స్త్రీలు తమ ఒంటిమీదున్న మంగళ చిహ్నాలు తొలగించరాదని చట్టం చేశాడు. వితంతువుల పునర్వివాహాన్ని సమర్ధించాడు. కన్నడంలోని ఈ నవలను వేలూరి కృష్ణమూర్తి తెలుగులోకి అందంగా అనువదించారు. అనువాదం చదివించేదిగా వుంది.
మత్స్యగ్రంధి (నవల), కన్నడం : డా||ప్రభాకర్ శిశిర, అనుసృజన : వేలూరి కృష్ణమూర్తి, వెల : 90/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
- తెలిదేవర భానుమూర్తి,
9959150491