Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్నిసార్లు అనుకోకుండా జరిగిన సంఘటనలు కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయేమో! ఆదిలాబాద్ ఆకాశవాణిలో పనిచేస్తూ అక్కడి ఆదివాసీ సంస్కృతులను అధ్యయనం చేస్తూ వారితో మమేకమైన సుమనస్పతి రాజ్ గోండులపై మానవ విజ్ఞానవేత్త మైకల్ యార్క్ 40 ఏళ్ల క్రితం నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రంRaj Gonds- Reflections in a Peacock Crown.. యాదృచ్ఛికంగా చూడటం తటస్థించినప్పుడు వారిరువురి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలల్లో యార్క్ ఆదిలాబాద్ రాజ్ గోండుల గిరిజనుల సంస్కృతి, జీవన వ్యవహారాలపై తీసిన 1500 ఫొటోలు లభించడం, ఆయన పరిశోధనా వివరాలు తెలియడం, ఎంతో ఉత్సుకతను ప్రోది చేసి రాజ్ గోండుల సంస్కృతీ ఆచారాలపై కొత్త వెలుగులు పంచే ప్రయత్నానికి దారితీశాయి.
మైకేల్ యార్క్ రాజ్ గోండులపై నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని, ఆయన తీసిన ఫొటోలను ఆదిలాబాద్ జిల్లా గోండు ప్రజలకు కేస్లాపూర్ నాగోబా జాతరలో, తిర్యానీ ప్రాంతంలోని గ్రామాల్లో ప్రదర్శించినప్పుడు తమ గత జీవన సంప్రదాయాల్లోకి ఒక్కసారిగా వెళ్లిపోయిన అనుభూతిని పొందగలిగారు. వారిలో పెరిగిన ఆ కుతూహలం ఇదిగో 'వేలిత పాట' అన్న పుస్తక ప్రచురణకు ప్రేరణగా మారింది. ఇటీవలే ఆ పుస్తకం ఆవిష్కరణకు నోచుకుంది. ఈ పుస్తకంలోని రెండు వ్యాసాలు మైకల్ యార్క్ 1976-79 సంవత్సరాల మధ్యకాలంలో రాజ్ గోండులపై చేసిన సమగ్ర పరిశీలనలు. అంతకు ముందే గోండులపై పరిశోధనచేసి పలుగ్రంథాలు వెలువరించిన విఖ్యాత మానవ విజ్ఞానవేత్త హైమండార్ఫ్ 76-79 మధ్యకాలంలో వారిపై అసంపూర్తిగా ఉన్న తన పరిశోధన పూర్తి చేయడం కోసం ఆదిలాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు మైకల్ యార్క్ వారి సహాయకుడిగా ఉంటూ రచించిన పరిశోధక వ్యాసాలివి. ఇది ఈ పుస్తకానికున్న భూమిక లేదా నేపథ్యం. కాలం తెచ్చిన మార్పుల మధ్య తమ సంస్కృతి నుండి కొంత దూరమవుతున్న రాజ్ గోండుల కొత్త తరాల వారికి వారి సంస్కృతిలోని, ఇటీవలి చరిత్రలోని కొన్ని లోతైన విశేషాలను పరిచయం చేస్తూ, వారు గమనించేలా చేయటం ఈ పుస్తకం ఉద్దేశ్యం.
ఈ పుస్తకం లోని రెండు సుదీర్ఘ వ్యాసాలు కొంత సాంకేతికంగా ఉన్నట్టనిపిస్తాయి. అయితేనేం రాజ్ గోండుల సంస్కృతిని అర్థం చేసుకోవటానికి ఎంతగానో ఇవి ఉపకరిస్తాయి. మొదటి వ్యాసం 'రాజ్ గోండ్లలోని చుట్టరికాలు, పెండ్లిండ్లు, ప్రాపంచిక దృక్పథం : దక్షిణభారతదేశ నేపథ్యంలో ఒక గిరిజన వ్యవస్థ(1979)'. ఇక రెండవ వ్యాసం 'ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్, లక్సెట్టిపేట తాలుకాల్లో గోండుల పరిస్థితి (1982)'. ఈ రెండు ఆంగ్ల వ్యాసాలను లలిత తెలుగులోకి అనువదిస్తే, సుమనస్పతి సంపాదకత్వం వహించి వేలిత పాట (తీగ పాట)గా తీసుకొచ్చారు. తెలంగాణ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ ప్రచురించింది.
'వేలిత పాట' అన్నపేరు ఎందుకు పెట్టారీ పుస్తకానికి అన్న ప్రశ్నకు సమాధానం మొదటి వ్యాసంలో లభిస్తుంది. గోండు సమాజంలో అప్పుడే పుట్టిన పిల్ల లేదా పిల్లవాడిని ఆహ్వానిస్తూ పాడే పాట వేలిత పాట లేదా తీగ పాట. గోండు ప్రజల ఇళ్ళ పైకప్పు మీద గుమ్మడితీగలను పెంచుతారు. అందులో పొడవైన నులితీగ పెరిగి మగపూలు పూస్తే, చిన్న ఆడతీగ బయలుదేరి కాయలు కాస్తుంది. ఈ తీగలిక్కడ కుటుంబ సంస్కృతికి ప్రతీకలు అంటారు రచయిత. అలా ఈ పుస్తకానికి వేలిత పాట అంటే తీగ పాట అన్న ఉద్దేశ్యంతో పేరు పెట్టారు సంపాదకుడు. అలా మొదలైన వ్యాసం రాజ్ గోండుల సామాజిక, కుటుంబ సంబంధాల్లోని అనేక విశేషాలను పరిచయం చేస్తుంది. ఇవన్నీ బయటి సమూహాల వారికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా రాజ్ గోండు కుటుంబాలలోని ఈ తరం వారికి తమ మూలాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. వారి పురాణగాథలూ, వారు తమ తెగను నిలుపుకునే క్రమమూ, అందులోని కష్టాలు అందరికీ పరిచయం అవుతాయి. కొన్ని కొత్త పదబంధాలు, వాటిలోని సంబంధాలు పాఠకుడూ తెలుసుకుంటాడు. గోండుల గోత్ర వ్యవస్థను సగ, పాడి రెండూ పటిష్టం చేస్తాయంటారు రచయిత. ప్రతి సగకూ దాని పెర్సపేన్ ఉంటాడు. ఇక్కడ పర్సపేన్ అంటే గోత్ర దేవతగా చెప్పుకోవచ్చు. ఈ వ్యాసంలో ఇంకా ప్రతి సగలోనూ ఉపవిభజనలు ఎలా ఉంటాయి, ఏ 'పాడి' ఏ 'సగ'కు చెందిందో ఎలా తెలుస్తుంది అన్న అంశాలు ప్రస్తావిస్తూ రచయిత గోండుల పురాణగాథలనూ, వాటిచుట్టూ అల్లుకున్న ప్రాపంచిక దృక్పథాన్ని పరిచయం చేస్తారు. పెండ్లిండ్లు ఎలా జరుగుతాయో చెబుతూ మొదటి వివాహాన్ని 'మర్మి' అంటారని; పెళ్లి తంతును, అలాగే వైవాహిక వ్యవస్థలో ఉండే కట్టుబాట్లను గోండు సమాజం ఏర్పరిచిన తీరును వివరిస్తారు. వైవాహిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థను ఎలా తీర్చిదిద్దుతుందో అన్న అవగాహన వారిలో స్ఫుటంగా ఉన్నట్టు మనం గమనిస్తాం. ఇందుకు రచయిత చేసిన లోతైన పరిశీలనలూ, పరిశోధనలు ఉపకరిస్తాయి. మారు మనువును 'పాట్' పెళ్లి అంటారని దానికుండే నియమాలను పరిచయం చేస్తారు. ఇక్కడ రచయిత ఒక మాటంటారు. ''ద్రావిడ ప్రాంతపు చుట్టరికాల వరుసలోనే పాటిస్తున్నా, ద్రావిడ ప్రాంతపు కుల వ్యవస్థలో ఉండే సామాజిక స్థాయి నిచ్చెన మెట్ల తారతమ్యాలు గోండు సమాజంలో ఉండవు'' అని. ఇలా మొదటి వ్యాసం మానవజన్మ అనేది భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం అనే పంచభూతాలతో కూడినదని గోండులు విశ్వసిస్తారని ప్రారంభించి... ఆ తర్వాత కుటుంబంలోని వివిధ దశలను ఆ దశలలోని ఆచారాలను వివరిస్తూ సాగుతుంది. కుల ప్రాతిపదిక లేని గోండు సమాజంలో గోత్రాచార వ్యవస్థ నిర్మాణం ముఖ్యం అంటారు రచయిత.
ఇక రెండో వ్యాసం 'ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, లక్సెట్టిపేట ప్రాంతాలలోని గోండు జీవితాల్లోని ఆర్థిక మార్పులు సామాజిక బంధాల్లో తెచ్చిన మార్పుల'ను' వివరిస్తుంది. ఒకప్పుడు గోండులకు సొంత రాజ్యాలు, కోటలు ఉండేవని, అవి కోల్పోయిన తరువాత వారు పూర్తిగా అడవుల పైన, అడవుల్లోనే కొద్ది స్థాయి వ్యవసాయం పైన ఆధారపడే జాతిగా మారారని, వారికి కుల వ్యవస్థ ఉన్న సమాజంతో పెద్దగా సంబంధాలు ఉండేవి కాదని, గోండు కథాగాయకులుగా తోటి, పర్దానులు ఉండటం, అలాగే కొలాములు, నాయకపోడు తెగల వారితో గోండు సమాజం మెలిగే తీరూ మనకి తెలిసివస్తాయి. ఎప్పుడయితే భూమి ఒక వనరుగా మారిందో వలసకులాలవారు, అగ్రకుల భూస్వాములు వారి ప్రాంతాల్లోకి చొరబడి, వారిని అణచివేసిన తీరు, అది ఏ విధంగా గోండు సమాజాన్ని కుదిపేసి కొమురం భీమ్ నాయకత్వంలో బాబేఝరి తిరుగుబాటుకు కారణమైందో కూడా విశ్లేషిస్తారు. దీనికి తోడుగా హైమండార్ఫ్ చేసిన విజ్ఞాన పరిశోధనలు గిరిజనుల పట్ల అప్పటి నిజాం ప్రభుత్వం దృక్పథంలో మార్పు తెచ్చాయంటారు. నిజాం పాలనలో ట్రైబ్స్ లేక ప్రత్యేక తెగలుగా, తరువాత స్వాతంత్య్రానంతర కాలంలో ప్రభుత్వం వారిని ఆదివాసీలుగా గుర్తించి పట్టాభూములివ్వడం కూడా వారిలో తెచ్చిన మార్పులతో పాటుగా, కొత్త చొరబాటుల కారణంగా వారిలో రాజుకున్న అసంతృప్తులను విపులంగా చర్చిస్తుంది రెండో వ్యాసం.
మొదటి వ్యాసం ఆచార సంప్రదాయాలను, కౌటుంబిక బంధాలను, గోత్ర దేవతలను, పెండ్లిండ్ల విధానాలను మొత్తం రాజ్ గోండులలో ఉండే అనేక రీతుల్ని, విధానాలను వివరిస్తే; రెండో వ్యాసం రాజ్ గోండుల జీవిత విధానాన్ని, ఇతర జాతులతో వారికుండే సంబంధం బాంధవ్యాలను వివరిస్తూ సాగటమే కాకుండా రాజ్ గోండులు ఏవిధంగా భూమిని కోల్పోయారో, ప్రభుత్వ చర్యలు కొంత ఉపశమనాన్నిచ్చే విధంగా ఎలా రూపొందాయో చెబుతూనే వలసవాదుల ప్రభావం వారి జీవన విధానంపై చూపిన ప్రభావం తీరును వివరిస్తుంది. తద్వారా వారిలో చెలరేగిన సంఘర్షణ, వారిలో తెచ్చిన మార్పు లేదా రాజీపడిన తీరును వివరిస్తుంది. గోండు సమాజపు అంతర్ముఖత్వానికి కారణాలను విశ్లేషించి చూపుతాయి ఈ వ్యాసాలు
అలా ఈ రెండు వ్యాసాల సంకలనం 'వేలిత పాట' రాజ్ గోండుల సమాజాన్ని అతి నిశితంగా చూపించి, మనకో కొత్త చూపునిస్తుంది. ఆ చూపుతో సమాజ నిర్మాణంలో సామాజిక న్యాయం అవసరాన్ని గుర్తు చేస్తుంది.
ఈ రెండు వ్యాసాలతో బాటు 'ఆదిలాబాద్తో నా అనుబంధం' అంటూ సాగిన మైఖేల్ యార్క్ వ్యాసం మన మనసులను దోచుకుంటుంది. వారు గోండీ భాషను నేర్చకున్న తీరు, బిబిసి టెలివిజన్ బృందాన్ని రప్పించి Raj Gonds: Reflections in a peacock krown నిర్మించిన డాక్యుమెంటరీ తరువాతి కాలంలో ఆయన జీవనగమనాన్నే మార్చేశాయని గర్వంగా చెప్పుకున్న వైనం ఈ ప్రాంతం పట్ల ఆయన ప్రేమకు సంకేతంగా నిలుస్తాయి.
పుస్తకాన్ని ఎంతో ప్రేమగా రూపొందించిన సంపాదకులు సుమనస్పతికి కృతజ్ఞతలు తెలియచేయాల్సిందే. దానితోబాటు అందమైన ముందుమాట కూడా ఆకర్షించేదే.
అదేవిధంగా అనువాదకురాలు ల.లి.త. గారికి అభినందనలు.
- సి.యస్.రాంబాబు,
9490401005